త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tummidihatti Barrage | తుమ్మిడిహట్టి బ్యారేజ్‌పై సెప్టెంబర్‌ 1న ఢిల్లీలో కీలక సమావేశం

Tummidihatti Barrage | ప్రాణహిత నదిపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన తుమ్మిడిహట్టి బ్యారేజ్‌ నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక, అంతర్రాష్ట్ర అంశాలపై సెప్టెంబర్‌ 1న ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. కేంద్ర జల సంఘం (CWC) చైర్మన్‌ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సేవా భవన్‌లో ఈ భేటీ నిర్వహించనున్నారు.

P

Telangana | Published On Aug 27, 2026, 7.30 pm IST

Tummidihatti Barrage | తుమ్మిడిహట్టి బ్యారేజ్‌పై సెప్టెంబర్‌ 1న ఢిల్లీలో కీలక సమావేశం
Advertisement
  • సీడ‌బ్ల్యూసీ చైర్మన్‌ అధ్యక్షతన భేటీ..
  • తెలంగాణ, మహారాష్ట్ర అధికారుల హాజరు
  • 152 మీటర్ల ఎత్తుపై అంగీకారం కోసం ప్ర‌భుత్వం ప్రయత్నాలు
  • గ్రావిటీ ద్వారా నీటి తరలింపుతో విద్యుత్‌ వ్యయం తగ్గించడమే లక్ష్యం

Tummidihatti Barrage | ప్రాణహిత నదిపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన తుమ్మిడిహట్టి బ్యారేజ్‌ నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక, అంతర్రాష్ట్ర అంశాలపై సెప్టెంబర్‌ 1న ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. కేంద్ర జల సంఘం (CWC) చైర్మన్‌ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సేవా భవన్‌లో ఈ భేటీ నిర్వహించనున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర జలవనరుల శాఖల ఉన్నతాధికారులు సమావేశానికి హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వరుస ప్రయత్నాల నేపథ్యంలో కేంద్ర జల సంఘం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

సీఎం లేఖ మేర‌కు..

తుమ్మిడిహట్టి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం రేవంత్‌రెడ్డి మే 26న మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశారు. రెండు రాష్ట్రాల మధ్య సమావేశం ఏర్పాటు చేసి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం సూచించాలని కోరారు. ఈ అంశాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. ప్రధాని కార్యాలయం జలశక్తి మంత్రిత్వ శాఖకు పంపించింది. అనంతరం ఆగస్టు 5న కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు సీఎం ప్రత్యేకంగా లేఖ రాసి కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు.

152 మీటర్ల ఎత్తుపై తెలంగాణ పట్టుదల

మహారాష్ట్ర గతంలో అంగీకరించిన 148 మీటర్ల ఎత్తుకు బదులుగా తుమ్మిడిహట్టి బ్యారేజ్‌ను 152 మీటర్ల ఎత్తులో నిర్మించేలా అంగీకారం సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 148 మీటర్ల వద్ద అవసరమైన నీటిని గ్రావిటీ ద్వారా తరలించడం సాధ్యం కాదని.. భారీ పంపులు వినియోగిస్తే విద్యుత్‌ వ్యయం గణనీయంగా పెరుగుతుందని కేంద్రానికి వివరించింది. తక్కువ విద్యుత్‌ వ్యయంతో, దీర్ఘకాలికంగా రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా ప్రాజెక్టును నిర్మించాలన్నదే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన వాదన. సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ అధ్యయనాల ప్రకారం జలమట్టం పెంపుతో అదనపు ముంపు పరిమితంగానే ఉంటుందని కూడా ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది.

కరువు ప్రాంతాలకు సాగునీరు

వెనుకబడిన, కరువు ప్రభావిత ప్రాంతాలకు సాగునీరు అందించే ఈ కీలక ప్రాజెక్టును త్వరగా కార్యరూపంలోకి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం కేంద్రం, మహారాష్ట్రతో వరుసగా సంప్రదింపులు కొనసాగిస్తోంది. సెప్టెంబర్‌ 1న జరిగే సమావేశంలో సాంకేతిక అంశాలతోపాటు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న కీలక విభేదాలపై చర్చించి పరిష్కార మార్గాన్ని అన్వేషించే అవకాశం ఉంది.

Advertisement
Advertisement