త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Komatireddy Venkat Reddy | రూ.5 కోట్ల బకాయిలకు రూ.54 కోట్ల నోటీసు ఎలా ఇస్తారు? కాంట్రాక్ట‌ర్ శ్రీ‌నివాస్‌రెడ్డి కుటుంబానికి నేనున్నా

Komatireddy Venkat Reddy | రూ.5 కోట్ల బకాయిలకు రూ.54 కోట్ల నోటీసు ఎలా ఇస్తారని.. ఇది మైనింగ్ అధికారి అనాలోచిత చర్యే అని మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి మండిపడ్డారు. శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి వచ్చిన మైనింగ్ సంబంధిత నోటీసుపై ఆయ‌న‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి ఇలాంటి నోటీసులు, క్రషర్‌కు సంబంధించిన సమస్యలు, విద్యుత్ కనెక్షన్ వంటి అంశాలపై కూడా తక్షణమే అధికారులతో చర్చిస్తామని చెప్పారు.

S

Telangana | Published On Aug 6, 2026, 1.34 pm IST

Komatireddy Venkat Reddy | రూ.5 కోట్ల బకాయిలకు రూ.54 కోట్ల నోటీసు ఎలా ఇస్తారు? కాంట్రాక్ట‌ర్ శ్రీ‌నివాస్‌రెడ్డి కుటుంబానికి నేనున్నా
Advertisement
  • మైనింగ్ అధికారి అనాలోచిత చర్య వల్లే ఆయ‌న‌ చనిపోయారు
  • ఈ విష‌యాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తా
  • గత ప్రభుత్వం పెట్టిన పెండింగ్ బిల్లు 5.3 కోట్లు క్లియర్ చేయించా
  • రేపు మంత్రి వివేక్‌తో స‌మీక్ష నిర్వ‌హిస్తాం
  • మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

Komatireddy Venkat Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: రూ.5 కోట్ల బకాయిలకు రూ.54 కోట్ల నోటీసు ఎలా ఇస్తారని.. ఇది మైనింగ్ అధికారి అనాలోచిత చర్యే అని మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి మండిపడ్డారు. శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి వచ్చిన మైనింగ్ సంబంధిత నోటీసుపై ఆయ‌న‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి ఇలాంటి నోటీసులు, క్రషర్‌కు సంబంధించిన సమస్యలు, విద్యుత్ కనెక్షన్ వంటి అంశాలపై కూడా తక్షణమే అధికారులతో చర్చిస్తామని చెప్పారు. కాంట్రాక్టర్ల మైనింగ్ సంబంధిత సమస్యల పట్ల శుక్రవారం మంత్రి వివేక్ వెంకట స్వామితో సమీక్ష నిర్వహిస్తామన్నారు. మృతికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకునే అంశాన్ని కూడా పరిశీలిస్తామని మంత్రి స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్ వనస్థలిపురంలోని నివాసంలో బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన కాంట్రాక్టర్, వైస్ ఎంపీపీ, సింగిల్ విండో చైర్మన్‌గా ప్రజలకు సేవలందించిన బండారి శ్రీ‌నివాస్‌రెడ్డి మృతి బాధాక‌ర‌మ‌న్నారు. శ్రీనివాస్ రెడ్డి కేవలం కాంట్రాక్టర్ మాత్రమే కాదని, ప్రజా జీవితంలో చురుకుగా ఉంటూ మంచి పేరు సంపాదించుకున్న నాయకుడని తెలిపారు. చిన్నచిన్న పనులు, క్రషర్ నిర్వహణ ద్వారా సుమారు 200 మందికి ఉపాధి కల్పించారని, నాణ్యమైన పనులు చేసే కాంట్రాక్టర్‌గా ఆయనకు మంచి గుర్తింపు ఉందన్నారు.

గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన CRF పనులకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.685 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉండగా, శ్రీనివాస్ రెడ్డికి కూడా దాదాపు రూ.5 కోట్ల బకాయిలు ఉన్నాయని మంత్రి తెలిపారు. ఈ బకాయిలను విడుదల చేయించేందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ప్రత్యేకంగా మాట్లాడి, ఇటీవలే సంబంధిత పెండింగ్ చెక్ విడుదల చేయించినట్లు వెల్లడించారు. శ్రీనివాస్ రెడ్డి కుటుంబం కొంత కుదుటపడిన తర్వాత వారిని పరామర్శించి అండగా నిలవాలని భావించానని, అందులో భాగంగానే ఈరోజు కుటుంబ సభ్యులను కలిసినట్లు మంత్రి తెలిపారు.

కాంట్రాక్టర్లు ధైర్యంగా ఉండాలి..

రాష్ట్రంలోని చిన్న కాంట్రాక్టర్లందరికీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భరోసా ఇచ్చారు. “మీకు ఏ బిల్లులు పెండింగ్‌లో ఉన్నా నా దృష్టికి తీసుకురండి. మీ అసోసియేషన్ ద్వారా అయినా, నేరుగా నా సెక్రటేరియట్‌కు లేదా నా వద్దకు అయినా వచ్చి సమస్యలను చెప్పండి. ఎవరూ అధైర్యపడవద్దు. అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చర్చించి మీ సమస్యలను పరిష్కరిస్తాం” అని మంత్రి అన్నారు.

గ్రావెల్, క్రషర్లు, మైనింగ్‌కు సంబంధించిన సమస్యలను సంబంధిత మంత్రితో, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చర్చించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మైనింగ్ రంగంలో అసాధారణమైన నోటీసులు, ఇబ్బందులు లేకుండా తగిన విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీనివాస్ రెడ్డి మృతి తీరని లోటని మంత్రి పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి, ముఖ్యంగా కుమారుడికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం కూడా అండగా ఉంటుంద‌ని చెప్పారు.

కాగా అంత‌కుముందు శ్రీనివాస్ రెడ్డి మృతిపై ఆయ‌న భావోద్వేగానికి లోన‌య్యారు. శ్రీనివాస్ రెడ్డి భార్య, కుమారుడికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి చిత్ర పటానికి అంజలి ఘటించారు. శ్రీనివాస్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు మంత్రి వెంకట్‌రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ల సంఘం ప్రతినిధులు, బిల్డర్స్ అసోసియేషన్ నాయకులు డి.వి. ఎన్ రెడ్డి, ఎస్‌.ఎన్‌.రెడ్డి ఆర్ అండ్ బి సీ.ఈ వసంత్ నాయక్, ఆల్ ఇండియా కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ దేవేందర్ రెడ్డి, ఆదిభట్ల మున్సిపల్ మాజీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ చైర్మన్ చిలుకా మధు సూదన్ రెడ్డి, పలువురు స్థానిక నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement