త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

POCSO Case Hyderabad | చాక్లెట్ ఆశచూపి చిన్నారిపై దారుణం.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు, నిందితుడికి ఐదేళ్ల జైలు!

రాజేంద్రనగర్‌లో 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. షీ టీమ్స్ అవగాహన సదస్సుతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

J

Hyderabad | Published On Jul 1, 2026, 5.44 pm IST

POCSO Case Hyderabad | చాక్లెట్ ఆశచూపి చిన్నారిపై దారుణం.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు, నిందితుడికి ఐదేళ్ల జైలు!
Advertisement
  • రాజేంద్రనగర్ పరిధిలో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన 52 ఏళ్ల నిందితుడికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష
  • బాధితురాలికి రూ. 50 వేల పరిహారం చెల్లించాలని రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు (POCSO) తీర్పు
  • చాక్లెట్ ఇస్తానని ఆశచూపి దారుణానికి ఒడిగట్టిన పొరుగు వ్యక్తి
  • స్కూల్‌లో 'షీ టీమ్' (SHE Team) నిర్వహించిన అవేర్‌నెస్ ప్రోగ్రామ్ ద్వారా ధైర్యంగా విషయాన్ని బయటపెట్టిన బాధితురాలు

POCSO Case Hyderabad | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కీచకుడికి న్యాయస్థానం తగిన శాస్తి చేసింది. పోక్సో (POCSO) కేసులో నిందితుడికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని 'ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్' జూన్ 30, 2026న సంచలన తీర్పు వెలువరించింది.

అసలేం జరిగిందంటే

రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని బుద్వేల్ శ్రీ శివసాయి కాలనీలో సత్యనారాయణ మన్మరి అలియాస్ నారాయణ చారి (52) అనే కార్ పెయింటర్ నివాసం ఉంటున్నాడు. వరుసకు తాతయ్య వయసున్న ఆ కామాంధుడు తన పొరుగున ఉండే 11 ఏళ్ల మైనర్ బాలికపై కన్నేశాడు. ఫిబ్రవరి 2023లో ఆ చిన్నారికి చాక్లెట్ ఇస్తానని ఆశ చూపి.. తన గదిలోకి తీసుకెళ్లి లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అయినా బుద్ధిమారని ఆ కీచకుడు.. రెండు మూడు రోజుల తర్వాత మళ్లీ ఆ బాలికపై దాడికి యత్నించాడు. అది గమనించిన స్థానికులు నిందితుడిని కర్రలతో దేహశుద్ధి చేసి చిన్నారిని కాపాడారు.

ధైర్యం నింపిన 'షీ టీమ్' (SHE Team)

ఈ ఘటనతో భయపడిపోయిన ఆ చిన్నారికి.. పాఠశాలలో పోలీసులు నిర్వహించిన 'షీ టీమ్' అవేర్‌నెస్ ప్రోగ్రామ్ ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఆ సదస్సులో బాధితురాలు తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు వివరించింది. దీంతో వెంటనే అలర్ట్ అయిన షీ టీమ్ సిబ్బంది.. బాధితురాలి కుటుంబ సభ్యులను రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేయించారు.

కోర్టు తీర్పు.. పోలీసుల సక్సెస్

పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 506, 354-A(1) తో పాటు పోక్సో యాక్ట్ (POCSO Act) కింద కేసు నమోదు చేశారు. పక్కా ఆధారాలు సేకరించి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. కేసును సమగ్రంగా విచారించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు గౌరవ న్యాయమూర్తి.. నేరం రుజువు కావడంతో నిందితుడికి 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష (Rigorous Imprisonment) తో పాటు రూ. 1,000 జరిమానా విధించారు. అలాగే బాధితురాలికి రూ. 50,000 పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది.

ఈ కేసులో పక్కాగా ఇన్వెస్టిగేషన్ చేసి నిందితుడికి శిక్ష పడేలా చేసిన రాజేంద్రనగర్ ఎస్‌హెచ్‌వో (SHO) ఎం. ముత్తు యాదవ్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ (SI) ఎం. మౌనికలను ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ప్రాసిక్యూషన్ తరఫున సమర్థవంతంగా వాదనలు వినిపించిన స్పెషల్ పీపీ బి.వెంకటేశ్వర్ రెడ్డి, కోర్టు డ్యూటీ ఆఫీసర్ వి. కృష్ణయ్య, ఇతర సిబ్బంది కృషిని కొనియాడారు. బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే పోక్సో చట్టం కింద కఠిన శిక్షలు తప్పవని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.

Advertisement
Advertisement