త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | ఇది చంద్ర‌బాబుకు..రేవంత్ ఇచ్చిన సంక్రాంతి గిఫ్ట్..!

Harish Rao | ఏపీ త‌ల‌పెట్టిన పోల‌వ‌రం-న‌ల్ల‌మ‌ల సాగ‌ర్ ప్రాజెక్టు విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిష‌న్‌ను వెన‌క్కి తీసుకొని.. సంక్రాంతి పండుగ వేళ రేవంత్ చంద్రబాబుకు ఇచ్చిన గిఫ్ట్ ఇచ్చార‌ని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు విమ‌ర్శించారు. ప్రాజెక్ట్ విష‌యంలో రేవంత్ ప్రభుత్వం పద్ధతి ప్రకారం ఏపీకి పూర్తిగా స‌హ‌కారం అందిస్తుంద‌ని ఆయ‌న ఆరోపించారు.

P

Telangana | Published On Jan 12, 2026, 3.32 pm IST

Harish Rao | ఇది చంద్ర‌బాబుకు..రేవంత్ ఇచ్చిన సంక్రాంతి గిఫ్ట్..!
Advertisement
  • ఏపీ పోల‌వ‌రం-న‌ల్ల‌మ‌ల సాగ‌ర్‌కు కాంగ్రెస్ ప్ర‌భుత్వం స‌హ‌కారం
  • సుప్రీంకోర్టు సాక్షిగా ద్రోహబుద్ధి బ‌ట్ట‌బ‌య‌లు
  • అర్హ‌త లేని పిటిష‌న్ వేసి తెలంగాణ‌కు తీర‌ని అన్యాయం
  • ఈ విష‌యం అభిషేక్ సింఘ్వీకి తెలియ‌దా?
  • నీళ్ల‌మంత్రి సూటూబూటు వేసుకొని వెళ్లింది ఢిల్లీ వెళ్లింది రిట్ విత్ డ్రాకేనా?
  • గురుదక్షిణ కోసం తెలంగాణకు ద్రోహం చేస్తుంటే ఊరుకోం
  • కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగిన హ‌రీశ్‌రావు

Harish Rao | ఏపీ త‌ల‌పెట్టిన పోల‌వ‌రం-న‌ల్ల‌మ‌ల సాగ‌ర్ ప్రాజెక్టు విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిష‌న్‌ను వెన‌క్కి తీసుకొని.. సంక్రాంతి పండుగ వేళ రేవంత్ చంద్రబాబుకు ఇచ్చిన గిఫ్ట్ ఇచ్చార‌ని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు విమ‌ర్శించారు. ప్రాజెక్ట్ విష‌యంలో రేవంత్ ప్రభుత్వం పద్ధతి ప్రకారం ఏపీకి పూర్తిగా స‌హ‌కారం అందిస్తుంద‌ని ఆయ‌న ఆరోపించారు. విచారణ అర్హత లేని పిటిషన్ వేసి ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుకు స‌హ‌క‌రిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి నిజ‌స్వ‌రూపం, ద్రోహబుద్ధి సుప్రీంకోర్టు సాక్షిగా బట్టబయలైంద‌న్నారు. నాడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో రైతులతో రిట్ వేయించి మరీ ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుకు స్టే సాధిస్తే.. ఇక్కడి చేతగాని కాంగ్రెస్ సర్కారు మాత్రం ఉద్దేశపూర్వకంగానే విచారణ అర్హత లేని పిటిషన్ వేసి తెలంగాణకు తీరని అన్యాయం చేసింద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఈ మాత్రం విషయం న్యాయవాది, ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ గారికి తెలియదా? అంటూ ప్ర‌శ్నించారు.

తెలంగాణ‌కు రేవంత్ చారిత్ర‌క ద్రోహం

రిట్ విత్ డ్రా చేయించడానికే నీళ్ల మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెర‌డ్డి సూటు బూటు వేసుకొని ఢిల్లీ వెళ్లారా? అంటూ ఆయ‌న నిల‌దీశారు. ముఖ్యమంత్రిగా ఉంటూ మన నీటి హక్కులను ఏపీకి దారాదత్తం చేస్తూ రేవంత్ తెలంగాణకు చేస్తున్న చారిత్రక ద్రోహమ‌న్నారు. రిట్ ఉపసంహరించుకొని, సివిల్ సూట్ ఫైల్ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పడం అంటే.. పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు కట్టుకోవడానికి ఏపీకి గడువు ఇవ్వ‌డ‌మేన‌న్నారు. ఏపీ, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, క‌ర్నాట‌క వాదనలు కూడా వినడం అనేది ఏండ్లు గడిచినా ముగియని కథేన‌న్నారు. ఈ లోగా ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు పనులు పూర్తి చేసుకొని, తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తూ అప్పనంగా నీళ్లను తరలించుకు పోతుంద‌ని మండిప‌డ్డారు.

తెలంగాణ న‌దీ జ‌లాల‌కు మ‌ర‌ణ‌శాస‌నం రాసిండు

పోను పోను అనుకుంటూనే రేవంత్ రెడ్డి ఆనాడు ఢిల్లీ మీటింగ్‌కు వెళ్లాడ‌ని, ఎజెండాలో లేదంటూనే బనకచర్లపై చర్చ జ‌రిపాడ‌ని మండిప‌డ్డారు. పెట్టబోను అంటూనే సంతకం పెట్టి తెలంగాణ నదీ జలాలకు మరణశాసనం రాశాడ‌ని, వేయను అంటూనే కమిటి వేసి ఏపీ జల దోపిడీకి రెడ్ కార్పెట్ వేశాడ‌ని ఆరోపించారు. టెండర్ చివరి తేదీ అయిపోయాక సుప్రీం కోర్టుకు వెళ్లి నల్లమల సాగర్ ప్రాజెక్టుకు పరోక్షంగా అంగీకారం తెలిపాడ‌ని, పస లేని రిట్ వేసి పరిపూర్ణంగా నల్లమల సాగర్‌కు మద్దతు ప్ర‌క‌టించాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. మేం నిలదీస్తే బనకచర్లను అడ్డుకుంటాం.. సుప్రీంకోర్టుకు వెళ్తాం అంటూ న‌మ్మ‌బ‌లికిన రేవంత్ రెడ్డి, నేడు కావాలనే బలహీనమైన పిటిషన్ వేసి తెలంగాణకు మోసం చేశాడ‌న్నారు.

దుర్మార్గాన్ని ఎండ‌గ‌డుతాం..

పంచాయతీలు వద్దు, న్యాయస్థానాలు వద్దు మనమే కూర్చొని చర్చించుకుందాం అన్న రేవంత్ రెడ్డి మాటల అంతర్యం ఏమిటి? అంటూ ప్ర‌శ్నించారు. తెలంగాణ నీటి హక్కులను గంపగుత్తగా ఏపీకి అప్ప చెప్పడమేనా మీ చర్చల లక్ష్యమ‌ని తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. తెలంగాణలోని కృష్ణా, గోదావరి నదులపై చంద్రబాబు, ఆంధ్రా ప్రభుత్వం అడ్డుకోని ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా? అని ప్ర‌శ్నించిన హ‌రీశ్‌రావు.. అలాంటి చంద్రబాబుతో దోస్తీ కట్టి, తెలంగాణకు తీరని అన్యాయం చేసేందుకు సిద్ధమైన రేవంత్ రెడ్డి నిన్ను తెలంగాణ సమాజం క్ష‌మించ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. గురుదక్షిణ కోసం తెలంగాణకు ద్రోహం చేస్తుంటే తెలంగాణను సాధించిన బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోద‌న్నారు. దుర్మార్గాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతామ‌ని, తెలంగాణ నీటి హక్కుల కోసం పోరు చేస్తామ‌ని హెచ్చ‌రించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement