త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Oil Palm Cultivation Telangana | ఆయిల్‌పామ్ సాగులో తెలంగాణే టాప్

రాష్ట్రంలో ఉద్యాన పంటల విస్తరణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఈ ఏడాది అదనంగా 2 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

J

Telangana | Published On Sep 16, 2026, 5.35 pm IST

Oil Palm Cultivation Telangana | ఆయిల్‌పామ్ సాగులో తెలంగాణే టాప్

సంక్షిప్త సారాంశం

రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఉద్యాన పంటల సాగును పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. 2026–27 ఆర్థిక సంవత్సరంలో అదనంగా 2 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు లక్ష్యంగా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించేందుకు ఎకరానికి రూ.46,250 వరకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఉద్యాన రంగ అభివృద్ధికి రూ.1,000 కోట్లతో సమగ్ర కార్యాచరణను చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.

Advertisement
  • ఉద్యాన పంటల విస్తరణకు ప్రభుత్వం పెద్దపీట
  • రూ.1,000 కోట్లతో కార్యాచరణ

Oil Palm Cultivation Telangana | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు, పంటల వైవిధ్యీకరణలో భాగంగా ఉద్యాన పంటల సాగును పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత-జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం శాసనసభలో ఉద్యాన పంటలు, ఆయిల్‌పామ్ సాగుకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమగ్రంగా సమాధానమిచ్చారు.

అదనంగా 2 లక్షల ఎకరాల్లో ఉద్యాన సాగు లక్ష్యం

2026–27 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో వివిధ పథకాల కింద అదనంగా 2 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగులోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని మంత్రి తెలిపారు. పండ్లు, కూరగాయలు, ఆయిల్‌పామ్ తదితర పంటల వైపు రైతులను మళ్లించేందుకు అవగాహన, శిక్షణ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఉద్యాన పంటల సాగు విస్తరణకు అవసరమైన మొక్కలు, ఎరువులు, మల్చింగ్, షేడ్‌నెట్, ఫామ్‌పాండ్లు, శీతల గిడ్డంగులు, శాశ్వత పందిళ్లు, బిందు, తుంపర సేద్యం వంటి సదుపాయాలను నిబంధనల ప్రకారం 40 శాతం నుంచి 90 శాతం వరకు రాయితీపై అందిస్తున్నట్లు వెల్లడించారు.

3.20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు

రాష్ట్రంలో ప్రస్తుతం 88,282 మంది రైతులు 3.20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారని మంత్రి తెలిపారు. NMEO-OP పథకం కింద 2021–22 నుంచి ఇప్పటివరకు 2.74 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేపట్టి తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. రైతులను ఆయిల్‌పామ్ సాగు వైపు ప్రోత్సహించేందుకు మొక్కలు, డ్రిప్, మొదటి నాలుగేళ్లకు ఎరువులు, అంతర పంటల సాగు తదితరాలకు కలిపి ఎకరానికి రూ.46,250 వరకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఆయిల్‌పామ్ గెలలకు టన్నుకు రూ.24,025 ధర లభిస్తోందని స్పష్టం చేశారు.

కొత్తగా ఆయిల్‌పామ్ మిల్లులు, ఉద్యాన అభివృద్ధికి రూ.1,000 కోట్లు

రాష్ట్రంలో ఇప్పటికే నాలుగు ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ మిల్లులు పనిచేస్తుండగా, మరో ఆరు మిల్లుల నిర్మాణ పనులు వివిధ ప్రాంతాల్లో వేగంగా కొనసాగుతున్నాయని, వచ్చే ఏడాదికల్లా ఇవి అందుబాటులోకి వస్తాయని తెలిపారు. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలను అనుసంధానం చేసుకుంటూ ఈ సంవత్సరం సుమారు రూ.1,000 కోట్లతో ఉద్యాన పంటల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.

Advertisement
Advertisement