త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | అసెంబ్లీ నుంచి మ‌మ్మ‌ల్ని ఎత్తేయ‌డం కాదు.. మోటార్లు ఆన్ చేసి కృష్ణా నీళ్లు ఎత్తు

Harish Rao | అసెంబ్లీలో తాము ప్రజల తరుపున మాట్లాడితే మార్షల్స్ పెట్టి ఎత్తేసావని.. మ‌మ్మ‌ల్ని ఎత్తేసే బ‌దులు మోటార్లు ఆన్ చేసి కృష్ణా నీళ్లు ఎత్తితే పాల‌మూరుకు మేలు జ‌రుగుతుంద‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్ రావు అన్నారు.

S

Telangana | Published On Sep 10, 2026, 6.07 pm IST

Harish Rao | అసెంబ్లీ నుంచి మ‌మ్మ‌ల్ని ఎత్తేయ‌డం కాదు.. మోటార్లు ఆన్ చేసి కృష్ణా నీళ్లు ఎత్తు
Advertisement
  • ఏపీ నీటి తరలింపుకు వెంటనే అడ్డుకట్ట వేయాలి
  • అవసర‌మైతే అపెక్స్ కౌన్సిల్ డిమాండ్ చేయాలి
  • పాలమూరు అన్ని ప్రాజెక్టుల మోటార్లు ఆన్ చేసి పొలాలకు నీళ్లివ్వాలి
  • సాగర్ కాల్వకు నీళ్లు ఇడిసి నల్లగొండ పాలాలకు మ‌ళ్లించాలి
  • మీడియా స‌మావేశంలో మాజీ మంత్రి హ‌రీశ్ రావు డిమాండ్‌

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: అసెంబ్లీలో తాము ప్రజల తరుపున మాట్లాడితే మార్షల్స్ పెట్టి ఎత్తేసావని.. మ‌మ్మ‌ల్ని ఎత్తేసే బ‌దులు మోటార్లు ఆన్ చేసి కృష్ణా నీళ్లు ఎత్తితే పాల‌మూరుకు మేలు జ‌రుగుతుంద‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్ రావు అన్నారు. రేవంత్ నిర్లక్ష్యం వల్ల తెలంగాణ వరప్రదాయిని అయిన కృష్ణా నీళ్లు, ఏపీకి వరప్రదాయినిగా మారాయ‌న్నారు. పాలమూరు, నల్లగొండ జిల్లాలకు నీళ్లు రాక రైతులు ఇబ్బందులు పడుతున్నార‌ని వాపోయారు. పాల‌మూరులో అన్ని ప్రాజెక్టుల మోటార్లు ఆన్ చేసి పొలాల‌కు నీళ్లివ్వాల‌ని డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న మాట్లాడుతూ రేవంత్ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు.

కండ్ల ముందు నీళ్లు పారుతున్నా పొలాలకు నీళ్లు ఇవ్వలేని పాలన ఇది. పంటలను కాపాడలేని పరిస్థితి. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు. పాలమూరు బిడ్డను అని విర్రవీగే ఈ రేవంత్ రెడ్డి కృష్ణా జలాలు ఎత్తకుండా పాలమూరు ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నడు. పాలమూరు పులి అంటూ నీటి వినియోగంలో పిల్లిలాగా ఉన్నడు. తెలంగాణ రైతాంగానికి నీళ్లు నిల్లు.. ఏపీ రైతాంగానికి నీళ్లు ఫుల్లు. ఎల్‌నినో ప్రమాదం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థలు చెబుతున్నాయి. వచ్చిన నీళ్లు వచ్చినట్లు ఎత్తాల్సిన నీళ్ళను ఎత్తకుండా చోద్యం చూస్తున్నడు. ఎత్తగలిగే అవకాశం ఉండి మోటార్లు బంద్ పెట్టి కూర్చున్నడు.

4000 క్యూసెక్కుల‌కు 700 క్యూసెక్కులే ఎత్తుతున్న‌రు..

తెలంగాణ తెచ్చిన పార్టీగా మాకు బాధ్యత ఉంది. రేవంత్ రెడ్డికి.. ఆయన గురువు బాగుంటే చాలు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మొదటి పంప్‌హౌజ్ ఎల్లూరు పంప్ హౌజ్. కేవలం రెండు మోటార్లు నడుస్తున్నాయి. మిగతా ఎందుకు బంద్ పెట్టిన‌వ్‌. ఆ రెండు కూడా ఆన్ అండ్ ఆఫ్‌లో నడస్తున్నాయి. యావ‌రేజీగా 11 గంటలే మోటార్లు నడుపుతున్నారు. 24 గంటలు 5 మోటార్లు నడపాలి.. కానీ అలా చేయ‌డం లేదు. రోజుకు 1600 క్యూసెక్కులు రావాల్సిన చోట 700 క్యూసెక్కులే వస్తున్నాయి. 4000 క్యూసెక్కులు ఎత్తగలిగే కెపాసిటీ ఉంటే రేవంత్ రెడ్డి ఎత్తుతున్నది 700 క్యూసెక్కులు.

నీ ప్రాంతం మీద నీకున్న ప్రేమ వట్టి మాటలే. బాబు గారికి గురుదక్షిణ చెల్లించుకుంటున్నవా? వెలిగొండ, పోతిరెడ్డి పాడు ద్వారా నీళ్లు తరలించుకుపోయేందుకు సహకరిస్తున్నవా? బీమా ప్రాజెక్టులో మూడు మోటార్లు ఉంటే ఒకటి నడుపుతున్నారు. బేసిన్‌తో సంబంధం లేని వెలిగొండ ద్వారా చంద్రబాబు నీళ్లు తీసుకుపోతుంటే బేసిన్‌లో ఉండి, నికర జలాల కేటాయింపు ఉన్న బీమా ఎందుకు నడపవు.

నెట్టంపాడులో నాలుగు ఉంటే ఒకటి, కోయిల్ సాగర్‌లో మూడు ఉంటే ఒకటి నడుపుతున్నరు. నీళ్లు ఉండి మోటార్లు నడపడం చేతగాని ముఖ్యమంత్రిని నిన్నే చూస్తున్న. పాలమూరు సాగు, తాగు నీరు నడపడం చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి నువ్వు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో రైతులు అర్ధ‌నగ్న ప్రదర్శన చేస్తున్నరు. పొంగులేటి నియోజకవర్గంలలో రైతులు ధర్నాలు చేస్తున్నరు. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ స్టేషన్ల ముందు రైతులు ధర్నా చేస్తున్నరు.
నీళ్ల కోసం ధర్నాలు చేస్తున్నరు.

రోమ్ తగలబడుతుంటే ఫిడేల్ వాయించినట్లు సస్పెన్ష‌న్ల బిజీలో ఉన్నడు. యాదాద్రి పవర్ ప్లాంట్, భద్రాద్రి కొత్తగూడెం సోలార్ ఇలా ఎన్నో తెచ్చారు. నడుప చేతకావడం లేదు. నీళ్లు ఉండి నీళ్లు ఎత్తరు, ఉత్పత్తి కెపాసిటీ ఉండి కరెంట్ ఉత్పత్తి చేయడం లేదు. కేటీపీఎస్ 800 మెగావాట్ల ప్లాంటు మూసేసారు. 540 మెగావాట్ల బీటీపీఎస్ యూనిట్ 3, 4 ప్లాంట్లు మూసేసారు. యాదాద్రిలో 4000 మెగావాట్లకు ఉత్పత్తి చేస్తున్నది 2000 మెగావాట్లే.
ఒకవైపు బొగ్గు సర్‌ప్లస్ ఉంది అంటున్నరు. మరోవైపు యాదాద్రి ప్లాంటుకు బొగ్గు సరఫరా చేయడం లేదు.

కొండారెడ్డి పల్లిలో ధర్నా చేస్తున్న రైతులు బీఆర్ఎస్ కార్యకర్తలా? పొంగులేటి నియోజకవర్గంలో చేస్తున్న రైతులు బీఆర్ఎస్ కార్యకర్తలా? కల్వకుర్తి 30 ఏళ్ల పాటు మీరు ఇచ్చిన నీళ్లు 13వేల ఎకరాలు. బీఆర్ఎస్ వచ్చాక 3 లక్షల 7 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చింది. కల్వకుర్తి, బీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు 4000 కోట్లు ఖర్చు చేసి, పూర్తి చేసి ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినం. మూడేళ్లలో ఈహెచ్‌టీ సబ్ స్టేషన్ ఒక్కటీ కట్టలేదు.
రైతులకు ఇచ్చే పవర్ లేదు, ప్రతిపక్షాల పీక నొక్కడానికి మాత్రం పవర్.

కోమటి రెడ్డి నాడు కరెంట్ లేదని విమర్శలు చేసినవు, ఇప్పుడు 7 గంటలు కూడా కరెంట్ వస్తలేదు, ఎందుకు లాగ్ బుక్స్ చూడటం లేదు. రేవంత్ రెడ్డిని చూస్తే లాగులు తడుస్తున్నాయా? ఇది కరువు కాలం తెచ్చిన కరువు కాదు.. రేవంత్ పాలన వైఫల్యం. శ్రీశైలంలో మనకు ఉన్నవి కల్వకుర్తి, పాలమూరు ప్రాజెక్టులు. పాలమూరు ప్యాకేజీ 3లో నెల రోజులు కష్టపడితే పూర్తి అవుతుంది. మూడేళ్ల నుంచి ఆ పని చేయడం లేదు. 5, 6 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తయి. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు అని, కేసీఆర్‌కు కీర్తి వస్తుందని పనులు పూర్తి చేయడం లేదు. పాలమూరు ప్యాకేజీని పడావు పెట్టినవు.

ఇది కాంగ్రెస్ వైప‌రీత్యం..

అధికారిక లెక్కల ప్రకారమే శ్రీశైలం నుంచి 35 టీఎంసీలు ఏపీ తీసుకుపోయింది. కానీ రేవంత్ ఎత్తింది కేవలం 7 టీఎంసీలే. బీఆర్ఎస్ పోరాటం చేస్తే, మొన్న కేటీఆర్ గారు వెళ్తే సాగర్‌కు కొద్ది కొద్దిగా నీళ్లు ఇస్తున్నరు. బీఆర్ఎస్ నిలదీస్తే తప్ప మొద్దు నిద్ర వీడరా? ప్రకృతి వైపరీత్యం కాదు, కాంగ్రెస్ వైపరీత్యం వచ్చింది రాష్ట్రానికి. బేసిన్‌లో లేని వెలిగొండకు నీళ్లు, బేసిన్ లో ఉన్న మహబూబ్ నగర్ కు నీళ్లు లేని పరిస్థితి.

2024-25లో 28.49 శాతం, 2025-26లో 25.77శాతం మాత్రమే వినియోగం. ఆరు లక్షల ఎకరాలకు క్రాప్ హాలిడే ప్రకటించిన చేవలేని ప్రభుత్వం మీది. ఈ ఏడాది కూడా అదే తీరుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అతి తక్కువ కృష్ణా జలాల వినియోగం ఈ మూడు ఏళ్లు జరిగింది. ఎవర్ లోయెస్ట్ యుటిలైజేషన్ ఉన్న తాత్కాలిక వాటాను కూడా వాడుకోలేని చేతగాని ప్రభుత్వం. రైతులకు కావాల్సింది బూతులు కాదు. రైతుకు కావాల్సింది పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు కాదు.. పంపులకు పవర్, పొలాలకు సాగునీరు.

ఎల్‌నీనో ప్రకృతి వైపరీత్యం కావచ్చు.. కానీ నీరు అందుబాటులో ఉండి కూడా రైతుకు అందించకపోవడం మాత్రం ప్రభుత్వ వైఫల్యం. కాంగ్రెస్ వైపరీత్యం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ మౌనం తెలంగాణ తాగు, సాగు నీటి ప్రయోజనాలకు శాపంగా మారుతోంది. ఏపీ నీటి తరలింపుకు వెంటనే అడ్డుకట్ట వేయాలి.
అవసరం అయితే అపెక్స్ కౌన్సిల్ డిమాండ్ చేయాలి. పాలమూరు అన్ని ప్రాజెక్టుల మోటార్లు ఆన్ చేసి పొలాలకు నీళ్లు ఇవ్వాలి. సాగర్ కాల్వకు నీళ్లు ఇవ్వాలి, నల్లగొండ పాలాలకు నీళ్లు మళ్లించాలి అని హ‌రీశ్ రావు డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement