త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti Srinivas Reddy | ఎల్లుండి నుంచి ఇందిర‌మ్మ ఇళ్ల‌ ల‌క్కీ డ్రా.. ఎంపిక కానివారికి డ‌బ్బులు వాప‌స్ ఇస్తాం

Ponguleti Srinivas Reddy | ఎల్లుండి నుంచి ఈనెల 30 వ‌ర‌కు ఇందిర‌మ్మ ఇళ్ల ల‌క్కి డ్రా నిర్వ‌హించ‌నున్న‌ట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తుది జాబితా ప్ర‌క‌టించిన అనంత‌రం ఎంపిక కాని ద‌ర‌ఖాస్తుదారుల‌కు వారు చెల్లించిన రూ.10 వేల ఈఎండీ మొత్తాన్ని వెంట‌నే ఖాతాల్లో తిరిగి జ‌మ చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

S

Telangana | Published On Aug 25, 2026, 4.45 pm IST

Ponguleti Srinivas Reddy | ఎల్లుండి నుంచి ఇందిర‌మ్మ ఇళ్ల‌ ల‌క్కీ డ్రా.. ఎంపిక కానివారికి డ‌బ్బులు వాప‌స్ ఇస్తాం
Advertisement
  • క్యూఆర్ ప‌రిధిలో 15 నియోజ‌క‌వ‌ర్గాల్లో టెండ‌ర్లు పూర్తయ్యాయి
  • మ‌రో నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో సెప్టెంబ‌ర్ 3 వ‌ర‌కు కొత్త‌ ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం
  • రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Ponguleti Srinivas Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: ఎల్లుండి నుంచి ఈనెల 30 వ‌ర‌కు ఇందిర‌మ్మ ఇళ్ల ల‌క్కి డ్రా నిర్వ‌హించ‌నున్న‌ట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తుది జాబితా ప్ర‌క‌టించిన అనంత‌రం ఎంపిక కాని ద‌ర‌ఖాస్తుదారుల‌కు వారు చెల్లించిన రూ.10 వేల ఈఎండీ మొత్తాన్ని వెంట‌నే ఖాతాల్లో తిరిగి జ‌మ చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. 27న రాయ‌దుర్గం, కేపీహెచ్‌బీ కాల‌నీ, మైలార్‌దేవర‌ప‌ల్లి, రెడ్ హిల్స్‌, 28న కౌకూర్‌, పాటిగెడ్డ‌, జ‌ల్‌ప‌ల్లి, కుల్సుంపుర, 29న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాల‌నీ, బోయ‌న్‌ప‌ల్లి, బండ్ల‌గూడ (ఎల్ఐజీ కాల‌నీ), నందిముస‌లిగుడ‌, 30న గాజుల రామారం, అంబ‌ర్‌పేటలోని సిటీపోలీస్ లైన్స్‌, గ‌డ్డిన్నారం, ఆర్ & బీ క్వార్ట‌ర్స్, పోచారం (ఎల్ఐజీ కాల‌నీ)లో ల‌క్కీడ్రా నిర్వ‌హిస్తార‌ని తెలిపారు. మంగళవారం సచివాలయంలో హౌసింగ్‌ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణ పురోగతి, లబ్ధిదారుల ఎంపిక, లక్కీ డ్రా నిర్వహణ, కొత్త నియోజకవర్గాల్లో దరఖాస్తుల స్వీకరణ తదితర అంశాలపై స‌మీక్ష నిర్వ‌హించారు.

హైద‌రాబాద్‌ క్యూర్ ప‌రిధిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణ కార్యక్రమాన్ని వేగవంతం చేశామ‌న్నారు. ఈ సంద‌ర్భంగా పొంగులేటి మాట్లాడారు. ఈ నెల 27, 28, 29, 30 తేదీల్లో ఆయా ప్రాంతాల్లోని ప్రత్యేక ఫంక్షన్ హాళ్లలో ప్రజలు, అర్హులైన దరఖాస్తుదారుల సమక్షంలోనే పార‌ద‌ర్శ‌కంగా లక్కీ డ్రా నిర్వహిస్తామ‌ని, ప్రతి కేంద్రానికి ఒక ప్రత్యేక పర్యవేక్షణాధికారిని కూడా నియ‌మించామ‌ని తెలిపారు.

ఇందిర‌మ్మ ట‌వ‌ర్స్ నిర్మాణానికి సంబంధించి ఇప్ప‌టికే టెండ‌ర్లు ప్ర‌క్రియ‌ను పూర్తి చేశామ‌ని వెల్లడించారు. క్యూఆర్‌ పరిధిలోని తొలి విడతలో ప్రయోగాత్మకంగా 16 నియోజకవర్గాల్లో 807.40 కోట్ల అంచనా వ్యయంతో ఇందిరమ్మ ట‌వ‌ర్స్ నిర్మిస్తున్నామ‌ని, ఇందుకోసం జూన్‌ 20 నుంచి ఆగస్టు 15 తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించగా మొత్తం 60,720 దరఖాస్తులు అందాయ‌న్నారు. వ‌చ్చిన దరఖాస్తులపై 360 డిగ్రీల క్షేత్రస్థాయి పరిశీలన, సమగ్ర విచారణ అనంతరం 40,900 మందిని అర్హులుగా, 19,820 మందిని అనర్హులుగా గుర్తించామ‌న్నారు. అనర్హతకు గల కారణాలను దరఖాస్తుల వారీగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు మంత్రి తెలిపారు.

కొత్త‌గా నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో..

క్యూర్‌ పరిధిలో కొత్తగా మరో నాలుగు నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణానికి స్థలాలను ఎంపిక చేశామ‌ని తెలిపారు. ఒక్కో నియోజకవర్గంలో 480 ఇళ్ల చొప్పున మొత్తం 1,920 ఇళ్లను నిర్మించేందుకు చర్యలు చేపట్టిన‌ట్లు వివ‌రించారు. ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలోని హయత్‌నగర్‌ గ్రామంలో అమంగల్‌, గోషామహల్‌ నియోజకవర్గంలోని నాంపల్లి, ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని జమిస్తాన్‌పూర్‌ (ఆర్టీసీ క్వార్టర్స్‌), చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని బండ్లగూడలో (ఫలక్‌నుమా సమీపంలో) ఇళ్లు నిర్మించేందుకు వీలుగా ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నామ‌న్నారు. ఈ నాలుగు నియోజకవర్గాల పరిధిలోని అర్హులైన ప్రజలు ఇందిరమ్మ టవర్స్‌ కోసం సెప్టెంబర్‌ 3వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని మంత్రి పొంగులేటి సూచించారు. గతంలో 16 నియోజకవర్గాలకు వర్తింపజేసిన నిబంధనలే ఈ కొత్త దరఖాస్తులకూ వర్తిస్తాయ‌న్నారు.

ఇందిరమ్మ టవర్స్‌ ప్రత్యేకత కేవలం అపార్ట్‌మెంట్‌లో ఒక ఇల్లు ఇవ్వడంలోనే లేదని నగరంలో విలువైన భూమిపై ఒక కుటుంబానికి శాశ్వత ఆస్తి, భద్రమైన భవిష్యత్‌, ఆత్మగౌరవంతో జీవించే అవకాశం కల్పించడమే ప్ర‌ధాన లక్ష్య‌మ‌న్నారు. ప్రతిపాదిత ప్లాట్‌ విస్తీర్ణం 525 చదరపు అడుగులు. అన్‌డివైడెడ్‌ షేర్‌ విధానంలో సుమారు 20-25 గజాల భూమిని లబ్ధిదారుల పేరుతో ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేయనున్నామ‌ని ప్రాంతాన్ని బట్టి లబ్ధిదారులకు అందే భూమి విలువ రూ.60 లక్షల నుంచి రూ.కోటికి పైగా ఉండనుందన్నారు.

ఇంత విలువైన ఆస్తిని పేద కుటుంబానికి అందించడంతో పాటు, ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల పూర్తి సబ్సిడీ అందిస్తోందని లబ్ధిదారుడి వాటా కేవలం రూ.6 లక్షలు మాత్రమే, అది కూడా నాలుగు విడతల్లో చెల్లించే విధంగా అవకాశం కల్పించామ‌న్నారు. జీవితాంతం అద్దె ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి నుంచి ఒక పేద కుటుంబాన్ని బయటకు తీసుకువచ్చి, నగరంలోనే సొంతింటి యజమానిగా నిలబెట్టడమే ఇందిరమ్మ టవర్స్‌ లక్ష్యమ‌ని పొంగులేటి స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement