Ex MLC Kavitha | కాసు బ్రహ్మానంద రెడ్డి ఆనవాళ్లు ఇంకా ఉండటం బాధాకరం : మాజీ ఎమ్మెల్సీ కవిత
Ex MLC Kavitha | ప్రాణ త్యాగాల పునాదుల మీద వెలిసిన తెలంగాణలో.. 369 మంది బిడ్డలను పొట్టనబెట్టుకున్న కాసు బ్రహ్మానందరెడ్డి ఆనవాళ్లు ఇంకా ఉండటం బాధాకరమని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.
ఇక్కడ కలుసుకోవడం సిగ్గుగా ఉంది..
ఆ గుర్తులు ఇంకా ఉండడం బాధగా ఉంది..
బీఆర్ఎస్ పాలనలో ఉద్యమకారులకు అవమానం..
జయశంకర్, గద్దర్, సుద్దాల విగ్రహాలు ఎక్కడ..?
కేసులు ఉన్నవారే ఉద్యమకారులా..?
2014 నుంచి నిరుద్యోగులకు అన్యాయమే..!
ఉద్యమకారుల కోసం మరో ఉద్యమం
మాది ఫక్తు రాజకీయ పార్టీ కాదు
ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు
Ex MLC Kavitha | త్రినేత్ర.న్యూస్ : ప్రాణ త్యాగాల పునాదుల మీద వెలిసిన తెలంగాణలో.. 369 మంది బిడ్డలను పొట్టనబెట్టుకున్న కాసు బ్రహ్మానందరెడ్డి ఆనవాళ్లు ఇంకా ఉండటం బాధాకరమని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. త్వరలోనే రాజకీయ పార్టీ పెట్టబోతున్నామని తెలిపారు. మాదీ ఫక్తు రాజకీయ పార్టీ కాదు.. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ అని కవిత పేర్కొన్నారు. హైదాబాద్ ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో కవిత పాల్గొని ప్రసంగించారు.
ఫిబ్రవరి 12 న మనమంతా ఇలా చారిత్రక ప్రాంతమైన ఆర్టీసీ కళ్యాణ మండపంలో కలుసుకోవటం కొంత సిగ్గుగా, కొంత సంతోషంగా ఉంది. తెలంగాణకు వ్యతిరేకంగా సమైక్యవాదులు ఒక్కటైతే ఇదే చోట మనంతా తెలంగాణ జేఏసీగా ఏర్పాటయ్యాం. ఆ తర్వాత మనం తెలంగాణను సాధించుకున్నాం. కానీ మళ్లీ ఒకసారి ఉద్యమకారుల కోసం ఒక అడుగు ముందుకు వేసేందుకు ఇక్కడ కలుసుకున్నాం. నిజానికి రాష్ట్రం రాగానే ఉద్యమకారులందరికీ మొదటి వరుసలోనే గౌరవం, ఆర్థిక వృద్ధి, రాజకీయ అవకాశాలు వస్తాయని భావించాం. కానీ ఆ విధంగా జరగకపోవటం చాలా బాధ కలిగించే అంశం. మన తెలంగాణ అనేది నిత్యం పోరాటాల గడ్డనే. మానవాళి పుట్టినప్పటికీ నుంచి మన గడ్డకు ఎంతో చరిత్ర ఉంది. తెలంగాణలో పుట్టినందుకు గర్వపడుతున్నా. ఎన్ని జన్మలు ఉన్న సరే మళ్లీ తెలంగాణలోనే పుట్టాలని కోరుకుంటున్నా. మన నేలకు పునీతమైన, పురాతనమైన చరిత్ర ఉంది అని కవిత పేర్కొన్నారు.

తెలంగాణ మొత్తం అగ్గి అయ్యింది..
1860లోనే రామ్ జీ అనే గోండు బిడ్డను ఆయన అనుచరులను వెయ్యి మందిని ఒకే చెట్టుకు బ్రిటీష్ వాళ్లు ఉరి తీశారు. ఆ తర్వాత మరో గోండు బిడ్డ కొమురం భీమ్ కూడా నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. 1942 జులై 4 వ తేదీన దొడ్డి కొమురయ్య అమరుడైతే తెలంగాణ మొత్తం అగ్గి అయ్యింది. అప్పటి దురాగతాలకు వ్యతిరేకంగా తెలంగాణ ఒక్కటైంది. 1942కు ముందే మన ప్రాంతంలో భూ పోరాటాలు జరిగి భూ పంపిణీ జరిగింది. స్వాతంత్రం రాకముందు వరకు కూడా రజాకార్లు, సైన్యం చేసిన ఘోరాతి దురాగతలను భరించాం. మనకు ఎప్పుడు కూడా శాంతి, సంతోషం లేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం పోరాటం చేయాల్సి వచ్చిందని కవిత గుర్తు చేశారు.
ఆ గుర్తులు ఇంకా ఉండటమే మనకు బాధ..
1956లో ఆంధ్రాతో మనల్ని కలిపారు. కానీ కొన్ని సంవత్సరాలకే వాళ్లపై పోరాటం చేశాం. 1962లో ఇడ్లి, సాంబార్ గో బ్యాక్ ఉద్యమం చేశాం. 1969లో తెలంగాణ ఉద్యమం చేశాం. 1969లో తెలంగాణ ఉద్యమం చేసిన మన 369 మంది పిల్లలను కాసు బ్రహ్మనంద రెడ్డి పొట్టనపెట్టుకున్నాడు. కానీ ఇప్పటికీ కూడా హైదరాబాద్లో కేబీఆర్ పార్క్కు అదే పేరు ఉంది. అందుకే మనకు బాధ. ఏ చేదు గుర్తులు ఉండకూడదని అనుకున్నామో ఆ గుర్తులు ఇంకా ఉండటమే మనకు బాధ. నక్సల్ ఉద్యమం చేసిన మన వాళ్లను రాజ్యం ఘోరాతి ఘోరంగా పొట్టన పెట్టుకుంది. వరంగల్లోని పద్మాక్షి గుట్ట ఇప్పటికీ నెత్తురోడుతోంది. 1995లో వరంగల్ డిక్లరేషన్తో మా తెలంగాణ మాకు కావాలని నినదించారు. గద్దర్ సహా చాలా మంది మేధావులు అప్పుడు తెలంగాణ కోసం పోరాడారు. అప్పటి వరకు కూడా మన విప్లవకారులు, మేధావులు, తెలంగాణ భావాజాలాన్ని కాపాడారు. ఇక 2001లో కేసీఆర్ వచ్చి తెలంగాణ ఉద్యమంలో అగ్గి రాజేశారు. మొత్తం సమాజం కూడా ఆయన వెంట ఉండి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని కవిత తెలిపారు.
కేసీఆర్ను అనాలనే ఉద్దేశం ఎవరికీ లేదు..
స్వరాష్ట్రంలో కొంత మంది ఉద్యమకారులకే అవకాశాలు వచ్చాయి. అవకాశాలు వచ్చిన వాళ్లు ఉద్యమకారుల భుజాలు తడుతారని భావించాం. కానీ అవకాశం వచ్చిన వాళ్లే ఉద్యమకారులను అవమానించే పరిస్థితి వచ్చింది. మనవాడే మనల్ని పురుగుల్ని చూసినట్లు చూసి అవమానించాడు. ఇక ఎవరైతే తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచారో, మనల్ని ఉద్యమంలో కొట్టించారో వాళ్లే కేసీఆర్ చుట్టూ చేరారు. కేసీఆర్ను అనాలనే ఉద్దేశం ఎవరికీ లేదు. కానీ పదేళ్లు అవకాశం ఇస్తే ఎందుకు న్యాయం చేయలేదన్నది అడగాల్సిందే. కేశవరావ్ జాదవ్ చనిపోతే ఎందుకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపలేదు? ఈ ప్రాంతం కాని ఎంతో మందికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారని ఆమె పేర్కొన్నారు.
జయశంకర్ సార్ విగ్రహం పెట్టుకోలేకపోయాం..
కేబీఆర్ పార్క్ వద్ద జయశంకర్ సార్ విగ్రహాం పెట్టాలని అప్పటి మున్సిపల్ మినిస్టర్ను ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశాను. ట్యాంక్ బండ్ పై కూడా జయశంకర్ సార్ విగ్రహం పెట్టుకోలేకపోయాం. ఇప్పుడున్న ముఖ్యమంత్రి హైదరాబాద్ కూడళ్లలో ఎవరెవరివో విగ్రహాలు పెడుతున్నారు. గద్దర్, సుద్దాల హన్మంతు లాంటి వాళ్ల విగ్రహాలు రవీంద్ర భారతిలో ఉండాలి. కానీ ఎవరి విగ్రహాలు పెడుతున్నారో చూస్తూనే ఉన్నాం కదా? ఇప్పుడున్న ముఖ్యమంత్రికి ఉద్యమ సోయి లేదు. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావటం మన దౌర్భాగ్యం. కానీ మన చేతిలో ఉన్నప్పుడు మనం ఎందుకు చేసుకోలేకపోయాం? మనం పోరాటం చేస్తేనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అర్థం అవుతుంది. మనకు పోరాటాలు కొత్త కాదు. కానీ మనవాళ్లే చేసిన గాయంతో నొప్పి ఎక్కువ అవుతోంది. తెలంగాణ తల్లిని విముక్తి చేశాం. మన బానిసత్వాన్ని కూడా తెంచుకోవటానికి ముందడుగు వేద్దాం. ఉద్యమకారులపై లాఠీ దెబ్బ పడాలంటే ముందు ఆ లాఠీ నా మీద పడాల్సిందే. ఉద్యమకారులకు బుల్లెట్ తగలలంటే ముందు నన్ను దాటి వెళ్లాల్సిందే. మీరు బయట ఉండి బాధపడితే నేను బీఆర్ఎస్లో ఉండి బాధపడ్డాను. జీ హుజుర్ అంటే అక్కడే ఉండేదాన్ని, క్యా హుజుర్ అన్నందుకు ఇక్కడ ఉన్నా. కేసీఆర్ హయాంలో నిరుద్యోగులకు న్యాయం జరగలేదు. ఇప్పుడు కూడా వారికి న్యాయం జరగటం లేదు. ఈ ముఖ్యమంత్రి బతుకమ్మను తీసేసి తెలంగాణ తల్లి రూపాన్ని మార్చాడు. ఆయనకు ఉద్యమ సోయి లేదు. ఉద్యమకారులకు ఏం చేస్తామని చెప్పారో కాంగ్రెస్ అవన్నీ చేయాలని కవిత డిమాండ్ చేశారు.
కేసులున్న వారే ఉద్యమకారులంట..
ఈ నెల 26 నుంచి బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. ఆ బడ్జెట్లో ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రొవిజన్ పెట్టాలి. లేదంటే ఊరుకునేది లేదని ప్రొఫెసర్ కోదండరామ్ను హెచ్చరిస్తున్నా. తెలంగాణ సోయి లేని రేవంత్ రెడ్డికి మీరు మద్దతిస్తేనే ప్రజలు నమ్మారు. కానీ ఇప్పుడు కోదండ రాం ఏమీ మాట్లాడటం లేదు. కాంట్రాక్టర్లకు 5 వేల కోట్ల రూపాయలు ధారబోస్తే మాట్లాడటం లేదు. ఆకునూరి మురళి, కోదండ రాం ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. విద్యాకమిషన్ నివేదిక ఏం ఇచ్చింది? ఈ ప్రభుత్వం దాన్ని పాటించిందా? గఉరుకులాల్లో పిల్లలు చనిపోతే విద్యా కమిషన్ ఏం చేస్తుంది? ఉద్యమకారులకు, తెలంగాణకు ఇచ్చిన హామీలపై మీ వెంటపడుతాం. హైదరాబాద్లో ఎన్నో కంపెనీలు వచ్చినప్పటికీ మన వాళ్లకు ఉద్యోగాలు రావటం లేదు. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాల్లో మన వాళ్లకు 20 శాతం రిజర్వేషన్ల కోసం జాగృతి పోరాటం చేస్తుంది. ఉద్యమకారుల పిల్లలు ఎవరికీ కూడా పెద్ద సంస్థల్లో ఉద్యోగాలు రాలేదు. ఇప్పుడున్న అధికారులు ఉద్యమకారులు అంటే ఎవరు అని అడుగుతున్నారు. అంటే ఉద్యమకారులు ఎవరో కూడా మనమే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేసులున్న వారే ఉద్యమకారులంట, మరి నాపై కూడా కేసు లేదు. ఉన్న కేసులను కోర్టు కొట్టివేసింది. కేసులు లేకుండా కూడా ఎంతో మంది ఉద్యమం చేశారని కవిత తెలిపారు.
ప్రెస్ మిత్రులకు కూడా న్యాయం జరగాల్సి ఉంది..
ప్రెస్ మిత్రులకు కూడా న్యాయం జరగాల్సి ఉంది. ఎంతో మంది పేపర్లు పెట్టి, తెలంగాణ సాహిత్యాన్ని ప్రచురించి ఆస్తులు అమ్ముకున్నారు. వారందరికీ కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఉద్యమకారులను గుర్తించేందుకు మనం యాప్ సిద్ధం చేశాం. యాప్లో ఎన్రోల్ చేసుకొని మన ఐడెంటిటీని మనమే గుర్తించుకుందాం. అప్పుడు కూడా ప్రభుత్వం గుర్తించకపోతే కోదండరాం, ఆకునూరి మురళిని పట్టుకుందాం. యాప్లో ఎన్రోల్ చేసుకున్న ప్రతి ఉద్యమకారుడి కుటుంబానికి జాగృతి తరఫున హెల్త్ ఇన్సూరెన్స్ చేయిస్తాం. మమ్మల్ని చూసైనా ప్రభుత్వానికి సిగ్గు రావాలన్నదే మా చిరు ప్రయత్నమని కవిత పేర్కొన్నారు.
మాది ఫక్తు రాజకీయ పార్టీ కాదు..
పొలిటికల్ పార్టీ పెడతానని నేనంటే నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అప్పుడు, ఇప్పుడు ఎప్పుడు కూడా నా పక్కన ఉద్యమకారులే తప్ప.. పైరవీ కారులు లేరు. తెలంగాణ పేరు, అస్తిత్వాన్ని కాపాడుకునే విధంగా మా పార్టీ ఉంటుంది. మాది ఫక్తు రాజకీయ పార్టీ కాదు. తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడే రాజకీయ పార్టీ. ఉద్యమకారుల అజెండాతోనే మా పార్టీ ముందుకు పోతుంది. ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేశాం. వాటికి ఎంతో మంది సహకారం చేశారు. కానీ రాష్ట్రం వచ్చాక వాళ్లకు ఏమాత్రం న్యాయం జరగలేదని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
మేఘా కృష్ణారెడ్డి అపర కుబేరుడయ్యాడు..
తెలంగాణలో ఉన్న చిన్న కాంట్రాక్టర్లకు లాభం జరగలేదు. కానీ మేఘా కృష్ణారెడ్డి అపర కుబేరుడయ్యాడు. తెలంగాణ వచ్చాక అన్ని పార్టీల నేతలు బీఆర్ఎస్లో చేరారు. ప్రజాస్వామ్య విలువలు మొత్తం కాలరాయబడ్డాయి. ఫేస్బుక్లో పోస్ట్ పెట్టినా, యూట్యూబ్లో వీడియో పెట్టిన అరెస్ట్లు చేసి కేసులు పెట్టారు. అహంకారం, సహనశీలత లేకపోవటంతోనే బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. మంచితనం, సహనశీలత, భోళాతనమే తెలంగాణ తత్వం. అవి కోల్పోతే మనల్ని మనం కోల్పోయినట్లే. కేసీఆర్ ఉద్యమకారులకు అన్యాయం చేశారని చెప్పి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. కానీ మీరు కూడా న్యాయం చేయకపోతే మిమ్మల్ని బిల్డింగ్ నుంచి బయటకు గుంజుతారు. తెలంగాణ వచ్చాక కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి కుటుంబాలకు ఏం సమాధానం చెబుతారు? ఈ ఉద్యమకారుల కోసం మరో ఉద్యమం చేయాల్సి ఉంది. ధర్మం వైపే ఉండాలని శ్రీ కృష్ణుడు ఎప్పుడో చెప్పారు. తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారుల వైపే ధర్మం ఉంది. తెలంగాణ జాగృతి వారి కోసం పోరాటం చేస్తూనే ఉంటుంది. చాకలి ఐలమ్మ , మారోజు వీరన్న లాంటి ఉద్యమకారుల స్ఫూర్తితో మేం ముందుకు సాగుతామని కవిత తేల్చిచెప్పారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



