త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kolly Kishore Babu | రేవంత్ గారూ.. వ్య‌వ‌సాయం మానేయాల్సి వ‌స్త‌దేమో.. ఓ రైతు లేఖ ఇదీ..

Kolly Kishore Babu | ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడూ బాగుపడలేదు అని ప్ర‌స్తుతం సీఎం రేవంత్ స‌ర్కార్‌పై ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని అయిన ఓ సాధార‌ణ రైతు కూడా.. ప్ర‌తిప‌క్ష నేత‌ల మాదిరిగానే స్పందించాడు.

S

Telangana | Published On Apr 20, 2026, 4.43 pm IST

Kolly Kishore Babu | రేవంత్ గారూ.. వ్య‌వ‌సాయం మానేయాల్సి వ‌స్త‌దేమో.. ఓ రైతు లేఖ ఇదీ..

సంక్షిప్త సారాంశం

ఆయ‌నో సాధార‌ణ రైతు.. కాంగ్రెస్ ప‌థ‌కాల‌కు ఆక‌ర్షితుడై.. రేవంత్ సీఎం కావాల‌ని బ‌లంగా కోరుకున్నారు. కానీ రేవంత్ సీఎం అయ్యాక రైతుల ప‌రిస్థితి త‌ల‌కిందులైంది. విద్యుత్ కోత‌లు, లో వోల్టేజీ స‌మ‌స్య‌లు నిత్య‌కృత్య‌మ‌య్యాయి. ఈ స‌మ‌స్య‌ల‌పై స్థానిక ట్రాన్స్‌కో అధికారుల‌కు డజ‌న్ల కొద్ది ఫిర్యాదులు చేసినా స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ల‌భించ‌లేదు. చివ‌ర‌కు సీఎం రేవంత్ రెడ్డికే ఈమెయిల్ ద్వారా లేఖ రాస్తూ.. విద్యుత్ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కారించాల‌ని కోరారు.

Advertisement

Kolly Kishore Babu | త్రినేత్ర‌.న్యూస్ : ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడూ బాగుపడలేదు అని ప్ర‌స్తుతం సీఎం రేవంత్ స‌ర్కార్‌పై ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని అయిన ఓ సాధార‌ణ రైతు కూడా.. ప్ర‌తిప‌క్ష నేత‌ల మాదిరిగానే స్పందించాడు. రైతులు ఎదుర్కొంటున్న స‌మ‌స్యలు, విద్యుత్ కోత‌ల‌పై సీఎం రేవంత్ రెడ్డికి సాధార‌ణ రైతు కొల్లి కిశోర్ బాబు(76) లేఖ రాశారు.

కిశోర్ బాబు.. 15 ఏండ్ల క్రితం బీహెచ్ఈఎల్ ఉద్యోగిగా ప‌ద‌వీ విర‌మ‌ణ పొందారు. వ్య‌వ‌సాయంపై ఉన్న మ‌క్కువ‌తో సంగారెడ్డి జిల్లా ఝ‌రాసంగం మండ‌ల ప‌రిధిలోని ఏదుల‌ప‌ల్లి గ్రామంలో 8 ఎక‌రాల భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమిలో ఆపిల్, ఖ‌ర్జూరం, డ్రాగ‌న్ ఫ్రూట్‌తో పాటు మామిడి, ఇత‌ర పంట‌ల‌ను సాగు చేస్తున్నారు. గ‌త కొద్ది నెల‌ల నుంచి త‌రచుగా విద్యుత్ కోత‌లు ఏర్ప‌డుతుండ‌డంతో.. ఏ పంట‌ను కూడా సంపూర్ణంగా పండించ‌లేక‌పోతున్నారు. నీటిని పారించేందుకు కూడా ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. విద్యుత్ కోత‌లు, లో వోల్టేజీ స‌మ‌స్య‌పై విద్యుత్ అధికారుల‌కు డ‌జ‌న్ల కొద్ది మెయిల్స్ పంపిన‌ప్ప‌టికీ ఇప్ప‌టికీ ఎలాంటి చ‌ర్యలు తీసుకోలేద‌న్నారు. స్థానిక ట్రాన్స్‌కో అధికారులపై విసుగు చెందిన కిశోర్ బాబు.. నాణ్యమైన విద్యుత్ అందించడంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాశారు.

ఈ మెయిల్ ద్వారా పంపిన లేఖ సారాంశం ఇదే..

మీరు(రేవంత్ రెడ్డి) ముఖ్య‌మంత్రి కావాల‌ని బ‌లంగా కోరుకున్న వ్య‌క్తుల్లో నేను ఒక‌రిని. కానీ ఇప్పుడు విద్యుత్ కోత‌లు తీవ్ర ఆందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను చూస్తుంటే, ఈ స‌మ‌స్య‌లు ఇలాగే కొన‌సాగితే వ్య‌వ‌సాయం మానేయాల్సి వ‌స్త‌దేమో. విద్యుత్ కోత‌ల‌తో పాటు వోల్టేజ్‌లో హెచ్చుత‌గ్గుల కార‌ణంగా బోర్ మోటార్ 18 నెల‌ల్లో దాదాపు ఆరుసార్లు కాలిపోయింది. దీన్ని మ‌ర‌మ్మ‌తు చేసేందుకు సుమారు రూ. 40 వేల వ‌ర‌కు ఖ‌ర్చు చేయాల్సి వ‌చ్చింది. ఇది మ‌రింత ఆందోళ‌న క‌లిగించే విష‌యం. విద్యుత్ స‌ర‌ఫ‌రాలో లో వోల్టేజ్ విద్యుత్ కార‌ణంగానే మోటారు ప‌దేప‌దే కాలిపోయింది.

విద్యుత్ కోత‌లే కాదు.. నా వ్య‌వ‌సాయ క్షేత్రంలోని ఓవ‌ర్ హెడ్ లైన్లు కేవ‌లం ఆరు అడుగుల ఎత్తులో వేలాడుతున్నాయి. విద్యుత్ తీగ‌ల‌కు మ‌ర‌మ్మ‌తులు చేయాల‌ని స్థానిక ఏఈ(ట్రాన్స్‌కో) స‌ర‌ళ‌కు ప‌దేప‌దే విజ్ఞ‌ప్తి చేసిన‌ప్ప‌టికీ.. ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదు అని కిశోర్ బాబు లేఖ‌లో పేర్కొన్నారు.

రైతుల భద్రత దృష్ట్యా, కిందకు వేలాడుతున్న ఓవర్‌హెడ్ విద్యుత్ లైన్లను తొలగించాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించాల్సిందిగా ఆయన రేవంత్‌ను కోరారు. ఇది కేవలం తన ఒక్కడి స‌మ‌స్య‌ మాత్రమే కాదని పేర్కొంటూ, ఆ ప్రాంతంలోని ప్రతి రైతు కూడా ఇదే విధంగా సతమతమవుతున్నాడని కిశోర్ బాబు స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement