త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramchandar Rao | ముందు ప‌రిహారం ఇవ్వు.. త‌ర్వాతే పండ్ల మార్కెట్ పెట్టు

Ramchandar Rao | ముందు రైతుల‌కు ప‌రిహారం ఇచ్చాకే కోహెడ‌లో పండ్ల మార్కెట్ ఏర్పాటు చేయాల‌ని బీజేపీ చీఫ్ రాంచంద‌ర్‌రావు డిమాండ్ చేశారు. మా కార్య‌క‌ర్త‌లు తలుచుకుంటే మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు గ్రామాల్లో తిర‌గ‌నివ్వ‌ర‌ని హెచ్చ‌రించారు.

S

Telangana | Published On Jun 7, 2026, 1.45 pm IST

Ramchandar Rao | ముందు ప‌రిహారం ఇవ్వు.. త‌ర్వాతే పండ్ల మార్కెట్ పెట్టు
Advertisement
  • రైతుల భూములు బ‌ల‌వంతంగా లాక్కొని అన్యాయం చేస్తున్న‌రు
  • రేవంత్.. నీ భాష‌ను అదుపులో పెట్టుకో
  • లేదంటే ఊర్ల‌ల్లో తిర‌గ‌నివ్వం
  • తెలంగాణ‌ను తెచ్చింది బీజేపీయే
  • మీ అవినీతిని ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్న‌రు
  • రేపు మా ప్ర‌భుత్వం వ‌చ్చాక ఎంక్వ‌యిరీలు వేయిస్తం
  • మీడియా స‌మావేశంలో బీజేపీ చీఫ్ రాంచంద‌ర్‌రావు హెచ్చ‌రిక‌

Ramchandar Rao | త్రినేత్ర‌.న్యూస్: ముందు రైతుల‌కు ప‌రిహారం ఇచ్చాకే కోహెడ‌లో పండ్ల మార్కెట్ ఏర్పాటు చేయాల‌ని బీజేపీ చీఫ్ రాంచంద‌ర్‌రావు డిమాండ్ చేశారు. ప‌రిహారం ఇవ్వ‌కుండా సీఎం రేవంత్ ఎలా శంకుస్థాప‌న చేస్తామ‌ర‌ని మండిప‌డ్డారు. నాంప‌ల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాల‌యంలో ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ రేవంత్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. మా కార్య‌క‌ర్త‌లు తలుచుకుంటే మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు గ్రామాల్లో తిర‌గ‌నివ్వ‌ర‌ని హెచ్చ‌రించారు.

అప్ప‌టి వ‌ర‌కు పెట్టొద్దు..

స‌ర్వే నంబ‌ర్ 167/1లో 239 ఎక‌రాలు ఫ్రూట్ మార్కెట్‌కు నిన్న రేవంత్‌రెడ్డి ప్రారంభోత్స‌వం చేశారు. అది రైతుల‌కు చెందిన భూమి. ఈ భూమిని సేక‌రించి రైతుల‌కు ఒక్క‌రూపాయి కూడా న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వ‌లేదు. బ‌ల‌వంతంగా భూములు గుంజుకుని ఆ ప్రాంత రైతుల‌కు అన్యాయం చేస్తున్న‌రు. ఈ పండ్ల మార్కెట్‌ను మొద‌టి నుంచి రైతులు వ్య‌తిరేకించారు. రేవంత్ రాక‌ సంద‌ర్భంగా రైతులంద‌రినీ అరెస్టు చేశారు. ఆయ‌న తిరిగి వెళ్లాక వ‌దిలిపెట్టారు. మీ పాల‌న‌లో ప‌రిహారం ఇవ్వ‌కుండా భూమి ఎలా తీసుకుంటారు. రైతుల మీద కొంచెం కూడా సానుభూతి లేదా? రైతుల‌కు ప‌రిహారం ఇచ్చాకే పండ్ల మార్కెట్ పెట్టాలే. అప్ప‌టివ‌ర‌కు పెట్ట‌డానికి వీల్లేదు. ఇదే మా డిమాండ్ అని బీజేపీ చీఫ్ పేర్కొన్నారు.

గ‌త ప్ర‌భుత్వం అదే చేసింది..

రైతుల‌తో పాటు మా నాయ‌కులు కూడా అక్క‌డికి వెళ్లి ధర్నాలు చేస్తున్న‌రు. రైతులు వ్య‌తిరేకిస్తున్నా మీరు లెక్క‌చేయ‌డం లేదు. వీళ్లు ఏం చేస్త‌ర‌నే క‌దా మీ ఉద్దేశం. తుపాకీ పెట్టి పేల్చేద్దాం.. బేడీలు వేసేద్దం అనుకుంటున్న‌రు. గ‌త ప్ర‌భుత్వం అదే చేసింది. ఇది పోలీసుల పాల‌నా? నిజాంల పాల‌నా? పండ్ల మార్కెట్ పెట్టుకోండి.. కానీ ప‌రిహారం ఇవ్వాల్సిందే అని ఆయ‌న నిల‌దీశారు.

గ్రామాల స‌రిహ‌ద్దులు కూడా దాట‌రు..

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కిష‌న్‌రెడ్డిని ఈ పొలిమెర దాట‌నివ్వ‌న‌ని అన్నారు. బండి సంజ‌య్‌ను కూడా అన్నారు. మా నాయ‌కుల మీద ఇటువంటి భాష మాట్లాడితే బాగుండ‌దు. మా కార్య‌క‌ర్త‌లు త‌లుచుకుంటే మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల‌ను వాళ్ల వాళ్ల ప్రాంతాల్లో తిర‌గ‌కుండా చేస్తం. మీరు గ్రామాల స‌రిహ‌ద్దులు కూడా దాట‌లేరు అని హెచ్చ‌రించారు.

ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌ట్టించుకుంట‌లేరు. ధాన్యం కొంట‌లేరు. ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ ఇవ్వ‌డం లేదు. ఇవ‌న్నీ పొర‌పాట్లు మీరు చేసుకుంటా కేంద్రం ఏమిచ్చింది అని అడ‌గ‌డం ఏంటి. తెలంగాణ‌ను బీజేపీ తెచ్చింది. మీరెవ‌రు మ‌మ్మ‌ల్ని ఆప‌డానికి? త‌లుచుకుంటూ మేమే మిమ్మ‌ల్ని త‌రిమి కొడ‌తాం. మీరు చేస్తున్న అవినీతి, క‌మీష‌న్లు బాగోతాన్ని ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్న‌రు. రెండు పార్టీల‌ను కూడా ప్ర‌జ‌లు సాగ‌దోలుత‌రు. రేపు వ‌చ్చేది బీజేపీ ప్ర‌భుత్వ‌మే. మేం రాగానే మీ అంద‌రి మీద ఎంక్వ‌యిరీలు పెట్టిస్తం.

12 జాతీయ ర‌హ‌దారులు ఇచ్చాం..

మొన్న‌నే జ‌గిత్యాల నుంచి రూ.8 వేల కోట్లతోని కేంద్ర ప్ర‌భుత్వం జాతీయ ర‌హ‌దారుల‌ను ఇచ్చింది. 12 జాతీయ ర‌హ‌దారులు తీసుకొచ్చి అన్ని జిల్లాల‌కు అనుసంధానం చేసింది కేంద్రం కాదా? బీబీన‌గ‌ర్‌లో ఎయిమ్స్ తీసుకొచ్చాం. కాజీపేట‌లో కోచ్ ఫ్యాక్ట‌రీ, వరంగ‌ల్‌లో టెక్స్‌టైల్ పార్క్‌, జ‌హీరాబాద్‌లో ఇండ‌స్ట్రీయ‌ల్ పార్కు, శంషాబాద్ చుట్టూ ఉన్న ఏరోస్పేస్ ఇండ‌స్ట్రీస్ ఇవ‌న్నీ తీసుకొచ్చింది కేంద్ర ప్ర‌భుత్వం కాదా అని రాంచంద‌ర్‌రావు నిల‌దీశారు.

ఇప్ప‌టి వ‌ర‌కు రూ.13 ల‌క్ష‌ల కోట్లు ఇచ్చాం..

కేంద్ర ప్ర‌భుత్వం ఇస్తుంది.. ఇస్తూనే ఉంటుంది. తెలంగాణ‌ ఏర్ప‌డ్డ రోజు నుంచి 13 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వం ఇచ్చింది. కావాలంటే శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయండి. ఎక్క‌డైనా స‌రే చ‌ర్చ‌కు సిద్ధ‌మే. టైం పెట్టుకుందాం. మీ ప్ర‌భుత్వం వ‌చ్చాక న‌ల్లగొండ‌, ఖ‌మ్మం జిల్లాల‌కు ఏమిచ్చార‌ని అడుగుతున్నా. మీ సొంత జిల్లాకు వాగ్దానాలు త‌ప్పా ఏమిచ్చార‌ని అడుగుతున్నా. ఉమ్మ‌డి ఆదిలాబాద్‌, ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాల‌కు ఏమిచ్చారు. చివ‌రికి మ‌జ్లిస్ చెప్తే హైద‌రాబాద్‌ను మూడు ముక్క‌లు చేశారు. ఈ మూడు ముక్క‌లకు ఏమిచ్చారు. ఇది నిజాం ప‌రిపాల‌న కాదు.. ర‌జాకార్ల ప‌రిపాల‌న కాదు. తెలంగాణ ప్ర‌జ‌లు ర‌జాకార్ల‌తో ఎట్ల కొట్లాడారో రేపు ప్ర‌జ‌లు కాంగ్రెస్‌తోని అట్లానే కొట్లాడుత‌రు. మ‌రోసారి చెబుతున్నా భాష‌ను అదుపులో పెట్టుకోండి అని రాంచంద‌ర్‌రావు హెచ్చరించారు.

Advertisement
Advertisement