త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Saidabad Steel Bridge | సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి ప్రారంభానికి సన్నాహాలు.. పరిశీలించిన మంత్రులు

Saidabad Steel Bridge | నగరంలో ట్రాఫిక్‌ సమస్యలకు పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం చేపట్టిన కీలక వంతెన పనులు పూర్తయ్యాయి. సైదాబాద్‌ స్టీల్‌ బ్రిడ్జి, మూసారాంబాగ్‌ వంతెనలను రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్‌, మహ్మద్‌ అజారుద్దీన్‌ బుధవారం పరిశీలించారు. త్వరలోనే ఈ వంతెనలను ముఖ్యమంత్రి ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

P

Hyderabad | Published On Aug 5, 2026, 9.20 pm IST

Saidabad Steel Bridge | సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి ప్రారంభానికి సన్నాహాలు.. పరిశీలించిన మంత్రులు
Advertisement

Saidabad Steel Bridge | నగరంలో ట్రాఫిక్‌ సమస్యలకు పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం చేపట్టిన కీలక వంతెన పనులు పూర్తయ్యాయి. సైదాబాద్‌ స్టీల్‌ బ్రిడ్జి, మూసారాంబాగ్‌ వంతెనలను రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్‌, మహ్మద్‌ అజారుద్దీన్‌ బుధవారం పరిశీలించారు. త్వరలోనే ఈ వంతెనలను ముఖ్యమంత్రి ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు, ఎమ్మెల్యేలు అహ్మద్‌ బిన్‌ అబ్దుల్లా బలాల, కాలేరు వెంకటేశ్‌లతో కలిసి మంత్రులు వంతెనల పనులను పరిశీలించారు. సైదాబాద్‌ స్టీల్‌ బ్రిడ్జి పనులు రూ.680 కోట్ల వ్యయంతో పూర్తయ్యాయని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

చంచల్‌గూడ జైలు నుంచి ఒవైసీ ఆసుపత్రి వరకు ఈ వంతెన నిర్మాణం చేపట్టామని, చంపాపేట వైపు అనుసంధాన మార్గం కూడా ఉంటుందని చెప్పారు. ఈ వంతెన అందుబాటులోకి వస్తే సంతోష్‌నగర్‌, చంచల్‌గూడ, సైదాబాద్‌ ప్రాంతాల ప్రజలకు నగరంలోని ఇతర ప్రాంతాలకు రాకపోకలు సులభతరం అవుతాయని తెలిపారు. ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ట్రాఫిక్‌ ఇబ్బందులు కూడా తగ్గుతాయన్నారు. సైదాబాద్‌ స్టీల్‌ బ్రిడ్జితో పాటు మూసారాంబాగ్‌ వంతెనను కూడా త్వరలో ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి పేర్కొన్నారు. రెండు వంతెనలకు సంబంధించిన అప్రోచ్‌ రోడ్లను మరింత విస్తరించాలని అధికారులను ఆదేశించారు. ఈ దీర్ఘకాలిక పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపారని తెలిపారు.

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరంలో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని పొన్నం ప్రభాకర్‌ చెప్పారు. కేబీఆర్‌ పార్కు సమీపంలోని వంతెన పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. మంత్రి మహ్మద్‌ అజారుద్దీన్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ రద్దీ తగ్గించేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ఫ్లైఓవర్లు, వంతెనలను నిర్మిస్తోందన్నారు. వీటి వల్ల ట్రాఫిక్‌ సమస్యలు తగ్గడంతో పాటు ప్రయాణ సమయం ఆదా అవుతుందని తెలిపారు. నగరంలోని రద్దీ ప్రాంతాలు, ట్రాఫిక్‌ సమస్యలు ఉన్న కూడళ్లను గుర్తించి అవసరమైన చోట కొత్త ఫ్లైఓవర్ల నిర్మాణంపై పరిశీలన చేస్తున్నట్లు చెప్పారు. మంత్రుల వెంట జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ప్రియాంక అలా, ఇంజినీరింగ్‌ అధికారులు, కాంట్రాక్టర్లు ఉన్నారు.

Advertisement
Advertisement