త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kodangal | కొడంగ‌ల్‌లో భూములు కోల్పోయిన రైతులకు ఇండ్ల ప‌ట్టాలు

Kodangal అభివృద్ధి కోసం భూములు ఇచ్చిన రైతుల పునరావాసంలో భాగంగా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. టీజీఐఐసీ (తెలంగాణ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌) పారిశ్రామిక కారిడార్‌ కోసం భూములు కోల్పోయిన రైతులకు ఇండ్ల స్థ‌లాల‌కు సంబంధించిన పట్టాలను పంపిణీ చేశారు. కొడంగల్‌ నియోజకవర్గంలోని లగచర్ల, హకీంపేట, పోలేపల్లి గ్రామాలకు చెందిన అర్హులైన రైతులకు జిల్లా కలెక్టర్‌ దీపక్‌ తివారీ బుధవారం పట్టాలు అందజేశారు.

P

Telangana | Published On Aug 5, 2026, 10.20 pm IST

Kodangal | కొడంగ‌ల్‌లో భూములు కోల్పోయిన రైతులకు ఇండ్ల ప‌ట్టాలు
Advertisement

Kodangal అభివృద్ధి కోసం భూములు ఇచ్చిన రైతుల పునరావాసంలో భాగంగా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. టీజీఐఐసీ (తెలంగాణ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌) పారిశ్రామిక కారిడార్‌ కోసం భూములు కోల్పోయిన రైతులకు ఇండ్ల స్థ‌లాల‌కు సంబంధించిన పట్టాలను పంపిణీ చేశారు. కొడంగల్‌ నియోజకవర్గంలోని లగచర్ల, హకీంపేట, పోలేపల్లి గ్రామాలకు చెందిన అర్హులైన రైతులకు జిల్లా కలెక్టర్‌ దీపక్‌ తివారీ బుధవారం పట్టాలు అందజేశారు. బసిరెడ్డి ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ దీపిక్ తివారి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు అభివృద్ధితో పాటు రైతుల సంక్షేమం, పునరావాసానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. భూములు కోల్పోయిన ప్రతి అర్హ లబ్ధిదారుడికి పారదర్శకంగా, నిర్ణీత సమయంలో ఇంటి స్థల పట్టాలు అందించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

లబ్ధిదారులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. భూములు కోల్పోయిన కుటుంబాలకు ప్రకటించిన పునరావాస, పునఃస్థాపన చర్యలు సమర్థంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఇంటి స్థలాల కేటాయింపునకు లాటరీ విధానాన్ని నిర్వహించారు. హకీంపేట అసైన్డ్‌ భూముల కింద 175 మంది లబ్ధిదారులకు 17 విడతల్లో, పట్టా భూముల కింద 113 మందికి 16 విడతల్లో లాటరీ నిర్వహించారు. లగచర్ల అసైన్డ్‌ భూముల కింద 54 మందికి 7 విడతల్లో, పట్టా భూముల కింద 173 మందికి 31 విడతల్లో, పోలేపల్లి అసైన్డ్‌ భూముల కింద 38 మందికి ఆరు విడతల్లో కేటాయింపులు చేపట్టారు. మొత్తం 432 మంది లబ్ధిదారులకు లాటరీ ద్వారా ఇంటి స్థలాలు కేటాయించగా, మరో 121 మందికి నేరుగా ప్లాట్లు కేటాయించారు. మొత్తం 553 కుటుంబాలకు ప్రయోజనం చేకూరింది. పూర్తి పారదర్శకత కోసం 77 విడతల్లో లాటరీ ప్రక్రియ నిర్వహించారు.

పునరావాస కార్యక్రమానికి లగచర్ల, హకీంపేట, పోలేపల్లి, రోటిబండ తండా రైతులు అందించిన సహకారాన్ని కలెక్టర్‌ అభినందించారు. స్థానికుల సహకారంతో 230 ఎకరాల్లో సమీకృత పాఠశాల విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, త్వరలో ఈ ప్రాంతంలో పారిశ్రామిక పార్కు అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. దీనివల్ల ఉపాధి, ఆర్థిక అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 501 మంది లబ్ధిదారులకు పట్టాలు జారీ చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. హైదరాబాద్‌-కొడంగల్‌ను అనుసంధానించే ప్రతిపాదిత రేడియల్‌ రోడ్డు ప్రాంత అభివృద్ధికి కీలకంగా మారుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఎస్పీ స్నేహ మెహ్రా, అదనపు కలెక్టర్‌ వెంకటాచారి, అదనపు ఎస్పీ రాజేశ్ మీనా, ఆర్డీఓ అనిత, మున్సిపల్‌ చైర్మన్‌ ప్రశాంత్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అంపయ్య గౌడ్‌, హకీంపేట, లగచర్ల, పోలేపల్లి సర్పంచులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement