త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Duddilla Sridhar Babu | కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు

Duddilla Sridhar Babu | కుంభమేళా తరహాలోనే రాబోయే గోదావరి పుష్కరాలను నిర్వహించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని, అందుకు అనుగుణంగా వచ్చే ఏప్రిల్ నాటికి పనులు పూర్తయ్యేలా ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసుకుని సమష్టిగా ముందుకెళ్లాలని అధికారులను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశించారు.

S

Telangana | Published On Sep 18, 2026, 7.20 pm IST

Duddilla Sridhar Babu | కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు
Advertisement
  • వచ్చే ఏప్రిల్ నాటికి పనులు పూర్తి కావాల్సిందే
  • గత పుష్కరాల్లో తలెత్తిన సవాళ్లు ఈసారి పునరావృతం కావొద్దు
  • మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలు
  • రోజూ 6740 బస్సులు తిప్పుతాం.. ప్రయాణాలకు ఏ ఇబ్బందీ రానివ్వం
  • మంత్రి పొన్నం ప్రభాకర్

Duddilla Sridhar Babu | త్రినేత్ర.న్యూస్ : కుంభమేళా తరహాలోనే రాబోయే గోదావరి పుష్కరాలను నిర్వహించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని, అందుకు అనుగుణంగా వచ్చే ఏప్రిల్ నాటికి పనులు పూర్తయ్యేలా ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసుకుని సమష్టిగా ముందుకెళ్లాలని అధికారులను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశించారు. గత పుష్కరాల్లో తలెత్తిన సవాళ్లు ఈసారి పునరావృతం కాకుండా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని వారికి దిశా నిర్దేశం చేశారు. శుక్రవారం ఆయన అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్‌లో నిర్వహించిన "గోదావరి పుష్కరాలు - 2027" కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

చివరి వరకు వేచి చూడొద్దు

సమీక్ష అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... పుష్కర ఏర్పాట్లలో సమన్వయ లోపం తలెత్తకుండా జిల్లాలవారీగా ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. రద్దీ అధికంగా ఉండే టైర్-1 ప్రాంతాల్లో అత్యాధునిక సాంకేతికతతో కూడిన కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పుష్కరాలు మొదలయ్యే నాటికి పూర్తయ్యే అవకాశమున్న పనులకే తొలుత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. చివరి వరకూ వేచి చూడకుండా గ్రౌండ్ రియాల్టీకి అనుగుణంగా ప్రతి పనికి ఒక నిర్దేశిత గడువును విధించుకోవాలని ఆదేశించారు. పుష్కరాల సమయంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ముందే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించాలని చెప్పారు. భద్రాచలం వద్ద ఎస్‌టీపీ నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు.

రోజూ 6740 బస్సులు

గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం రోజూ ఆర్టీసీ 6740 రౌండ్ ట్రిప్పుల బస్సులు నడపనున్నది. ఈ మేరకు పుష్కరాల్లో రవాణా సౌకర్యాల కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. రోజుకు సుమారు 4,74,293 మంది భక్తులను బస్సుల ద్వారా తరలించేలా ఏర్పాట్లు ప్రతిపాదించారు.కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి పుష్కర ఘాట్లకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నారు.పుష్కరాల సమయంలో ప్రత్యేక సేవల నిర్వహణ కోసం సుమారు 35 డిపోలను వినియోగించనున్నారు. రద్దీకి అనుగుణంగా ముఖ్యమైన పుష్కర ఘాట్ల వద్ద తాత్కాలిక బస్ టెర్మినల్స్, బస్ పాయింట్లు, ప్రయాణికుల వేచి ఉండే ప్రదేశాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.పొచంపాడు, కందకుర్తి, దోంచండ, తడిబొల్లి, కాళేశ్వరం తదితర ముఖ్య ఘాట్ల వద్ద తాత్కాలిక ఏర్పాట్లు చేయనున్నారు.

Advertisement
Advertisement