త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Konda Surekha Letter To Sonia Gandhi | నన్ను డమ్మీ మంత్రిని చేశారు.. రేవంత్ కావాలనే నన్ను అణగదొక్కారు

మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన కొండా సురేఖ.. సోనియా గాంధీకి రాసిన లేఖ లీక్ అయింది. సీఎం రేవంత్ తనను ఎలా అణగదొక్కారో ఈ లెటర్ లో పూసగుచ్చినట్లు వివరించారు.

J

Telangana | Published On Sep 3, 2026, 4.55 pm IST

Konda Surekha Letter To Sonia Gandhi | నన్ను డమ్మీ మంత్రిని చేశారు.. రేవంత్ కావాలనే నన్ను అణగదొక్కారు

సంక్షిప్త సారాంశం

కూతురు సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కొండా సురేఖను మంత్రి పదవి నుంచి సీఎం రేవంత్ రెడ్డి బర్తరఫ్ చేశారు. రాజీనామాకు సురేఖ నిరాకరించడంతో, గవర్నర్ ఆమోదంతో ఆమెను క్యాబినెట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పించింది. అయితే, బర్తరఫ్‌కు ముందే ఆగస్టు 22న సోనియా గాంధీకి సురేఖ రాసిన 10 పేజీల సంచలన లేఖ తాజాగా వెలుగులోకి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి తన శాఖల్లో జోక్యం చేసుకుంటూ తనను డమ్మీని చేశారని, ఓఎస్డీపై కక్షగట్టారని సోనియాకు సురేఖ ఫిర్యాదు చేశారు. వరంగల్ జిల్లా రాజకీయాల్లో కడియం శ్రీహరి పెత్తనం, నిధుల కోత, బీసీ మహిళననే వివక్ష తదితర అంశాలపై లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
  • సీఎం రేవంత్ నన్ను ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేశారు
  • కనీసం నాకు చెప్పకుండా నా మాజీ ఓఎస్డీ సుమంత్‌ను పదవి నుంచి తప్పించారు
  • బీసీ మహిళనని నాపై వివక్ష చూపించారు
  • సోనియాకు కొండా సురేఖ రాసిన సంచలన లేఖ వెలుగులోకి

Konda Surekha Letter To Sonia Gandhi | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాజకీయాల్లో కొండా సురేఖ బర్తరఫ్ ఎపిసోడ్ తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఆగస్టు 19న వరంగల్ జిల్లా గీసుకొండలో జరిగిన సురేఖ పుట్టినరోజు వేడుకల్లో ఆమె కుమార్తె కొండా సుస్మిత పటేల్.. సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న కాంగ్రెస్ హైకమాండ్.. సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ, బెంగళూరు వేదికగా మల్లికార్జున ఖర్గేతో ఆమె జరిపిన రాయబారాలు ఫలించలేదు. మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు ఆమె ససేమిరా అనడంతో, సీఎస్ ద్వారా లేఖ పంపిన సీఎం రేవంత్.. గవర్నర్ ఆమోదంతో సురేఖను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు.

అయితే, తనను బర్తరఫ్ చేయకముందే తన ఆవేదనను వ్యక్తంచేస్తూ ఆగస్టు 22న ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీకి కొండా సురేఖ రాసిన 10 పేజీల రహస్య లేఖ ఇప్పుడు బయటకు వచ్చి ప్రకంపనలు సృష్టిస్తోంది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల్లో తన ప్రమేయం లేకుండానే సీఎంవో నేరుగా నిర్ణయాలు తీసుకుంటోందని, తనను ఒక డమ్మీ మంత్రిని చేశారని సురేఖ ఆ లేఖలో సంచలన ఆరోపణలు చేశారు.

సోనియాకు రాసిన లేఖలోని కీలక అంశాలు

నా శాఖలో నాకే తెలియకుండా నిర్ణయాలు

31 ఏళ్ల రాజకీయ జీవితంలో 5 సార్లు ఎమ్మెల్యేగా, రెండోసారి మంత్రిగా ప్రజల ఆదరణ పొందానని సురేఖ లేఖలో గుర్తుచేశారు. బీసీల్లో పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన తాను, మున్నూరు కాపు వర్గానికి చెందిన తన భర్త కొండా మురళీధర్ రావు.. పార్టీ కష్టకాలంలో అండగా నిలబడ్డామన్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి తనను ఉద్దేశపూర్వకంగానే అణగదొక్కుతున్నారని ఆరోపించారు. మంత్రిగా తనకున్న అధికారాలను లాగేసుకున్నారని, దేవాదాయ శాఖలో యాదాద్రి టెంపుల్ ట్రస్ట్ బోర్డ్ ఏర్పాటు లాంటి కీలక విషయాల్లో తనకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని వాపోయారు. సమ్మక్క-సారలమ్మ గుడి శాశ్వత అభివృద్ధికి దేవాదాయ శాఖ నిధులు మంజూరు చేస్తే, ఆ నిధులను ఒక్కరోజులోనే ఆర్ అండ్ బీ డిపార్ట్‌మెంట్ కు బదిలీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఓఎస్డీపై కక్ష సాధింపు.. కడియం శ్రీహరి పెత్తనం

తనకు కనీసం చెప్పకుండా తన మాజీ ఓఎస్డీ సుమంత్‌ను పదవి నుంచి తొలగించారని, ఆ తర్వాత ఓ నాన్-బెయిలబుల్ కేసులో ఇరికించి అరెస్ట్ చేసేందుకు తాను నివసించే మంత్రుల క్వార్టర్స్‌కు పోలీసులను పంపారని సురేఖ ఫిర్యాదు చేశారు. ఇది మంత్రిగా తనను అవమానించడమే అన్నారు. మరోవైపు, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి.. మంత్రిగా ఉన్న తనకు సమాచారం లేకుండానే దేవాదాయ శాఖ అధికారులతో రివ్యూ మీటింగ్‌లు నిర్వహిస్తున్నారని, దీనిపై హైకమాండ్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా ఫ్యామిలీని రాజకీయంగా ఒంటరిని చేసే కుట్రలు జరుగుతున్నాయన్నారు.

డబుల్ స్టాండర్డ్స్.. వరంగల్ తూర్పుకు నిధుల కోత

సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని చెప్పిన సీఎం రేవంత్.. పరకాలలో మాత్రం రేవూరి ప్రకాష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓపెన్ గా స్టేట్మెంట్స్ ఇస్తున్నారని, పార్టీలో నేతల పట్ల ఈ డబుల్ స్టాండర్డ్స్ ఎందుకని సురేఖ ప్రశ్నించారు. ఇక తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. పక్క నియోజకవర్గాలకు ఫండ్స్ ఇస్తూ.. తన నియోజకవర్గంలోని స్మార్ట్ సిటీ మోడల్ బస్ స్టాండ్, బొండి వాగు విస్తరణ వంటి ప్రాజెక్టులకు మాత్రం కావాలనే నిధులు ఆపుతున్నారని ఆరోపించారు.

కూతురి వ్యాఖ్యలకు నన్ను టార్గెట్ చేస్తారా?

పరకాల నియోజకవర్గం, వచ్చే ఎన్నికల టికెట్ల గురించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వల్లే మానసిక వేదనకు గురైన తన కూతురు సుస్మిత పటేల్ కొన్ని కామెంట్స్ చేసిందని సురేఖ వివరణ ఇచ్చారు. అయితే, మేజర్ అయిన ఓ కుటుంబ సభ్యురాలు చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలకు.. తల్లిని అయినంత మాత్రాన మంత్రికి షోకాజ్ నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని లేఖలో వాపోయారు. కేవలం బీసీ మహిళను అయినందుకే తనపై ఈ వివక్ష చూపుతున్నారని, కొందరు లీడర్లు తనపై పరుష పదజాలంతో మూకుమ్మడి దాడులకు పాల్పడుతున్నారని వాపోయారు. దశాబ్దాలుగా పార్టీకి సేవలందిస్తున్న తన లాంటి సీనియర్ నేతకు జరుగుతున్న అన్యాయంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించి న్యాయం చేయాలని సోనియా గాంధీని కొండా సురేఖ ఆ లేఖలో అభ్యర్థించారు.

Advertisement
Advertisement