త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vemulawada | రేపు వేములవాడలో రామయ్య కల్యాణం.. 24 గంటలు తెరిచే ఉండనున్న రాజన్న ఆలయం

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారామచంద్ర స్వామి కల్యాణోత్సవానికి సర్వం సిద్ధమైంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయాన్ని 24 గంటల పాటు తెరిచి ఉంచనున్నారు. హిజ్రాలు, జోగినులు శివుడిని భర్తగా భావించి పెళ్లి చేసుకోవడం ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణ.

J

Telangana | Published On Mar 26, 2026, 9.00 pm IST

Vemulawada | రేపు వేములవాడలో రామయ్య కల్యాణం.. 24 గంటలు తెరిచే ఉండనున్న రాజన్న ఆలయం
Advertisement

Vemulawada | రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి దేవస్థానం రాజన్న ఆలయం వద్ద సీతారామచంద్ర స్వామి వారి కల్యాణోత్సవం వైభవంగా జరుగనున్నది. కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా భక్తులు ముందుగా భీమేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. కల్యాణోత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, కూర్చునే సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు తదితర చర్యలు చేపట్టారు.

Vemulawada Rajanna Temple to Remain Open for 24 Hours for Sita Ramachandra Swamy Kalyanam

అలాగే సీతారామచంద్ర స్వామి కల్యాణోత్సవం సందర్భంగా భక్తుల దర్శనార్థం రాజన్న ఆలయాన్ని 24 గంటలు తెరిచి ఉంచనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కల్యాణ మహోత్సవం ఏర్పాట్లను ఆలయ ఈవో రమాదేవి పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం, కూర్చునే ఏర్పాట్లు, తాగునీరు, భద్రతా చర్యలు తదితర అంశాలపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.

శివయ్యను భర్తగా భావించి..

రాజన్న ఆలయంలో సీతారామచంద్రస్వామి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ కల్యాణోత్సవానికి సామాన్య భక్తులతోపాటు అధిక సంఖ్యలో హిజ్రాలు, జోగినులు తరలివస్తున్నారు. కల్యాణోత్సవానికి హాజరైన హిజ్రాలు, జోగినులు శివుడినే వరుడిగా భావించి వివాహం చేసుకుంటారు. మంగళసూత్రం ధరించి, తలంబ్రాలు పోసుకుంటూ సంబరంగా గడుపుతారు. రాజన్న సన్నిధిలో శ్రీరామనవమి ఈ ఆచారం కనిపిస్తుంది. సంప్రదాయబద్ధంగా పట్టుచీరలు, ఆభరణాలు ధరించి అందంగా ముస్తాబై కల్యాణానికి వస్తారు. రాజరాజేశ్వరస్వామికి భార్యలుగా భావించి.. వివాహ బంధంలోకి అడుగుపెడుతారు. నెత్తిన జీలకర్ర బెల్లం, చేతిలో త్రిశూలం, మెడలో మంగళసూత్రం ధరించి పెళ్లి చేసుకోవడం విశేషం. ఈ వేడుక ద్వారా శివపార్వతులు, జోగినులు, హిజ్రా సమాజం శివుడి ఆశీస్సులు కోరుకుంటారు. హిజ్రాలను సమాజంలో ఒంటరిగా కాకుండా సమానంగా చూడాలనే ఆలోచనే దీనికి సంకేతంగా నిలుస్తోందని భావిస్తుంటారు. ఈ తంతును చూసేందుకు సైతం పెద్ద సంఖ్యలో జనం తరలివస్తుంటారు. పెళ్లి తర్వాత పలువురు బద్దిపోచమ్మకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు.

Advertisement

తాజావార్తలు

Advertisement