త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Upper Manair | ఎగువ మానేరుకు చేరుతున్న వరద.. ప‌రిశీలించిన కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌

Upper Manair | ఇటీవల కురుస్తున్న వర్షాలతో ఎగువ మానేరు ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రాజెక్టులోకి మరింత వరద చేరే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు.

P

Telangana | Published On Aug 5, 2026, 8.10 pm IST

Upper Manair | ఎగువ మానేరుకు చేరుతున్న వరద.. ప‌రిశీలించిన కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌
Advertisement

Upper Manair | ఇటీవల కురుస్తున్న వర్షాలతో ఎగువ మానేరు ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రాజెక్టులోకి మరింత వరద చేరే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు. గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్టును బుధవారం కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌, ఎస్పీ మహేశ్ బీ గితె, నీటి పారుదల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం, ప్రస్తుతం ఉన్న నీటి నిల్వ, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహం తదితర అంశాలపై నీటి పారుదల శాఖ అధికారులను కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు.

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 2 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1.6 టీఎంసీల నీరు ఉందని నీటి పారుదల శాఖ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ప్రస్తుతం కూడవెల్లి, పాల్వంచ వాగుల నుంచి ఎగువ మానేరు ప్రాజెక్టులోకి ఎలాంటి ఇన్‌ఫ్లో లేదని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మాట్లాడుతూ.. ఎగువ మానేరు ప్రాజెక్టులోకి వరద నీరు చేరి పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకునే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో నీటి పారుదల శాఖ, రెవెన్యూ, పోలీస్‌ శాఖల అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాజెక్టు నీటిమట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలని, ప్రాజెక్టు పరిధిలోని గ్రామాల రైతులు, ప్రజలకు పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. వరద పరిస్థితిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.

ప్రాజెక్టు మత్తడి పారే పరిస్థితి ఏర్పడితే ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. పోలీస్‌, రెవెన్యూ అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నియంత్రించాలని సూచించారు. ప్రజల భద్రతకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. కలెక్టర్‌ పర్యటనలో సిరిసిల్ల ఆర్డీఓ శ్రీధర్‌బాబు, జిల్లా నీటి పారుదల శాఖ అధికారులు దయాకర్‌, ప్రశాంత్‌, తహసీల్దార్‌ మారుతి, సర్పంచ్‌ అర్చన ఉన్నారు.

Advertisement
Advertisement