త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Goshala Policy | రాష్ట్రంలో 4 మెగా గోశాలలు.. తెలంగాణ కల్చరల్ యానిమల్‌గా ఆవు

గోసంరక్షణకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. త్వరలోనే రాష్ట్రంలో కొత్త 'గోశాల పాలసీ'ని తీసుకురావడంతో పాటు 4 భారీ గోశాలలను నిర్మించనుంది.

J

Telangana | Published On Jul 14, 2026, 8.22 pm IST

Telangana Goshala Policy | రాష్ట్రంలో 4 మెగా గోశాలలు.. తెలంగాణ కల్చరల్ యానిమల్‌గా ఆవు
Advertisement
  • గోశాల నిర్వాహకులతో తెలంగాణ పశుసంవర్ధక శాఖ, గోశాల సేవా సమితి ప్రత్యేక సమావేశం
  • రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో త్వరలో రాష్ట్రంలోకి 'గోశాల పాలసీ' (Goshala Policy)
  • ఎనికపల్లి, వేములవాడ, యాదగిరిగుట్ట, వెటర్నరీ వర్సిటీల్లో 4 భారీ గోశాలల ఏర్పాటుకు సన్నాహాలు
  • గోవును 'తెలంగాణ కల్చరల్ యానిమల్'గా ప్రకటించాలని వక్తల డిమాండ్

Telangana Goshala Policy | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో గోసంరక్షణ, హిందూ ధార్మిక కార్యక్రమాలకు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) పెద్దపీట వేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో త్వరలోనే తెలంగాణలో నూతన 'గోశాల పాలసీ' (Goshala Policy) రాబోతోంది. పశుసంవర్ధక శాఖ (Animal Husbandry), తెలంగాణ గోశాల సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి గోశాల నిర్వాహకులతో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈ కీలక విషయాలు వెల్లడయ్యాయి.

Revanth Govt to Launch New Goshala Policy 4 Mega Cow Shelters in Telangana

తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ (TGLDA) చైర్మన్ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ ఈ సమావేశంలో పాల్గొని ప్రభుత్వ ప్రణాళికలను వివరించారు.

ఆ నాలుగు ప్రాంతాల్లో భారీ గోశాలల ఏర్పాటు

గోవుల సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా నాలుగు భారీ గోశాలలను ఏర్పాటు చేయబోతోందని డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ తెలిపారు.

ఎనికపల్లి: 99 ఎకరాల విస్తీర్ణంలో రూ. 157 కోట్ల భారీ వ్యయంతో ఏర్పాటు.

వేములవాడ: 100 ఎకరాల విస్తీర్ణంలో మరో భారీ గోశాల.

వీటితో పాటు పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట (Yadagirigutta), హైదరాబాద్‌లోని వెటర్నరీ యూనివర్సిటీ (Veterinary University)లో కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో గోశాలలను నిర్మించనున్నారు.

ఆలయాల అభివృద్ధి, పుష్కరాలకు భారీ నిధులు

సనాతన ధర్మాన్ని, ప్రజల విశ్వాసాలను కాపాడేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని TGLDA చైర్మన్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల పునర్నిర్మాణం కోసం రూ.2,216 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే, రాబోయే గోదావరి పుష్కరాల (Godavari Pushkaralu) కోసం ఏకంగా రూ.1,000 కోట్లను ప్రభుత్వం కేటాయించిందని, గతంలో ఏ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టలేదని ఆయన కొనియాడారు.

Revanth Govt to Launch New Goshala Policy 4 Mega Cow Shelters in Telangana

వక్తల ప్రధాన డిమాండ్లు ఇవే..

ఈ సమావేశంలో పాల్గొన్న గోశాల నిర్వాహకులు, ప్రతినిధులు పలు కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు.

స్పెషల్ బోర్డ్: TGLDA ఆధ్వర్యంలో గోశాలల కోసం ఒక ప్రత్యేక బోర్డును (Special Board) ఏర్పాటు చేయాలి.

యానిమల్ హస్బెండరీ బోర్డ్: పశుసంవర్ధక బోర్డును తక్షణమే ఏర్పాటు చేయాలి.

ప్రకృతి వైద్యం: గోవుల ఆధారిత ప్రకృతి వైద్యాన్ని (Naturopathy) విస్తృతంగా పెంపొందించాలి.

గోమాత ఉత్సవం: TGLDA ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా 'గోమాత ఉత్సవాల'ను నిర్వహించాలి.

కల్చరల్ యానిమల్: గోవును తెలంగాణ కల్చరల్ యానిమల్ (Telangana Cultural Animal) గా అధికారికంగా ప్రకటించాలి.

పాల్గొన్న ప్రముఖులు

ఈ కీలక సమావేశంలో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ (ఐఏఎస్) డాక్టర్ గోపి, TGLDA సీఈవో (CEO) డాక్టర్ సుబ్బారాయుడు, డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రావు పాల్గొన్నారు. వారితో పాటు తెలంగాణ గోశాల సేవా సమితి అధ్యక్షుడు విజయరామ్, సెక్రటరీ బాలకృష్ణ గౌడ్, ట్రెజరర్ ధనుంజయ్, వివిధ జిల్లాల ప్రతినిధులు హాజరై పలు సలహాలు, సూచనలు అందజేశారు.

Advertisement
Advertisement