త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Municipal Elections | రెండునెల‌ల్లో మున్సిప‌ల్ ఎన్నిక‌లు : మాజీ ఎమ్మెల్యే మైనంప‌ల్లి హ‌న్మంత‌రావు

Municipal Elections | మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. సిద్దిపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

P

Telangana | Published On Jun 16, 2026, 8.26 pm IST

Municipal Elections | రెండునెల‌ల్లో మున్సిప‌ల్ ఎన్నిక‌లు : మాజీ ఎమ్మెల్యే మైనంప‌ల్లి హ‌న్మంత‌రావు
Advertisement

Municipal Elections | మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. సిద్దిపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. రానున్న రెండు నెలల్లో మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయని ఆయన తెలిపారు. “ఇవి మన కోసం కష్టపడ్డ కార్యకర్తల ఎన్నికలు” అని పేర్కొన్న ఆయన, పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సిద్దిపేటలో 1995లో కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ ఉన్న విషయాన్ని గుర్తుచేసిన మైనంపల్లి, ఆ తరువాత దీర్ఘకాలంగా పార్టీకి ఆ స్థాయి విజయం దక్కలేదని అన్నారు.

రాబోయే ఎన్నికల్లో కార్యకర్తల గెలుపే తన లక్ష్యమని స్పష్టం చేశారు. “కష్టపడ్డ వారికి 200 శాతం గుర్తింపు ఉంటుంది. బులెట్ దిగిందా లేదా అన్నది తర్వాత లెక్క, నేను సిద్ధంగా ఉన్నా… మీరు సిద్ధంగా ఉండండి” అని ఆయన వ్యాఖ్యానించారు. అవసరమైతే సిద్దిపేటలో ఇల్లు కట్టుకుని అక్కడే నిలబడతానని, హరీశ్ రావును రాజకీయంగా ఎదుర్కొంటానని ఆయన అన్నారు. బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు చేసిన ఆయన, ఆ పార్టీ లక్షల కోట్ల సంపాదన చేశారని ఆరోపించారు. కేటీఆర్, హరీశ్ రావులు వందల కోట్ల సంపాదన చేశారని వ్యాఖ్యానిస్తూ, తాము డబ్బు కోసం రాజకీయాల్లో లేమని, కార్యకర్తల విజయమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. “అందరం కలిసి పని చేస్తేనే గెలుపు సాధ్యం. పెయిడ్ సోషల్ మీడియా అవసరం మనకు లేదు. మనమే కౌంటర్ ఇవ్వాలి” అని కార్యకర్తలను ఉద్దేశించి ఆయన పిలుపునిచ్చారు.

కేసీఆర్ రిటైర్మెంట్ దశలో ఉన్నారని వ్యాఖ్యానించిన మైనంపల్లి, బీఆర్ఎస్‌పై ప్రత్యక్ష విమర్శలు కొనసాగిస్తూ కేటీఆర్, హరీశ్ రావుల రాజకీయాలపై ప్రజలు దృష్టి పెట్టాలని అన్నారు. సిద్దిపేటలో బీఆర్ఎస్‌ను రాజకీయంగా నిలువరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల అంశాన్ని ప్రస్తావించిన ఆయన, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ధాన్యం రవాణాను అడ్డుకున్న ఘటనలను కూడా ఆయన ప్రస్తావించారు. తాను స్థానికుడినేనని, బయటి వ్యక్తి కాదని స్పష్టం చేసిన మైనంపల్లి, “మేము తెలంగాణ వాళ్లమే” అని అన్నారు. ప్రత్యేక కోటా కింద సిద్దపేటలో నామినేటెడ్ పదవులు కష్టపడ్డ కార్యకర్తలకు ఇవ్విస్తామని హామీ ఇచ్చారు. “మైనంపల్లి మాజీ కావచ్చు కానీ కార్యకర్తలు ఎప్పుడూ మాజీ కావద్దు” అంటూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.

Advertisement
Advertisement