త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | రేవంత్ రెడ్డి డూప్లికేట్ రైతుబిడ్డ : హ‌రీశ్‌రావు

Harish Rao | వ‌రి ధాన్యం, మొక్క‌జొన్న కొనుగోళ్ల‌పై నిర్ల‌క్ష్యం ప్ర‌ద‌ర్శిస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. నువ్వు ఒరిజినల్ రైతు బిడ్డవి కావు, డూప్లికేట్ రైతు బిడ్డవి. నువ్వు నిజంగా రైతు బిడ్డవైతే.. తక్షణమే కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టు. సచివాలయంలో ఉన్న ఉన్నతాధికారులను జిల్లాకు ఒకరి చొప్పున ఇన్ ఛార్జిగా పంపించి యుద్ధప్రాతిపదికన కొనుగోళ్లు చేయించు అని హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు.

S

Telangana | Published On May 3, 2026, 5.24 pm IST

Harish Rao | రేవంత్ రెడ్డి డూప్లికేట్ రైతుబిడ్డ : హ‌రీశ్‌రావు
Advertisement

కొత్త నిబంధనల పేరుతో రైతులకు గోస
రాజీవ్ రహదారిపై రైతుల రాస్తారోకో..
ధర్నాలో కూర్చుని మద్దతు తెలిపిన హరీశ్ రావు
వ‌డ్లు కొన‌కుండా రైతుల ఉసురు పోసుకుంటున్న‌రు
తక్షణమే పాత పద్ధతిలోనే వ‌డ్లు, జొన్న‌లు, శ‌న‌గ‌లు కొనుగోలు చేయాలి
మాజీ మంత్రి హ‌రీశ్‌రావు డిమాండ్

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : వ‌రి ధాన్యం, మొక్క‌జొన్న కొనుగోళ్ల‌పై నిర్ల‌క్ష్యం ప్ర‌ద‌ర్శిస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. నువ్వు ఒరిజినల్ రైతు బిడ్డవి కావు, డూప్లికేట్ రైతు బిడ్డవి. నువ్వు నిజంగా రైతు బిడ్డవైతే.. తక్షణమే కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టు. సచివాలయంలో ఉన్న ఉన్నతాధికారులను జిల్లాకు ఒకరి చొప్పున ఇన్ ఛార్జిగా పంపించి యుద్ధప్రాతిపదికన కొనుగోళ్లు చేయించు అని హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు.

కరీంనగర్ సిద్దిపేట రాజీవ్ రహదారిపై మల్లారం స్టేజ్ వద్ద వడ్ల కొనుగోలు చేయడం లేదని నిరసన తెలుపుతూ రైతులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. అదే సమయంలో అటుగా ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు దారిమధ్యలో ఆగి, రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారికి అండగా రోడ్డుపై బైఠాయించి ధర్నాకు సంఘీభావం ప్రకటించారు.

ఈ సంద‌ర్భంగా హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే, వడ్లు కొనొద్దనే కుట్రతో రకరకాల నిబంధనల పేరిట రైతులను గోస పెడుతోంది. పేరుకే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు తప్ప ఒక్క గింజ కూడా ఎత్తడం లేదు. మల్లారం సెంటర్ వద్ద రైతులు.. 28 రోజుల క్రితం వడ్లు పోశాం, ఇప్పటివరకు ఒక్క గింజ కొనలేదు అని కన్నీరుమున్నీరు అవుతున్నారు. FAQ పేరిట, బీ-గ్రేడ్ వడ్లని, తాలు ఉన్నదని, కోతల పేరిట బస్తాకు 2 కిలోలు ఎక్కువ తూకం వేయాలని అధికారులు కొర్రీలు పెట్టి రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు అని మండిప‌డ్డారు.

మొక్క‌జొన్న కొనుగోళ్ల‌కు గ‌న్నీ బ్యాగులు లేవు..

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో గత నాలుగు రోజుల నుంచి గన్నీ బ్యాగులు లేవు. రైతులే సొంతంగా సంచులు కొనుక్కొని రావాలని అధికారులు చెబుతున్నారు. ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో మొక్కజొన్న రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో రైతులు సన్ ఫ్లవర్ కుప్పలు పోసి 22 రోజులైంది. ఎప్పుడు కొంటారో చెప్పరు. ఉదయం రావడం, రాత్రి అక్కడే పడుకోవడం.. కుప్పలకు కాపలా కాయాల్సిన దుస్థితి ఏర్ప‌డింద‌ని సీఎంపై నిప్పులు చెరిగారు.

జొన్న‌ల కొనుగోళ్లు ప్రారంభించ‌లేదు.. శ‌న‌గ‌ల కొనుగోళ్లు ఆపేశారు..

జొన్నల కొనుగోలు కేంద్రాలు ఇంతవరకు ప్రారంభించలేదు. శనగల కొనుగోళ్లు మధ్యలోనే ఆపేశారు. రాష్ట్రంలో వడ్లు కొత్తగా పండుతున్నాయా.. గతంలో ప్రభుత్వాలు కొనలేదా. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు ఎప్పుడూ ఈ రకమైన ఇబ్బంది రాలేదు. ఈ యాసంగిలో 90 లక్షల టన్నుల వడ్లు కొంటామని చెప్పి, కనీసం 9 లక్షల టన్నులు, 10 పైసల వడ్లు కూడా కొనలేదు. మద్దతు ధర రాక రైతులు క్వింటాల్‌కు రూ. 400 నుంచి రూ. 500 తక్కువకు బయట అమ్ముకుంటున్నారని హ‌రీశ్‌రావు తెలిపారు.

కుప్ప‌ల వ‌ద్దే రైతులు రాలిపోతున్నారు..

ఒకవైపు 44 డిగ్రీల ఎండలో రైతులు మాడిపోతున్నారు. వడదెబ్బ తగిలి కుప్పల వద్దే రాలిపోతున్నారు. అయినా రేవంత్ రెడ్డికి కనికరం లేదు. ఇంకెంత మంది రైతుల ప్రాణాలు పోవాలి? బోనస్ మాట ఎత్తడం లేదు. పోయిన యాసంగి బోనస్ ఎగ్గొట్టారు, రైతుబంధు ఇంతవరకు ఇవ్వలేదు. పోనీ పండిన వడ్లయినా కొంటున్నారా అంటే అదీ లేదు. అధికారులను అడిగితే పైనుంచి ఆదేశాలు అంటారు. ట్రక్ షీట్లు అప్లోడ్ చేయట్లేదు. ఎరువులు కావాలంటే యాప్ అంటారు, వడ్లు కొనాలంటే ఆన్‌లైన్ అంటారు. మొత్తంగా కొనొద్దనేది మీ ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది.
నల్గొండ జిల్లాలో ఒక్కో రైస్ మిల్లు దగ్గర 30, 40, 50 లారీలు వారం రోజులుగా లైన్లో ఉంటున్నాయి. మిల్లర్లు దించుకోవడం లేదు. వడ్ల కొనుగోళ్లపై ప్రభుత్వానికి కనీస పాలసీ లేదు. కలెక్టర్‌తో నేను స్వయంగా మాట్లాడితే.. నిబంధనల ప్రకారమే కొనాలి అని సమాధానం చెబుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే రైతులు రోడ్డెక్కారు, అందుకే వారికి అండగా మేము నిలబడ్డామ‌ని హ‌రీశ్‌రావు తెలిపారు.

రైతు బిడ్డ‌వైతే.. రైతుల ఉసురు పోసుకుంటావా..?

మాటల్లో మాత్రం రేవంత్ రెడ్డి నేను రైతు బిడ్డను అని డైలాగులు చెబుతాడు. నువ్వు రైతు బిడ్డవైతే వడ్లు కొనకుండా రైతుల ఉసురు పోసుకుంటావా? దేవుని మీద ఒట్టుపెట్టి రుణమాఫీ ఎగ్గొడతావా? రైతుబంధు ఎగ్గొడతావా? ఎరువుల కోసం ఇబ్బంది పెడతావా? నువ్వు ఒరిజినల్ రైతు బిడ్డవి కావు, డూప్లికేట్ రైతు బిడ్డవి. నువ్వు నిజంగా రైతు బిడ్డవైతే.. తక్షణమే కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టు. సచివాలయంలో ఉన్న ఉన్నతాధికారులను జిల్లాకు ఒకరి చొప్పున ఇన్ ఛార్జిగా పంపించి యుద్ధప్రాతిపదికన కొనుగోళ్లు చేయించు. బీఆర్ఎస్ హయాంలో ఏ రకంగా అయితే సాఫీగా నిబంధనలు లేకుండా కొనుగోళ్లు జరిగాయో.. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో వడ్లు కొనుగోలు చేయాలి. మొక్కజొన్న రైతులకు వెంటనే గన్నీ బ్యాగులు ఇవ్వాలి. ఆపేసిన సన్ ఫ్లవర్, జొన్నలు, శనగల కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామ‌ని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

Advertisement
Advertisement