త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhadrachalam Temple Development | భద్రాచలం అభివృద్ధికి ముహూర్తం ఫిక్స్.. రూ.351 కోట్లతో రాబోయే 200 ఏళ్లకు సరిపడేలా మాస్టర్ ప్లాన్

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధికి సర్కార్ ముహూర్తం ఖరారు చేసింది. రూ.351 కోట్లతో చేపట్టనున్న ఈ పనులకు జూన్ 27న అంకురార్పణ జరగనుంది.

J

Telangana | Published On Jun 25, 2026, 10.00 pm IST

Bhadrachalam Temple Development | భద్రాచలం అభివృద్ధికి ముహూర్తం ఫిక్స్.. రూ.351 కోట్లతో రాబోయే 200 ఏళ్లకు సరిపడేలా మాస్టర్ ప్లాన్
Advertisement
  • దక్షిణ అయోధ్య 'భద్రాచలం' ఆలయ అభివృద్ధి పనులకు ఈ నెల 27న అధికారికంగా శ్రీకారం
  • రాబోయే 200 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్ రెడ్డి రూ.351 కోట్ల నిధుల మంజూరు
  • ఆగమశాస్త్ర నిబంధనలు పాటిస్తూ, ప్రాచీన రాతి శిల్పకళ ఉట్టిపడేలా ఆలయ పునరుద్ధరణ
  • వచ్చే శ్రీరామనవమి నాటికి నిర్దేశిత పనులన్నీ పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి ఆదేశం

Bhadrachalam Temple Development | త్రినేత్ర.న్యూస్ : దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం (Bhadrachalam) శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధికి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సర్కార్ ముహూర్తం ఖరారు చేసింది. తెలంగాణ భక్తులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఆలయ పునరుద్ధరణ పనులకు ఈ నెల 27వ తేదీన అధికారికంగా శ్రీకారం చుట్టనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. గురువారం హైదరాబాద్‌ సచివాలయంలో దేవాదాయ శాఖ, భద్రాచలం ఆలయ అధికారులతో ఆయన ప్రత్యేక రివ్యూ మీటింగ్ నిర్వహించారు.

ఆగమశాస్త్రం.. రాతి శిల్పకళకే ప్రాధాన్యం

సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. భక్తుల మనోభావాలకు పెద్దపీట వేయాలని, ఆగమశాస్త్ర (Agama Sastra) నియమాలకు ఏమాత్రం విఘాతం కలగకుండా ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. భద్రాద్రి రాముని ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా, ప్రాచీన సంప్రదాయ శిల్పకళను ప్రతిబింబించే రాతి నిర్మాణాలకే (Stone architecture) ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆధునికత పేరుతో ఆలయ పవిత్రతకు ఎలాంటి భంగం కలగకూడదని ఆయన ఆదేశించారు.

Bhadrachalam Temple Development Works to Begin on June 27

రూ.351 కోట్లతో భారీ ఫండ్స్

రాబోయే 200 ఏళ్ల భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని భద్రాచలాన్ని ఒక అద్భుత ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి సంకల్పించినట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఈ మాస్టర్ ప్లాన్ కోసం ఇప్పటికే ప్రభుత్వం రూ.351 కోట్ల భారీ ఫండ్‌ను మంజూరు చేసిందని గుర్తుచేశారు. ఈ నిధులతో చేపట్టనున్న పనులకు ఈ నెల 27న లాంఛనంగా పునాదిరాయి పడనుంది.

Bhadrachalam Temple Development Works to Begin on June 27

టార్గెట్ శ్రీరామనవమి.. పక్కా యాక్షన్ ప్లాన్

పనుల వేగంపై మంత్రి అధికారులకు కచ్చితమైన డెడ్‌లైన్ విధించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా, ముఖ్యంగా వచ్చే ఏడాది శ్రీరామనవమి (Sri Rama Navami) నాటికి లక్ష్యంగా పెట్టుకున్న పనులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తి కావాలని ఆదేశించారు. దీనికోసం ముందుగానే ఏజెన్సీలకు పనులను విభజించి, సమాంతరంగా అన్ని పనులు ఏకకాలంలో వేగంగా జరిగేలా పక్కా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు.

Advertisement
Advertisement