త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Niranjan Reddy | కరంటుతో పెట్టుకుని కాంగ్రెస్‌ నాశనం అవుతుంది.. మాజీ మంత్రి నిరంజ‌న్‌రెడ్డి

Niranjan Reddy | రైతు డిస్కంపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటుపరం చేసే కుట్రలో భాగంగానే ప్రభుత్వం కొత్త డిస్కం ఏర్పాటు దిశగా ముందుకెళ్తోందని ఆరోపించారు. ప్రజాభిప్రాయం, అసెంబ్లీ చర్చ లేకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం తగదన్నారు.

P

Telangana | Published On May 24, 2026, 9.04 pm IST

Niranjan Reddy | కరంటుతో పెట్టుకుని కాంగ్రెస్‌ నాశనం అవుతుంది.. మాజీ మంత్రి నిరంజ‌న్‌రెడ్డి
Advertisement

Niranjan Reddy | రైతు డిస్కంపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటుపరం చేసే కుట్రలో భాగంగానే ప్రభుత్వం కొత్త డిస్కం ఏర్పాటు దిశగా ముందుకెళ్తోందని ఆరోపించారు. ప్రజాభిప్రాయం, అసెంబ్లీ చర్చ లేకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం తగదన్నారు. “నాడు కరంటుతో పెట్టుకున్న టీడీపీ ప్రభుత్వం ఓడిపోయింది. నేడు కాంగ్రెస్‌ కూడా అదే కరంటుతో పెట్టుకుని నాశనం అవుతుంది” అని వ్యాఖ్యానించారు. విద్యుత్‌ అనేది సేవారంగమని, ఇది అత్యంత కీలకమైన సర్వీస్‌ ఓరియెంటెడ్‌ వ్యవస్థ అని చెప్పారు. బీఆర్ఎస్‌ హయాంలో జరిగిన అభివృద్ధికి విద్యుత్‌ రంగమే మూలాధారమని పేర్కొన్నారు. “విద్యుత్‌ లేకపోతే వ్యవసాయ రంగమే ఉండదు” అన్నారు.

గతంలో కేంద్రం స్మార్ట్‌ మీటర్లు పెట్టాలని ఆదేశించినప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసి వ్యతిరేకించామని గుర్తు చేశారు. రైతులపై భారం మోపొద్దని అప్పుడే స్పష్టం చేశామన్నారు. రైతు డిస్కంను వ్యతిరేకిస్తూ ఈఆర్సీ ఎదుట తమ అభిప్రాయాలు వెల్లడిస్తామని తెలిపారు. ఈ అంశం ఇంకా ఈఆర్సి పరిధిలో ఉండగానే జూన్‌ 2 నుంచి కొత్త డిస్కం పనిచేస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించడం విడ్డూరమన్నారు. ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తూ, వాటి పేరుతో ప్రైవేటుపరం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. విద్యుత్‌ రంగంలో అనేక కోట్ల రూపాయల పెట్టుబడులు ఉన్నాయని, వాటిని కాపాడకుండా అప్పులతో కొత్త డిస్కం ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేయడం సహేతుకం కాదన్నారు.

ఎవరికి మేలు జరుగుతుందో చెప్పకుండా, విస్తృత చర్చ జరపకుండా నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలని, అసెంబ్లీ సమావేశపరచి చర్చ జరపాలని డిమాండ్‌ చేశారు. “జూన్‌ 2న ప్రారంభిస్తామని చెబుతున్నారు.. ఎందుకు అంత తొందర?” అని ప్రశ్నించారు. గత ప్రభుత్వాన్ని విమర్శించడం కంటే సమస్యలు, పరిష్కారాలపై మాట్లాడాలని సూచించారు. 2014లో రాష్ట్రంలో 400 కేవీ సబ్‌స్టేషన్లు ఆరు మాత్రమే ఉండగా, బీఆర్ఎస్‌ ప్రభుత్వం వాటిని 30కి పెంచిందన్నారు. విద్యుత్‌ శాఖను బలోపేతం చేసి నిరంతర విద్యుత్‌ అందించామని తెలిపారు. బీఆర్ఎస్‌ హయాంలో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేశామని, వాటిపై అయిన ఖర్చును అప్పుగా కాకుండా మూలధన పెట్టుబడిగా చూడాలన్నారు.

ఉన్న సమస్యలను పరిష్కరించకుండా కొత్త డిస్కం ఏర్పాటు చేస్తే ప్రయోజనం లేదన్నారు. అధిక ఖర్చుతో కూడుకున్న థర్మల్‌ విద్యుత్తును రైతు డిస్కంకు కేటాయించడం మూర్ఖపు ఆలోచనగా అభివర్ణించారు. విద్యుత్‌ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కనిపిస్తున్నాయన్నారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే రాష్ట్రంలో మరో బషీర్‌బాగ్‌ ఘటనలాంటి పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రైతు డిస్కంను ఈఆర్సి వెంటనే తిరస్కరించాలని, పూర్తి వివరాలు లేకుండా ముందుకెళ్లొద్దని డిమాండ్‌ చేశారు. ప్రజాభిప్రాయం, ఆమోదం లేని రైతు డిస్కం ఏర్పాటు కాకుండా చూడాలని కోరారు.

Advertisement
Advertisement