త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Fuel Demand | తెలంగాణ పెరిగిన పెట్రోల్‌, డీజిల్ విక్ర‌యాలు..!

P

Telangana | Published On May 25, 2026, 8.30 pm IST

Fuel Demand | తెలంగాణ పెరిగిన పెట్రోల్‌, డీజిల్ విక్ర‌యాలు..!
Advertisement

Fuel Demand | తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. మే నెలలో డీజిల్ విక్రయాలు 12.6 శాతం, పెట్రోల్ విక్రయాలు 9 శాతం వృద్ధిని నమోదు చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా 37 లక్షలకు పైగా గృహ ఎల్‌పీజీ సిలిండర్లు పంపిణీ చేసినట్లు చమురు మార్కెటింగ్ సంస్థలు తెలిపాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లు రాష్ట్రవ్యాప్తంగా ఇంధన సరఫరా నిరంతరంగా కొనసాగేందుకు రాత్రింబవళ్లు సమన్వయం చేసుకుంటున్నాయి. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా రవాణా, నిల్వల వ్యవస్థలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయి.

ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లు జోరుగా సాగుతుండటం, వ్యవసాయ పనులు ఊపందుకోవడంతో ఇంధన అవసరాలు పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రైవేట్ బంకుల కంటే ప్రభుత్వ రంగ పెట్రోల్ బంకుల్లో ధరల ప్రయోజనం ఉండటంతో వినియోగదారులు ఎక్కువగా వాటివైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో సంస్థాగత, వాణిజ్య వినియోగం కూడా పెరిగినట్లు సమాచారం. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో ప్రభుత్వ రంగ పెట్రోల్ బంకుల్లో డీజిల్ అమ్మకాలు 25 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేయగా, 12 జిల్లాల్లో 15 నుంచి 25 శాతం మధ్య వృద్ధి నమోదైంది. మొత్తం మీద 2026 మే నెలలో డీజిల్ (రిటైల్) విక్రయాలు 12.6 శాతం, పెట్రోల్ (రిటైల్) విక్రయాలు 9 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఎల్‌పీజీ పంపిణీ కూడా భారీగా కొనసాగుతోంది. మే నెలలో రాష్ట్రవ్యాప్తంగా 37 లక్షలకు పైగా గృహ వినియోగ సిలిండర్లు వినియోగదారులకు అందించినట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో నిల్వల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, సరఫరా వ్యవస్థలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. కేంద్ర పెట్రోలియం శాఖ, రాష్ట్ర యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ నిరంతర సరఫరా కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇంధన లభ్యతపై వినియోగదారులు కేవలం అధీకృత చమురు మార్కెటింగ్ సంస్థల అధికారిక సమాచారాన్నే నమ్మాలని సూచించారు.

Advertisement
Advertisement