త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | వ‌ర‌ద కాల్వ‌లో పారుతున్న నీళ్లు కాళేశ్వ‌రం నీళ్లు కాదా..? రేవంత్‌ను ప్ర‌శ్నించిన హ‌రీశ్‌రావు

Harish Rao | పొద్దున లేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని రేవంత్ రెడ్డి పదేపదే అబద్ధాలు చెబుతున్నారు. మరి ఈ నిమిషానికి వరద కాలువలో పారుతున్న నీళ్లు కాళేశ్వరం నీళ్లు కాదా? అని సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు.

S

Telangana | Published On Mar 7, 2026, 3.59 pm IST

Harish Rao | వ‌ర‌ద కాల్వ‌లో పారుతున్న నీళ్లు కాళేశ్వ‌రం నీళ్లు కాదా..? రేవంత్‌ను ప్ర‌శ్నించిన హ‌రీశ్‌రావు
Advertisement

ఇంతకంటే సిగ్గుచేటు ఉందా
కాంగ్రెస్ నేతలవి బూతులు
కేసీఆర్‌వి చేతలు..
బూతులు ఆపి.. స‌కాలంలో రైతు బంధు ఇవ్వండి..

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : పొద్దున లేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని రేవంత్ రెడ్డి పదేపదే అబద్ధాలు చెబుతున్నారు. మరి ఈ నిమిషానికి వరద కాలువలో పారుతున్న నీళ్లు కాళేశ్వరం నీళ్లు కాదా? అని సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు. లక్ష్మీ పంప్ హౌస్ మోటార్లు నడుస్తుంటేనే కదా ఈ నీళ్లొచ్చాయని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ పర్యటనలో భాగంగా కురిక్యాల వద్ద కొండన్నపల్లి వరద కాలువను మాజీ మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. ఆయన వెంట మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, స్థానిక మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తదితరులు ఉన్నారు. కాలువ పరిశీలన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై హ‌రీశ్‌రావు నిప్పులు చెరిగారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, కేసీఆర్ నాయకత్వంలో కరీంనగర్ జిల్లాను అద్భుతమైన వాటర్ హబ్‌గా మార్చాం. నిన్నగాక మొన్న లక్ష్మీ పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వరద కాలువలకు నీళ్లు వదిలారు. ప్యాకేజీ 6, ప్యాకేజీ 8 కింద మోటార్లు పెట్టి, టన్నెల్స్ పనులు పూర్తి చేసి, వరద కాలువను ఒక రిజర్వాయర్‌గా మార్చి.. చొప్పదండి, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, బాల్కొండ నియోజకవర్గాలకు అద్భుతంగా సాగునీరు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం నీళ్లు వాడుకుంటున్నారు, కాళేశ్వరం మోటార్లు నడుపుతున్నారు, ఆ నీళ్లతోనే పంటలు పండుతున్నాయి.. కానీ బయట మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టే లేదని చిల్లర మాటలు మాట్లాడటం ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తికి సిగ్గుచేటు. వరద కాలువలో పారుతున్న నీళ్లు, ఆ కాలువ మీద ఆధారపడి పండుతున్న లక్షలాది ఎకరాల పంటలు కాళేశ్వరం పుణ్యం కాదా? మిడ్ మానేరుతో పాటు అనంతగిరి, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్లలో నింపిన జలాలు కాళేశ్వరం నీళ్లు కావా.. ఈ రిజర్వాయర్ల కింద పండుతున్న పంటలన్నీ కాళేశ్వరం జలాలతోనే కదా అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

కళకళలాడుతున్న పంటలన్నీ కాళేశ్వరం చలవే

కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం ఒక మేడిగడ్డ బ్యారేజీ మాత్రమే కాదు. అందులో 100 కంపోనెంట్లు ఉన్నాయి. 3 బ్యారేజీలు, 16 రిజర్వాయర్లు, 18 సబ్‌స్టేషన్లు, 203 కిలోమీటర్ల టన్నెళ్లు, 1600 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు.. ఇవన్నీ కలిపితేనే కాళేశ్వరం ప్రాజెక్టు అని కాంగ్రెస్ నేతలు తెలుసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు లేకుండానే రాష్ట్రంలో వరి పండుతోందని రేవంత్ రెడ్డి చెప్పడం ఆయన అవివేకానికి నిదర్శనం. 2022 సంవత్సరంలోనే దేశంలో అత్యధికంగా వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దింది కేసీఆరే. మెదక్, సిద్దిపేట, కరీంనగర్, సిరిసిల్ల, హుజురాబాద్ ప్రాంతాల్లో నేడు కళకళలాడుతున్న పంటలన్నీ కాళేశ్వరం చలవే అని హ‌రీశ్‌రావు తెలిపారు.

ఆ చిన్న పని చేస్తే లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయి..

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రెండున్నరేళ్లలో ఒక్క కాలువ తవ్వలేదు, ఒక్క చెక్ డ్యాం నిర్మించలేదు, ఒక్క ప్రాజెక్టు కట్టలేదు. కనీసం కాలువల తవ్వకానికి ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వలేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో రిజర్వాయర్లు, టన్నెళ్లు, మెయిన్ కెనాల్స్ పనులన్నీ కేసీఆర్ పూర్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సిందల్లా కేవలం చిన్నచిన్న పిల్ల కాలువలు, పంట కాలువలు తవ్వడమే. ఆ చిన్న పని చేస్తే లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయి. కానీ, బీఆర్ఎస్ కార్యకర్తలపై పగబట్టిన రేవంత్ రెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షకట్టి ఉద్దేశపూర్వకంగానే కాలువల పనులు చేయడం లేదు. కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రి పదేపదే అబద్ధాలు వల్లిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. వాస్తవానికి కరీంనగర్ జిల్లాను అద్భుతంగా తీర్చిదిద్దింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు.

ఎల్లంపల్లి ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసింది..

రూ. 2052 కోట్లు ఖర్చుపెట్టి ఎల్లంపల్లి ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసింది. ఎల్లంపల్లిలో రాయపట్నం బ్రిడ్జి నిర్మించింది, నిర్వాసితుల కోసం 126 ఇళ్లు కట్టింది, భూసేకరణ పూర్తి చేసి 2016లోనే 20 టీఎంసీల నీళ్లను ఎల్లంపల్లిలో నింపింది కేసీఆరే. గత కాంగ్రెస్ హయాంలో మిడ్ మానేరు ప్రాజెక్టులో కేవలం చారాణా వంతు పనులు మాత్రమే జరిగితే.. 90 శాతం కాంక్రీట్ పనులు, 100 శాతం గేట్ల బిగింపు పనులు పూర్తి చేసి కరీంనగర్ జిల్లాకు గుండెకాయ లాంటి ఆ ప్రాజెక్టును పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. మిడ్ మానేరుపై రూ. 1586 కోట్లు ఖర్చు చేసి, దాన్ని కాళేశ్వరం జలాలతో నింపామ‌ని హరీశ్‌రావు గుర్తు చేశారు.

అది బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషే..

ఒకప్పుడు ఇక్కడున్న వరద కాలువ కింద రైతులకు మక్కజొన్న పంట కూడా పండని పరిస్థితి ఉండేది. అలాంటిది కేసీఆర్ రెండు వేల కోట్లతో ఎస్సారెస్పీ పునర్జీవన పథకం చేపట్టి.. వరద కాలువను ఒక జీవనదిగా, ఒక రిజర్వాయర్‌గా మార్చి 365 రోజులు నీళ్లుండేలా చేశారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధర్నా చేస్తేనో, మాజీ మంత్రి గంగుల కమలాకర్ గొంతు విప్పితేనో భయపడి మీరు మోటార్లు ఆన్ చేసి వరద కాలువలకు నీళ్లు వదిలారు. ఈ వరద కాలువకు తూములు పెట్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఆ తూముల ద్వారా రెండు వైపులా మోటార్లు పెట్టుకుని వేలాది ఎకరాల్లో రైతులు పంట పండించుకుంటున్నారంటే.. అది బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషే. వరద కాలువ నుండి ఎస్సారెస్పీకి కూడా లింక్ ఇచ్చి పెద్దపల్లి, మంథని, చొప్పదండి వర్గాలకు సాగునీరు అందించామ‌ని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు.

కాళేశ్వరం జలాలను అందించింది కేసీఆరే..

సిరిసిల్ల - వేములవాడ ప్రాంతంలో మల్కపేట రిజర్వాయర్, మెట్‌పల్లికి నీళ్లందించే సదర్మాట్ ప్రాజెక్టు, అలాగే గొల్లవాగు ప్రాజెక్టులను పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. హుస్నాబాద్‌లోని గౌరవెల్లి ప్రాజెక్టులో 96 శాతం పనులను బీఆర్ఎస్ ప్రభుత్వమే పూర్తి చేసి రిజర్వాయర్‌లో నీళ్లు నింపితే.. మిగిలిన 4 శాతం పనులు పూర్తి చేసి కాలువల ద్వారా రైతులకు నీళ్లిచ్చే చేతగాని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అలాగే మిడ్ మానేరు కింద తోటపల్లి రిజర్వాయర్ ద్వారా మానకొండూరు నియోజకవర్గానికి కాళేశ్వరం జలాలను అందించింది కేసీఆరే. పంట కాలువల ద్వారా నీళ్లు పారించే తెలివి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదు. కాళేశ్వరం నీళ్లు మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ లోని మూసీ నదిని శుద్ధి చేయడానికి తీసుకెళ్తానని చెప్పి ఏకంగా రూ. 8000 కోట్లతో టెండర్లు పిలిచారు. ఆ మల్లన్న సాగర్‌లో ఉన్నవి కాళేశ్వరం నీళ్లు కాదా.. అని హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు.

10 వేల ఎకరాలకైనా కొత్తగా నీళ్లిచ్చిందా..?

కాళేశ్వరం ప్రాజెక్టు కింద లక్షలాది ఎకరాల్లో పంటలు పండుతున్న మాట నిజం, కోట్లాది మంది ప్రజలకు తాగునీరు అందుతున్న మాట కూడా అక్షర సత్యం. ఈ చిల్లర వాగుడు, చిల్లర మాటలు బంద్ చేసి, కాళేశ్వరం నీటిని ప్రజలకు ఇచ్చి చూపించు. మేడిగడ్డ పిల్లర్లకు మరమ్మతులు చేసి రైతులకు నీళ్లు అందించండి. మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్టులో స్పష్టంగా మరమ్మతులు చేసి ప్రాజెక్టును వాడుకోవాలని చెప్పారు. రిపోర్ట్ ఇచ్చి రెండు సంవత్సరాలైనా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టకుండా ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తోంది. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మేడిగడ్డను రిపేర్ చేయడం లేదు. మేడిగడ్డ పిల్లర్ కుంగినా సరే.. ఎస్సారెస్పీ ద్వారా నేరుగా మిడ్ మానేరుకి, ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకి, మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి మోటార్లు ఆన్ చేసి మూడు వైపుల నుంచి నీటిని తరలించే అవకాశం ఉంది. కానీ రేవంత్ రెడ్డి రైతులకు నీళ్లు ఇవ్వకూడదనే కుట్రతోనే ఈ పనులు చేయడం లేదు. గతంలో భూసేకరణ చేసి దాదాపు 20 లక్షల కొత్త ఆయకట్టుకు కాళేశ్వరం ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లందిస్తే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రేవంత్ సర్కార్ కనీసం 10 వేల ఎకరాలకైనా కొత్తగా నీళ్లిచ్చిందా..? ప్రజల కోసం వెంటనే కాలువల పనులు పూర్తి చేసి నీళ్లందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామ‌ని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

ప్రజలే నీ సంగతి ఏంటో చెబుతారు

ఎన్నికల ముందు మూడు పంటలకు రైతుభరోసా ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఉన్న పంటలకు కూడా రైతుబంధు ఇవ్వడం లేదు. ముఖ్యమంత్రి మాట్లాడే బూతులు రైతుల కడుపు నింపవు. బూతులు ఆపి.. సకాలంలో రైతుబంధు ఇవ్వండి, రైతులకు యూరియా సరఫరా చేయండి. 99 రోజుల ప్రణాళిక" అంటూ మళ్లీ కొత్త డ్రామాలు మొదలుపెట్టారు. గ్రామాల్లో మహిళల దగ్గరికి వెళ్లి నెలకు రూ. 2500 ఎగ్గొట్టిన అని చెబుతావా? రైతులకు రైతుబంధు ఎగ్గొట్టి, యూరియా దొరకకుండా చేసిన అని చెబుతావా? కేసీఆర్ ఇచ్చిన 2000 పెన్షన్ వల్లే నేడు అవ్వాతాతలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమాత్రం ధైర్యం ఉన్నా, నీ 99 రోజుల ప్రణాళికలో పోలీసుల భద్రత లేకుండా జనాల్లోకి రా.. అప్పుడు నువ్వు చేసిన మోసాలకు ప్రజలే నీ సంగతి ఏంటో చెబుతారు అని హ‌రీశ్‌రావు హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement