త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Uttamkumar Reddy | ముందు తాగునీరు.. తర్వాతే సాగునీరు

Uttamkumar Reddy | రాష్ట్రంలో కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతంలో ఆ నదీ జలాలపై ఆధారపడి ఉన్న 48.58 లక్షల ఎకరాల ఆయకట్టు కు ఆచితూచి నీటిని విడుదల చేస్తామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

S

Telangana | Published On Sep 18, 2026, 6.57 pm IST

Uttamkumar Reddy | ముందు తాగునీరు.. తర్వాతే సాగునీరు
Advertisement
  • మిషన్ భగీరథ అవసరాలు తీరిన తర్వాతే సాగునీరు
  • పంటలకు అవసరమైన చోట లభ్యతను బట్టి వంతుల వారీగా అందిస్తాం
  • కృష్ణ, గోదావరి బేసిన్ లలో కేవలం 241 టీఎంసీలే నిల్వ
  • యాసంగి సాగుకు, తాగు నీటికి ఇప్పటి నుంచే ప్రణాళికలు
  • 44,034 చెరువుల్లో నిండినవి 18 శాతమే
  • బీఆర్ ఎస్ వి తప్పుడు ప్రచారాలు
  • కృష్ణ, గోదావరి హక్కుల్లో వారి కంటే ఎక్కువగా పోరాడుతున్నాం
  • మన వాటాలో ఒక్క చుక్కనూ వదులుకోం
  • ఈసారి ఏపీ కంటే ఎక్కువ నీటినే తీసుకున్నాం
  • ఎల్ నినోపై ప్రత్యేక చర్చలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttamkumar Reddy |  త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతంలో ఆ నదీ జలాలపై ఆధారపడి ఉన్న 48.58 లక్షల ఎకరాల ఆయకట్టు కు ఆచితూచి నీటిని విడుదల చేస్తామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అన్ని రిజర్వాయర్లలో నీటి నిల్వలు అడుగంటి ఉన్నందున ఈ సారి ప్రభుత్వం తాగునీటికే ప్రాధాన్యత ఇస్తున్నదని వెల్లడించారు. మిషన్ భగీరథ అవసరాలు తీరిన తర్వాతే.. నీటి లభ్యత ఆధారంగా అవసరమైన చోట పంటలకు నీటిని విడుదల చేస్తామని తెలిపారు. ఎల్ నినో వల్ల రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో శాసన సభలో శుక్రవారం ప్రత్యేక చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి.. రాష్ట్రంలో ఉన్న నీటి నిల్వలపై సమగ్రంగా సభకు సమాచారాన్ని అందించారు.

గత ఏడాది 497 టీఎంసీలు..ఈ సారి సగమే

సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కృష్ణా, గోదావరి బేసిన్లలో రిజర్వాయర్లలో నీటి నిల్వలు అడుగంటి పోయాయని తెలిపారు. "మొత్తం 585 టీఎంసీల నిల్వ సామార్థ్యానికి గాను గత ఏడాది సెప్టెంబరు 17 నాటికి 497 టీఎంసీలు ఉన్నాయి. ప్రస్తుతం కేవలం 241 టీఎంసీలే ఉన్నాయి. ప్రస్తుతం.. శ్రీశైలం లో 61 టీఎంసీలు, నాగార్జున సాగర్ లో 44 టీఎంసీలు, సింగూరులో 3.5 టీఎంసీలు, లోయర్ మానేరులో 8.95 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 44,034 చెరువుల్లో కేవలం 18 శాతం మాత్రమే నిండాయి" అని ఉత్తమ్ పేర్కొన్నారు.

బీఆర్ ఎస్ వైఫల్యాలకు తోడుగా ఎల్ నినో

బీఆర్ ఎస్ వైఫల్యాలకు తోడుగా ఎల్ నినో కూడా రావడంతో రాష్ట్రం కరువు బారిన పడిందని మంత్రి ఉత్తమ్ విమర్శించారు. " కరువు తీవ్రతకు పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనా వైఫల్యాలతోపాటు ఎల్‌ నినో ప్రభావం కూడా కారణమైంది.ఎల్‌ నినో తీవ్రత దృష్ట్యా వర్షపాతం తగ్గే అవకాశం, సాగునీటి కొరతపై అన్నదాతలను అప్రమత్తం చేశాం. రైతులు నష్టపోకుండా పంటల ఎంపికపై ముందస్తు సూచనలు ఇచ్చాం.ఆయకట్టు వారీగా నీటి లభ్యతపై ఖచ్చితమైన సమాచారం అందిస్తున్నాం.ప్రతి మంగళవారం రైతు నేస్తం ద్వారా జలాశయాల పరిస్థితిని వివరిస్తున్నాం. నీరు సరిపోని చోట పంటలు వేయమని చెప్పడం బాధ్యతారాహిత్యమవుతుంది.
ప్రజల తాగునీటికే ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుంది.తాగునీటి అవసరాలు తీర్చిన తరువాతే మిగులు జలాలను సాగుకు విడుదల చేస్తాంవచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే నీటి నిల్వలను పరిరక్షిస్తున్నాం. జలాశయాల నిల్వలు, కొత్త ప్రవాహాలను పది రోజులకోసారి సమీక్షిస్తాం" అని మంత్రి ఉత్తమ్ చెప్పారు.

కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటాను సాధించి తీరుతామని మంత్రి ఉత్తమ్ పునరుద్ఘాటించారు. తెలంగాణకు రావాల్సిన ఒక్క చుక్క నీటినీ వదులుకోమని చెప్పారు. " కృష్ణా జలాల కోసం ట్రిబ్యునల్‌, కేఆర్‌ఎంబీ, కేంద్రం వద్ద బలంగా వాదిస్తున్నాం.బీఆర్ ఎస్ నేతలు మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కృష్ణా జలాల్లో 66:34 తాత్కాలిక నిష్పత్తిని శాశ్వత హక్కుగా అంగీకరించలేదు.కృష్ణా జలాల్లో 50:50 పంపిణీ కోసం తెలంగాణ పట్టుబట్టాం. కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే గోదావరిలో ఎన్నడూ లేని విధంగా 2025 -26 లో 340 టీఎంసీలు వాడుకున్నాం. అలాగే 2024-25లో అత్యధికంగా కృష్ణ బేసిన్ లో 286 టీఎంసీలు వినియోగించాం. ఇదొక రికార్డు. ఈ ఏడాది .. శ్రీశైలం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ కన్నా ఎక్కవ నీళ్లే తీసుకున్నాం. జూన్ 1 నుంచి..సెప్టెంబర్ 17 వరకు ఆంధ్రప్రదేశ్ 52 టీఎంసీలు తీసుకుంటే తెలంగాణ 84 టీఎంసీలను తీసుకున్నది.

నాగార్జున సాగర్ నుంచి ఏపీ 17.2 టీఎంసీలు వాడుకుంటే తెలంగాణ 23.67 టీఎంసీలు వినియోగించుకున్నది. ఏ రకంగా చూసుకున్నా నీళ్ల విషయంలో బీఆర్ ఎస్ కంటే ఎక్కువగానే పోరాడుతున్నాం. ప్రజల ప్రాణభద్రతను పణంగా పెట్టి కాళేశ్వరం బ్యారేజీలను వినియోగించలేంచిన్న మరమ్మతుతోనే కాళేశ్వరాన్ని నడపవచ్చన్న బీఆర్‌ఎస్‌ వాదన సాంకేతికంగా తప్పు. ఎన్‌డీఎస్‌ఏ, సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారమే బ్యారేజీల పునరుద్ధరణ చేపడతాం. కాళేశ్వరం ప్రాజెక్టులో సురక్షితంగా ఉన్న లింక్‌–2 ద్వారా పంపింగ్‌ కొనసాగిస్తున్నాం. అలాగే పాలమూరు–రంగారెడ్డి పథకం 90 శాతం పూర్తయిందన్న బీఆర్‌ఎస్‌ ప్రచారం అవాస్తవం.కేవలం పంప్‌హౌస్‌లు నిర్మిస్తే ఎత్తిపోతల పథకం పూర్తయినట్లు కాదు.పాలమూరు–రంగారెడ్డిలో కాలువలు, పంపిణీ వ్యవస్థ, భూసేకరణ, పునరావాస పనులు అసంపూర్తిగా ఉన్నాయి" అని మంత్రి ఉత్తమ్ చెప్పారు.

Advertisement
Advertisement