త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sant Sevalal Jayanthi at BRS Bhavan | గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు, పోడు పట్టాలు కేసీఆర్ ఘనతే : కేటీఆర్

తెలంగాణ భవన్‌లో సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్.. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్‌దేనని కొనియాడారు. అలాగే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, సింగరేణి పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు.

J

Telangana | Published On Feb 15, 2026, 5.18 pm IST

Sant Sevalal Jayanthi at BRS Bhavan | గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు, పోడు పట్టాలు కేసీఆర్ ఘనతే : కేటీఆర్
Advertisement
  • మా తండాలో మా రాజ్యం.. గిరిజనుల ఆత్మగౌరవ ప్రతీక కేసీఆర్ 
  • గిరిజనులకు ఆత్మగౌరవం కల్పించింది కేసీఆరే
  • తెలంగాణ భవన్‌లో ఘనంగా సేవాలాల్ జయంతి వేడుకలు
  • బంజారాహిల్స్‌లో ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే
  • మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలు
  • సింగరేణిలో కార్మికుల పక్షాన పోరాటం ఆగదు
  • సేవాలాల్ జయంతిలో కేటీఆర్

Sant Sevalal Jayanthi at BRS Bhavan | త్రినేత్ర.న్యూస్ : బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు బీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో కన్నుల పండుగగా జరిగాయి. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో బంజారా మహిళల సాంప్రదాయ నృత్యాలు, డప్పు చప్పుళ్లతో తెలంగాణ భవన్ మార్మోగింది. సంత్ సేవాలాల్ చిత్రపటానికి కేటీఆర్, మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఘనంగా నివాళులర్పించారు.

గిరిజన బతుకుల్లో వెలుగులు నింపింది కేసీఆరే

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గిరిజనుల ఆత్మగౌరవాన్ని సమున్నత స్థాయిలో నిలబెట్టిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. "మా తండాలో మా రాజ్యం" అనే నినాదాన్ని నిజం చేస్తూ 3,146 తండాలను, గూడేలాను కొత్త గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్‌దేనని గుర్తు చేశారు. దీనివల్ల వేలాది మంది గిరిజన బిడ్డలు సర్పంచులుగా, వార్డు సభ్యులుగా రాజకీయాల్లో రాణిస్తున్నారని తెలిపారు. జల్, జంగిల్, జమీన్ నినాదానికి న్యాయం చేస్తూ.. ఒకేసారి 4.50 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు అందించి గిరిజనులకు శాశ్వత పరిష్కారం చూపారన్నారు. గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచడమే కాకుండా, వందలాది గురుకుల పాఠశాలలు, రెసిడెన్షియల్ కాలేజీలను ఏర్పాటు చేసి విద్యా విప్లవం తీసుకొచ్చామని కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున కోట్లాది రూపాయల విలువైన భూమిలో బంజారా భవన్‌ను నిర్మించి గిరిజనుల ఆత్మగౌరవాన్ని చాటిచెప్పామన్నారు.

మున్సిపల్ ఎన్నికలు - సింగరేణిపై కీలక వ్యాఖ్యలు

రాజకీయ అంశాలపై స్పందిస్తూ.. మున్సిపల్ ఎన్నికల్లో హంగ్ ఏర్పడిన చోట్ల అధికార కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు పాల్పడుతోందని కేటీఆర్ మండిపడ్డారు. కౌన్సిలర్లను ఎత్తుకుపోవడం, ప్రలోభ పెట్టడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. "మాకున్న అంచనా ప్రకారం 17 మున్సిపాలిటీలు మా ఖాతాలో పడ్డాయి. మరో 10-12 చోట్ల మాకు అవకాశాలు ఉన్నాయి. మా కౌన్సిలర్లు అధికార పార్టీ ఒత్తిళ్లను తట్టుకుని వీరోచితంగా పోరాడుతున్నారు." అని కేటీఆర్ తెలిపారు. సింగరేణి ఎన్నికల ప్రస్తావన తెస్తూ.. సింగరేణిని దోచుకుంటున్న కాంగ్రెస్, బీజేపీలతో సీపీఐ కలవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎవరు కలిసినా, కలవకపోయినా సింగరేణి కార్మికుల ప్రయోజనాల కోసం బీఆర్‌ఎస్ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.

మహాశివరాత్రి శుభాకాంక్షలు

సేవాలాల్ జయంతి, మహాశివరాత్రి ఒకే రోజు రావడం శుభపరిణామమని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్, బీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఖానాపూర్ ఇన్‌ఛార్జ్ జాన్సన్ నాయక్, ఇతర నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

https://x.com/BRSparty/status/2022972789050007936

 

Advertisement
Advertisement