త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MBA Gold Medalist | ఎంబీఏలో గోల్డ్‌మెడ‌లిస్ట్‌.. చేసేది మాత్రం దొంగ‌త‌నాలు.. ప‌ట్టించిన సెల్ఫ్‌డ్రైవ్ కారు!

MBA Gold Medalist | అతను ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ (MBA Gold Medalist).. చేసేది మాత్రం దొంగతనాలు. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇదే పచ్చి నిజం.

G

Telangana | Published On Apr 9, 2026, 10.46 am IST

MBA Gold Medalist | ఎంబీఏలో గోల్డ్‌మెడ‌లిస్ట్‌.. చేసేది మాత్రం దొంగ‌త‌నాలు.. ప‌ట్టించిన సెల్ఫ్‌డ్రైవ్ కారు!
Advertisement

MBA Gold Medalist | త్రినేత్ర‌.న్యూస్‌: అతను ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ (MBA Gold Medalist).. చేసేది మాత్రం దొంగతనాలు. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇదే పచ్చి నిజం. చదువులో టాపర్ అయినప్ప‌టికీ కెరీర్ విషయంలో మాత్రం దారి తప్పాడు. త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ డ‌బ్బు సంపాదించాల‌ని దొంగతనాల (Thief) బాట‌పట్టాడు. ఓ కేసులో కోర్టుకు హాజ‌రై తిరిగి వెళ్తూ మార్గ‌మ‌ధ్య‌లో ఏకంగా రూ.14 ల‌క్ష‌ల‌కుపైగా న‌గ‌దు అప‌హ‌రించాడు. అయితే దొంగ‌ ఎంత తెలివైన‌వాడైనా చివ‌రికి పోలీసుల‌కు చిక్కాల్సిందేగా.. ఇక్క‌డా అదే జ‌రిగింది..

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా వేటపాలెం నలందానగర్‌కు చెందిన మిక్కిలి వంశీకృష్ణ (43) అలియాస్ శ్యామ్ రిచర్డ్‌ ఎంబీఏ పూర్తిచేశాడు. గోల్డ్‌మెడల్ కూడా సాధించాడు. కొన్నేండ్ల‌ క్రితం స్వగ్రామం నుంచి హైదరాబాద్‌లోని ఎల్బీన‌గ‌ర్ రాక్‌టౌన్ కాల‌నీకి మ‌కాం మార్చాడు. ఓ ఇంట్లో కిరాయికి ఉంటూ ఆన్‌లైన్‌లో దుస్తుల‌ను విక్ర‌యించేవాడు. అయితే ఆశించినంత ఆదాయం రాక‌పోవ‌డంతో దొంగ‌త‌నాల బాట‌ప‌ట్టాడు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు మరిగాడు. హైదరాబాద్, ఖమ్మం, నల్లగొండ, ఆదిలాబాద్‌ జిల్లాల్లో 62 దొంగతనాలు చేశాడు. అనేకసార్లు పోలీసులకు పట్టుబడి జైలు శిక్ష అనుభ‌వించినా తీరు మార్చుకోలేదు. ఫిబ్రవరి 22న ఓ చోరీ కేసులో ఖమ్మం కోర్టుకు హాజరైన వంశీకృష్ణ తిరిగి హైదరాబాద్‌కు ప‌య‌ణ‌మ‌య్యాడు. ఈ క్ర‌మంలో చౌటుప్పల్‌లోని వలిగొండ చౌరస్తా కంఠమహేశ్వర కాలనీలో నివాసముంటున్న లింగంపల్లి నర్సింహ ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో దాచిన రూ.14.20 లక్షల నగదు అప‌హ‌రించాడు.

రాత్రి స‌మ‌యంలో చోరీ జ‌రిగిన‌ట్లు గుర్తించిన పోలీసులు.. ఆ స‌మ‌యంలో కాల‌నీలో, ఇంటి ప‌క్క నుంచి వెళ్లే వాహ‌నాల‌ను గుర్తించి ఒక్కో వాహనదారుడి గురించి వివరాలను ఆరా తీశారు. కారు నంబరు ఆధారంగా హైదరాబాద్‌లో సెల్ఫ్‌ డ్రైవ్‌కు కారు కిరాయికి తీసుకున్న వ్యక్తి చోరీ చేసినట్లు గుర్తించారు. కారు యజమాని ద్వారా అత‌డు శ్యామ్​ రిచర్డ్‌ అని కనిపెట్టారు.

ఈ క్రమంలో బుధ‌వారం ఉద‌యం సెల్ఫ్ డ్రైవ్ కారులో ఖ‌మ్మం కోర్టుకు హాజ‌ర‌య్యేందుకు వంశీకృష్ణ వెళ్తున్నాడు. అదే స‌మ‌యంలో చౌటుప్పల్‌ మండలం ధర్మోజిగూడెం వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వ‌హిస్తున్నారు. అతడి కారును కూడా ఆపారు. అనుమానాస్పదంగా కనిపించడంతో వంశీకృష్ణ అదుపులోకి తీసుకుని త‌మ‌దైన స్టైల్‌లో విచారించారు. దీంతో తానే నేరం చేసిన‌ట్లు అంగీకరించాడు. ఈ నేప‌థ్యంలో అతడి నుంచి రూ.7 లక్షల నగదు, కారు, రెండు సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్, కెమెరా, మూడు ఇనుప‌రాడ్లు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు అకౌంట్‌లో ఉన్న రూ.2.28లక్షల నగదును ఫ్రీజ్‌ చేశారు. చోరీ చేసిన న‌గ‌దుతో గోవాలో క్యాసినోలో ఖ‌ర్చు చేసిన‌ట్లు తెలిపాడు. కాగా, నిందితుడు చోరీ సొమ్ముతో పేద‌ల‌కు దాన‌ధ‌ర్మాలు చేయ‌డం, అనాథల‌ను చేర‌దీయ‌డం కొస‌మెరుపు.

Advertisement
Advertisement