త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti Srinivas Reddy | కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఫోన్ ట్యాపింగ్.. బాంబు పేల్చిన మంత్రి పొంగులేటి

రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బాంబు పేల్చారు. గతంలోనే కాదు, ఇప్పుడు కూడా ట్యాపింగ్ జరుగుతోందని, ఆ పరికరాలు ఎక్కడున్నాయో ఆరా తీస్తున్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు.

J

Telangana | Published On Feb 10, 2026, 5.34 pm IST

Ponguleti Srinivas Reddy | కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఫోన్ ట్యాపింగ్.. బాంబు పేల్చిన మంత్రి పొంగులేటి
Advertisement
  • బాధ్యులపై ఉక్కుపాదం తప్పదన్న మంత్రి 

Ponguleti Srinivas Reddy | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరిన్ని ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ అంశంపై తెలంగాణ రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలోనే కాకుండా, ప్రస్తుతం కూడా రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కొనసాగుతోందని ఆయన బాంబు పేల్చారు. మంగళవారం ఖమ్మంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా ఉందని స్పష్టం చేశారు.

పరికరాల కోసం వేట.. వదిలిపెట్టే ప్రసక్తే లేదు

"ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, ఇంకా జరుగుతోందని చాలా మంది గగ్గోలు పెడుతున్నారు. ఇది అక్షరాలా నిజం. ఇప్పుడు కూడా కొందరు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు. అసలు ఈ ట్యాపింగ్ వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు? అక్రమంగా ట్యాపింగ్ చేసే ఎక్విప్‌మెంట్ (పరికరాలు) ఎక్కడెక్కడ అమర్చారు? అనే విషయాలపై ప్రభుత్వం ఇప్పటికే లోతుగా ఆరా తీస్తోంది. విచారణ జరిపి బాధ్యులు ఎవరైనా సరే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజాస్వామ్య స్వేచ్ఛకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదు," అని పొంగులేటి హెచ్చరించారు.

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం

రాష్ట్రంలో బుధవారం జరగనున్న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతోందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. "గడిచిన రెండేళ్లలో మేం చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకున్నాం. అందుకే ప్రజలు మా వెంటే ఉన్నారు. ఈ పుర పోరులో 80 శాతానికి పైగా స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోవడం ఖాయం. ప్రతిపక్షాల ఆక్రోశం వారి ఓటమి భయానికి నిదర్శనం. జూబ్లీహిల్స్ ఫలితాలే రేపు రాష్ట్రవ్యాప్తంగా పునరావృతం కాబోతున్నాయి," అని స్పష్టం చేశారు.

దొరల పాలనలో అప్పుల కుప్ప

గత బీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై పొంగులేటి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి ధనిక తెలంగాణను రూ.8.19 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారని ఆరోపించారు. "మేము నెలకు రూ.6,300 కోట్లు కేవలం వడ్డీలకే కడుతున్నాం. అయినా సంక్షేమాన్ని ఆపలేదు. గతంలో 62 వేల డబుల్ బెడ్ రూంలను మొండిగోడలుగా మిగిల్చారు. కానీ మేము 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం." అని మంత్రి వివరించారు. ఉద్యోగులను ఓట్లు అడగడంలో తప్పులేదని, తన పార్టీ గెలుపు కోసం తాను ప్రచారం చేశానని ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి తెలిపారు.

https://x.com/INC_Ponguleti/status/2021182941712523601

 

Advertisement
Advertisement