త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti Srinivas Reddy | ప్ర‌భుత్వ భూములు కాజేస్తే శాశ్వ‌తంగా తొల‌గిస్తం

Ponguleti Srinivas Reddy | బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో ప్ర‌భుత్వ భూముల‌ను కొల్ల‌గొట్టిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన అధికారులే దోచుకునే ప్రయత్నం చేయడం దుర్మార్గమైన చర్యగా అభివ‌ర్ణించారు.

S

Telangana | Published On Jun 8, 2026, 5.02 pm IST

Ponguleti Srinivas Reddy | ప్ర‌భుత్వ భూములు కాజేస్తే శాశ్వ‌తంగా తొల‌గిస్తం
Advertisement
  • బీఆర్‌ఎస్ హ‌యాంలో ప్ర‌భుత్వ అధికారులే దందాల‌కు పాల్ప‌డ్డారు
  • ఇందిర‌మ్మ ఇళ్ల స్థ‌ల ప‌రిశీల‌న‌లో ఈ అక్ర‌మాలు బ‌య‌ట‌ప‌డ్డ‌య్‌
  • డిప్యూటీ క‌లెక్ట‌ర్ రామునాయిక్ హౌసింగ్ బోర్డు భూముల‌ను అక్ర‌మ రిజిస్ట్రేష‌న్లు చేశారు
  • ఆయ‌న‌తో పాటు స‌హ‌క‌రించిన ఉద్యోగుల్లో ఒక‌రు డిస్మిస్‌, మ‌రొక‌రు స‌స్పెన్ష‌న్ చేశాం
  • అక్ర‌మ‌ సేల్ డీడ్‌లను ర‌ద్దు చేయండి
  • అధికారుల‌కు మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి ఆదేశం

Ponguleti Srinivas Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో ప్ర‌భుత్వ భూముల‌ను కొల్ల‌గొట్టిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. ప్రభుత్వ భూములను అంగుళం కూడా ఆక్రమించేందుకు ప్రయత్నించినా, అలాంటి ప్రయత్నాలను ప్రోత్సహించినా చూస్తూ ఊరుకోమని హెచ్చ‌రించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన అధికారులే దోచుకునే ప్రయత్నం చేయడం దుర్మార్గమైన చర్యగా అభివ‌ర్ణించారు. ఈ మేర‌కు సోమ‌వారం ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న‌లో స్పందించారు.

రెవెన్యూ శాఖ‌లో డిప్యూటీ క‌లెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న రామునాయిక్ 2013 నుంచి 2018 వ‌ర‌కు డిప్యూటేష‌న్‌పై హౌసింగ్ బోర్డులో ల్యాండ్ అక్విష‌న్ ఆఫీస‌ర్‌గా ప‌ని చేసి అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డారు. హైద‌రాబాద్, క్యూర్ ప‌రిధిలో హౌసింగ్ బోర్డు భూముల‌ను ప‌రిశీలిస్తున్న స‌మ‌యంలో ఆయ‌న‌ భూలీలలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. గ‌జం రెండు ల‌క్ష‌ల రూపాయిల‌కు పైగా విలువ చేసే హైకోర్టు 5-6 గేట్ల మ‌ధ్య ఉన్న తెలంగాణ‌ హౌసింగ్ బోర్డుకు చెందిన 33.53 చ‌ద‌ర‌పు గ‌జాల స్థలాన్ని రామునాయిక్ 2018, ఫిబ్రవ‌రి 17న అక్ర‌మంగా రిజిస్ట్రేష‌న్ చేయించిన‌ట్లు బ‌య‌ట‌ప‌డింది అని మంత్రి పేర్కొన్నారు.

స‌బ్ రిజిస్ట్రార్‌ల పాత్రపై విచార‌ణ‌..

రామునాయిక్ హౌసింగ్ బోర్డు ఎల్.ఎ.ఓగా ఉన్న స‌మ‌యంలో హౌసింగ్ బోర్డులో వ‌ర్క్ ఇన్‌స్పెక్ట‌ర్‌గా ప‌నిచేసి ఉద్యోగం పోగొట్టుకున్న ఇఫ్తాక‌ర్ అహ్మ‌ద్ భార్య సుబియా సుల్తానా పేరిట ఈ భూమిని అక్ర‌మంగా రిజిస్ట్రేష‌న్ చేశారు. ఆ డ‌బ్బులు నేటి వ‌ర‌కూ బోర్డుకు జ‌మ కాలేదు. అప్పుడు రిజిస్ట్రేష‌న్ చేసిన చార్మినార్ స‌బ్ రిజిస్ట్రార్ పై కూడా విచార‌ణ‌కు ఆదేశించాం అని మంత్రి తెలిపారు.

మ‌రొక‌రికి విక్ర‌యించిన సుబియా సుల్తానా..

ఇదిలా ఉండ‌గా 2025, ఏప్రిల్‌లో ఈ భూమిని సుబియా సుల్తానా మ‌రొక‌రికి విక్ర‌యించార‌ని, ఈ వ్య‌వ‌హారంపై విచార‌ణ జ‌రిపిస్తున్న‌ట్లు తెలిపారు. రామునాయిక్ భూ దందాల‌కు సంబంధించి 2017 నుంచి ప‌లు కేసులు ఉన్నాయ‌న్నారు. అప్ప‌ట్లో బీఆర్ఎస్ పాల‌కులు, అధికారులు స్పందించ‌లేద‌ని మంత్రి చెప్పారు. విజ‌య‌న‌గ‌ర్ కాల‌నీలో 400 చ‌ద‌ర‌పు గ‌జాలు, తుల్జాగూడ‌లో 22 చ‌ద‌ర‌పు గ‌జాలు, ల‌క్ష్మిగూడ‌లో 130 చ‌ద‌ర‌పు గ‌జాలు, మ‌హ‌బూబ్ గంజ్‌లో 497 చ‌ద‌ర‌పు గ‌జాల స్ధ‌లాల‌ను రామునాయిక్ ప‌లువురి పేరిట అక్ర‌మంగా రిజిస్ట్రేష‌న్ చేయించగా వాటిపై విచార‌ణ చేస్తున్నామ‌న్నారు. స‌బ్ రిజిస్ట్రార్‌ల పాత్ర‌పై కూడా ఆరా తీయాల‌ని స్టాంప్స్ అండ్‌ రిజిస్ట్రేష‌న్ ఐజీని ఆదేశించామ‌ని పేర్కొన్నారు.

రామునాయ‌క్‌ను స‌స్పెండ్ చేశాం..

అయితే రామునాయ‌క్‌ను త‌క్ష‌ణ‌మే స‌స్పెండ్ చేశామ‌ని, యుద్ద ప్రాతిప‌దిక‌న విచార‌ణ పూర్తి చేసి అన్ని ఆధారాల‌ను నిర్ధారించిన త‌ర్వాత‌ శాశ్వ‌తంగా ఉద్యోగం నుంచి తొల‌గిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ అక్ర‌మాల‌కు స‌హ‌క‌రించిన సూప‌రింటెండెంట్ వివేకానంద్ రిటైర్మెంట్ మ‌రో ప‌ది సంవ‌త్స‌రాలు ఉండ‌గానే విధుల నుంచి శాశ్వ‌తంగా తొల‌గించామ‌న్నారు. మ‌రో సూప‌రింటెండెంట్ బోనా నాయిక్‌ను సస్పెండ్ చేసిన‌ట్లు వెల్ల‌డించారు.

ఏ హోదాలో ఉన్నా వ‌దిలిపెట్టం..

ప్రభుత్వ భూములపై కన్నేసిన వారెవ‌రినీ వదిలిపెట్టమ‌న్నారు. ఎంతటి హోదాలో ఉన్నా, ఎంతటి పలుకుబడి ఉన్నా చట్టం ముందు అందరూ సమానమే తేల్చి చెప్పారు. ప్రభుత్వ భూములను కొల్లగొట్టే అధికారులకు ప్రభుత్వ సేవలో కొనసాగే అర్హత లేదన్నారు. ఇలాంటి వారిని గుర్తించి శాశ్వతంగా తొలగించే దిశగా చర్యలు తీసుకుంటామ‌ని చెప్పారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, ప్రజల ఆస్తులను కాపాడటం ప్రభుత్వ ప్రథమ బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు. భూ కబ్జాలు, అక్రమ రిజిస్ట్రేషన్లు, అధికార దుర్వినియోగంపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని హెచ్చరించారు.

Advertisement
Advertisement