త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | హైద‌రాబాద్ అభివృద్ధికి ల‌క్ష కోట్లివ్వండి: సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy | విద్య, వైద్యమే దేశ అభివృద్ధికి బలమైన పునాది అని తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైద‌రాబాద్ అభివృద్ధికి రూ.ల‌క్ష కోట్లు ఇవ్వాల‌ని కోరారు.

S

Telangana | Published On Jun 11, 2026, 6.42 pm IST

Revanth Reddy | హైద‌రాబాద్ అభివృద్ధికి ల‌క్ష కోట్లివ్వండి: సీఎం రేవంత్ రెడ్డి
Advertisement
  • దేశ అభివృద్ధికి విద్య, వైద్యమే బలమైన పునాది
  • 2034 నాటికి తెలంగాణను ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా నిల‌బెడ‌తాం
  • ప్రతి నియోజ‌క‌వ‌ర్గానికో యంగ్ ఇండియా స్కూల్ నిర్మిస్తాం
  • తెలంగాణ‌కు ఎవ‌రొచ్చినా ఈ స్కూళ్ల‌ను సంతోషంగా చూపిస్తాం
  • నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వెల్ల‌డి

Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: విద్య, వైద్యమే దేశ అభివృద్ధికి బలమైన పునాది అని తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కులగ‌ణ‌న త‌ర్వాత తెలంగాణ అభివృద్ధి నమూనాను ఆయ‌న వివ‌రించారు. హైద‌రాబాద్ అభివృద్ధికి రూ.ల‌క్ష కోట్లు ఇవ్వాల‌ని కోరారు. విద్యా విప్లవం, నైపుణ్యాభివృద్ధి, ప్రపంచ స్థాయి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి అవ‌స‌ర‌మ‌ని వివ‌రించారు. వికసిత్ భారత్-2047 లక్ష్యాన్ని సాధించాలంటే దేశంలోని ప్రతి విద్యార్థికి, పౌరుడికి నాణ్యమైన విద్య, మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండాలని చెప్పారు. గురువారం రాష్ట్రపతి భవన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన నిర్వ‌హించిన‌ 11వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో సీఎం రేవంత్ పాల్గొని ప్ర‌సంగించారు.

దేశ ఆర్థికాభివృద్ధికి ప్రధాన ఇంజిన్లుగా ఉన్న ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నగరాల అభివృద్ధి కోసం ప్రధానమంత్రి కార్యాలయం ఆధ్వర్యంలో ‘ఎం-6 టాస్క్‌ఫోర్స్’ ఏర్పాటు చేయాలని సీఎం ప్రతిపాదించారు. ఈ నగరాల అభివృద్ధి కోసం రూ.6 లక్షల కోట్ల ప్రత్యేక నిధిని కేటాయించాలని కోరారు. ఒక్కో నగరానికి రూ. ల‌క్ష కోట్ల‌ చొప్పున మౌలిక వసతుల అభివృద్ధికి అందించాలని విజ్ఞప్తి చేశారు. రీజినల్ రింగ్ రోడ్, హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ, మూసీ నది పునరుజ్జీవనం, భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతులు, సెమీ కండక్టర్ పరిశ్రమల ఏర్పాటుకు మద్దతు, హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు వంటి అంశాల్లో సహకారం అందించాలని కోరారు. దేశ ప్రజల ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక దృష్టి పెడితే ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా భారత్ అవతరిస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్ర‌తి పౌరుడికి నాణ్య‌మైన విద్య‌..

తెలంగాణలో ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికొక యంగ్ ఇండియా స్కూల్ నిర్మిస్తాం. దేశ అభివృద్ధి అంటే ప్రజల అభివృద్ధే. ప్రజలను ఆర్థిక శక్తులుగా, దేశ నిర్మాతలుగా తీర్చిదిద్దడంలో విద్య, ఆరోగ్యం కీలక పాత్ర పోషిస్తాయి. తెలంగాణ ప్రభుత్వం 2024లో నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే (SEEEPC)లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 3.55 కోట్ల మంది, 242 కులాలకు చెందిన ప్రజల వివరాలను సేకరించిన ఈ సర్వేలో పైస‌లు, భూమి కంటే విద్యే సామాజిక వెనుకబాటుతనాన్ని ప్రభావితం చేస్తున్న ముఖ్యమైన అంశంగా తేలింది. అందుకే ప్రతి పౌరుడికి నాణ్యమైన విద్య అందించడం ద్వారానే వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించవచ్చు అని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

తెలంగాణలో విద్యా-నైపుణ్యాభివృద్ధి విప్లవం..

విద్యపై నాకున్న‌ నమ్మకంతోనే ఆ శాఖ‌ను నా వ‌ద్దే పెట్టుకున్నాన‌ని సీఎం రేవంత్ రెడ్డి నొక్కి చెప్పారు. గడచిన 75 ఏండ్లుగా నాణ్యమైన విద్యను అందించడం సవాలుగా మారిందన్నారు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టిందన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ తరగతులు, ఉచిత అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్, పాఠశాల బస్సులు, క్రీడా సౌకర్యాలు, నాణ్యమైన బోధన అందిస్తున్నామని తెలిపారు. నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే క్యాంపస్‌లో చదివే అవకాశం కల్పిస్తున్నామని వివరించారు.

కులాల మ‌ధ్య గోడలు కూల్చేస్తాయి..

ప్ర‌భుత్వం నిర్మించే యంగ్ ఇండియా స్కూల్స్ కులాల మధ్య గోడలు కూల్చివేస్తాయ‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు. సమాజంలో సమానత్వం పెంపొందించేందుకు ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. అన్ని వర్గాల పిల్లలు కలిసి చదువుకోవడం, కలిసి జీవిస్తే కుల వివక్ష తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో యంగ్ ఇండియా స్కూల్ నిర్మిస్తున్నామ‌న్నారు. దేశంలో ఎవ‌రైనా తెలంగాణ‌లోని యంగ్ ఇండియా స్కూల్స్ చూడాలంటే తాము సంతోషంగా చూపిస్తామని చెప్పారు.

కృత్రిమ మేధస్సు (ఏఐ) యుగంలో యువతకు కొత్త నైపుణ్యాలు అవసరమని సీఎం చెప్పారు. తయారీ రంగం, సేవారంగాల్లో భారీ ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు రీజినల్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రైల్వే, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. యువతకు ప్రపంచ స్థాయి శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆనంద్ మహీంద్రా, శ్రీనిరాజు వంటి కార్పొరేట్ దిగ్గజాలు ఈ యూనివర్సిటీ నిర్వహణలో భాగస్వాములుగా ఉన్నారని వివరించారు.

మూడు ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక శ‌క్తిగా తీర్చిదిద్దుతాం..

రాష్ట్రంలోని అన్ని ఐటీఐలను ఆధునిక సాంకేతిక శిక్షణ కేంద్రాలుగా మార్చేందుకు టాటా గ్రూప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని రేవంత్ వెల్ల‌డించారు. ఈ ప్రాజెక్టులో టాటా సంస్థ రూ.2,100 కోట్ల పెట్టుబడి పెడుతుంద‌న్నారు. ‘తెలంగాణ రైజింగ్’ విజన్‌లో భాగంగా 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చెప్పారు. ఉన్నత విద్య, పరిశోధనలు, ఆవిష్కరణలు, స్టార్టప్‌ల అభివృద్ధికి తెలంగాణ కేంద్రంగా మారుతోందన్నారు. ఇప్పటికే ఐఐటీ, ఐఐఐటీ, నల్సార్, ఐఎస్‌బీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు ఉన్నాయని, హైదరాబాద్‌కు ఐఐఎం కూడా రావాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలను తెలంగాణకు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ దిశగా యూనివర్సిటీ ఆఫ్ లండన్ హైదరాబాద్‌లో ఆఫ్‌షోర్ క్యాంపస్ ఏర్పాటు చేయడం తొలి విజయమని పేర్కొన్నారు.

Advertisement
Advertisement