త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Urea Booking Facility | యూరియా బుకింగ్‌కు మీసేవ కేంద్రాల్లో కొత్త సౌకర్యం

Urea Booking Facility | రాష్ట్రంలోని రైతులకు సబ్సిడీ యూరియా అందుబాటును మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోలేని రైతులు తమ సమీపంలోని మీసేవ కేంద్రాల ద్వారా బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించింది.

P

Telangana | Published On Jul 8, 2026, 8.20 pm IST

Urea Booking Facility | యూరియా బుకింగ్‌కు మీసేవ కేంద్రాల్లో కొత్త సౌకర్యం
Advertisement
  • యాప్ వినియోగం తెలియని రైతులకు మరింత సులభతరం

Urea Booking Facility | రాష్ట్రంలోని రైతులకు సబ్సిడీ యూరియా అందుబాటును మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోలేని రైతులు తమ సమీపంలోని మీసేవ కేంద్రాల ద్వారా బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించింది. యూరియా పంపిణీలో పారదర్శకతను పెంచడంతో పాటు, రైతులకు సకాలంలో ఎరువులు అందేలా రాష్ట్ర వ్యవసాయశాఖ ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మీసేవ కేంద్రాల్లో యూరియా బుకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలో పనిచేస్తున్న మీసేవ వ్యవస్థ వ్యవసాయశాఖతో సమన్వయంతో ఈ సౌకర్యాన్ని ప్రారంభించింది. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో ఇబ్బందులు ఎదుర్కొనే రైతులకు ఈ విధానం ఉపయోగపడనుంది.

మీసేవ ద్వారా యూరియా బుకింగ్ ఇలా..

రైతులు తమ పట్టాదారు పాస్‌బుక్ (PPB) నంబర్‌తో సమీపంలోని మీసేవ కేంద్రానికి వెళ్లాలి. అక్కడి ఆపరేటర్ రైతు వివరాలు, సాగు విస్తీర్ణం, పంట వివరాలను నమోదు చేస్తారు. అనంతరం రైతు ఎంపిక చేసుకున్న ఎరువుల డీలర్ వద్ద అవసరమైన యూరియా పరిమాణాన్ని బుక్ చేస్తారు. బుకింగ్ ప్రక్రియ పూర్తయ్యేందుకు రైతు నమోదు చేసుకున్న మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఓటీపీ అథంటికేష‌న్ పూర్త‌య్యాక రైతుకు బుకింగ్ ఐడీ జారీ అవుతుంది. మీసేవ ద్వారా పొందిన బుకింగ్ ఐడీ బుకింగ్ చేసిన రోజును మినహాయించి 48 గంటల పాటు మాత్రమే చెల్లుబాటు అవుతుందని వ్యవసాయశాఖ స్పష్టం చేసింది. ఈ గడువులోపు రైతులు తాము ఎంపిక చేసుకున్న ఎరువుల డీలర్‌ను సంప్రదించి యూరియాను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సబ్సిడీ యూరియా బుకింగ్‌ను అధికారిక ఫర్టిలైజర్ బుకింగ్ యాప్, మీసేవ కేంద్రాల ద్వారానే చేసుకోవాలని వ్య‌వ‌సాయ‌శాఖ సూచించింది. ఓటీపీ అందుకోవడానికి పట్టాదారు పాస్‌బుక్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్ యాక్టివ్‌లో ఉండేలా రైతులు చూసుకోవాలని కోరింది.

రూ.10 స‌ర్వీస్ ఫీజుతో..

మీసేవ కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్ చేసుకునే రైతులకు కేవలం రూ.10 నామమాత్రపు సేవా రుసుము మాత్రమే ఉంటుందని అధికారులు తెలిపారు. బుకింగ్‌కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే సమీప వ్యవసాయ విస్తరణ అధికారి (AEO), మండల వ్యవసాయ అధికారి (MAO) లేదా మీసేవ కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. రాష్ట్రంలోని రైతులందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకుని, అధికారిక బుకింగ్ విధానం ద్వారా సబ్సిడీ యూరియాను పొందాలని వ్యవసాయశాఖ విజ్ఞప్తి చేసింది.

Advertisement
Advertisement