త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | ఏపీకి నీళ్లు వ‌దిలేందుకే దేవాదుల మోటార్లు బంద్ పెట్టారా..? : హ‌రీశ్‌రావు

Harish Rao | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక సాగునీటి రంగంలో తీవ్ర నిర్ల‌క్ష్యం జ‌రుగుతుంద‌ని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. ఇటు గోదావ‌రి, అటు కృష్ణా ప‌రివాహ‌క ప్రాంతంలోని ఆయ‌క‌ట్టు రైతులు తీవ్ర అన్యాయానికి గుర‌వుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. న‌దుల్లో నీటి ప్ర‌వాహం ఉన్న‌ప్ప‌టికీ.. సాగుకు ఎందుకు నీళ్లు విడుద‌ల చేయ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. తెలంగాణ హ‌క్కుల‌ను కాపాడ‌డంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఫెయిల్ అయింద‌ని హ‌రీశ్‌రావు విమ‌ర్శించారు.

S

Telangana | Published On Feb 20, 2026, 5.50 pm IST

Harish Rao | ఏపీకి నీళ్లు వ‌దిలేందుకే దేవాదుల మోటార్లు బంద్ పెట్టారా..? : హ‌రీశ్‌రావు
Advertisement

గోదావరిలో ప్రవాహం ఉన్నా ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు?
వరంగల్ జిల్లా రైతుల పట్ల రేవంత్‌కు ఎందుకింత కక్ష?
కృష్ణా, గోదావరి నీళ్లను చంద్రబాబుకు ధారాదత్తం చేస్తున్నావా?
అప్పుడైనా, ఇప్పుడైనా కాంగ్రెస్ తెలంగాణ రైతుల పాలిట శాపమే
బడ్జెట్‌లో చెప్పిన 12 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యం ఏమైంది?
రెండున్నరేండ్ల పాలనలో తట్టెడు మట్టి తీసింది లేదు
లీకులు తప్ప, రైతు భరోసా ఇవ్వడం లేదు?
దేవాదుల వ‌ద్ద మీడియాతో హ‌రీశ్‌రావు

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి నీళ్లు వ‌దిలేందుకే దేవాదుల మోటార్లు బంద్ పెట్టారా..? అని రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వాన్ని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు. వ‌రంగ‌ల్ జిల్లా రైతుల ప‌ట్ల క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పూనుకుని.. కృష్ణా, గోదావ‌రి నీళ్ల‌ను గురువు చంద్ర‌బాబుకు ధారాద‌త్తం చేస్తున్నావా..? అని హ‌రీశ్‌రావు నిల‌దీశారు. దేవాదుల ప్రాజెక్టులో భాగమైన వరంగల్ జిల్లా దేవన్నపేట పంప్ హౌజ్‌లను పరిశీలించిన అనంతరం హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.

దేవాదులలో భాగమైన దేవన్నపేట వద్ద ఉన్న మూడు పంపులు పరిశీలించాం. లోపలికి వెళ్లి చూస్తే మూడుకు మూడు మోటార్లు పని చేయడం లేదు. ఒక వైపు గోదావరిలో కావాల్సినంత నీళ్ల ప్రవాహం ఉంది. ఈరోజు కూడా సమ్మక్క సాగర్ దగ్గర 16 వేల క్యూసెక్కుల నీళ్ళు పోతున్నాయి. నదిలో నీళ్లు ఉన్నాయి, రైతాంగానికి నీళ్లు అవసరం ఉన్నాయి. కానీ దేవన్నపేట పంపు హౌజ్‌లో మూడు మోటార్లు ఆఫ్ చేసి పెట్టారు. 2025 మార్చి 18న నీటి పారుదల శాఖ మంత్రి, జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మోటార్లు ఆన్ చేస్తే ప్రారంభం కాలేదు. మోటార్లు స్లార్ట్ అయ్యే వరకు ఇక్కడే ఉంటామని మీడియా ముందు చెప్పి వెంటనే హెలికాప్టర్ ఎక్కి వెళ్లిపోయారు. గత సంవత్సరంలో ఈ పంపులు ఆన్ చేయకపోవడం వల్ల 60 వేల ఎకరాల్లో పంట ఎండిపోయింది. గత పది రోజుల నుంచి మోటార్లు ఆగి, నీటి లిఫ్టు ఆగిపోయింది. జనగాం, పాలకుర్తి, స్టేషన్ ఘన్‌పూర్‌కు నీళ్ళు లేవు. నీళ్లు లేవు అని గండిరామారం లిఫ్టులు ఆగిపోయాయి. ఇక్కడేమో మోటార్లు నడపడం లేదు. దేవన్నపేట పంపు హౌజ్‌కు వస్తే రిపేర్ ఉంది, సాఫ్ట్‌వేర్ ప్రాబ్లం అని చెబుతున్నారని హ‌రీశ్‌రావు తెలిపారు.

వరంగల్ జిల్లా రైతులకు తీవ్రమైన అన్యాయం

అసలు మూడో ఫేజ్ చేసిందే బీఆర్ఎస్ పార్టీ. 99 శాతం పనులు పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. వరల్డ్ లార్జెస్ట్ టన్నెల్ ఇది. రామప్ప నుంచి ఉనికిచెర్ల వరకు 49.5 కిలోమీటర్ల టన్నెల్ ఇది. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి టన్నెల్ పూర్తి చేసినం. ఈ పంప్ హౌజ్ ప్రపంచంలోనే లోతైన పంపు హౌజ్.. 155 మీటర్ల లోతులో ఉంది. కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల దేవాదుల నీళ్లు అందక వరంగల్ జిల్లా రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతున్నది. ఆ రోజైనా, ఈ రోజైనా రైతులకు అన్యాయం చేసింది కాంగ్రెస్, దేవాదుల ప్రాజెక్టును పట్టించుకోలేదు. రెండున్నరేండ్లుగా అంగుళం కూడా ముందుకు పోలేదు. కేసీఆర్ దేవాదులను అద్బుతంగా తీర్చిదిద్దారు. కాంగ్రెస్, టీడీపీలు నది మీద బ్యారేజీ లేకుండా నదీ ప్రవాహంలోనే నీళ్లు తీసుకుంటాం అంటే వంద రోజులు కూడా నీళ్లు అందని పరిస్థితి. కానీ కేసీఆర్ సమ్మక్క బ్యారేజీ కట్టి 365 రోజులు నీళ్లు తీసుకునే విధంగా రూపకల్పన చేశార‌ని మాజీ మంత్రి గుర్తు చేశారు.

దేవాదుల కింద ఇచ్చిన ఆయకట్టు కేవలం 47 వేల ఎకరాలు..

ఆనాడు 25 టీఎంసీలు మాత్రమే దేవాదులకు కేటాయింపులు ఉంటే కేసీఆర్ 60 టీఎంసీలకు పెంచి ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేలా ప్రణాళికలు చేశారు. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలు కలిసి దేవాదుల కింద ఇచ్చిన ఆయకట్టు కేవలం 47 వేల ఎకరాలు. బీఆర్ఎస్ ఆ ఆయకట్టును 3 లక్షల 17 వేల ఎకరాలకు పెంచింది. రెండున్నరేండ్లలో ఒక్క ఎకరాకు అదనంగా నీళ్లు ఇవ్వలేదు. ఉన్న మోటార్లు నడపడం చేతనవుతలేదు. పోయిన ఏడాది భీం ఘన్ పూర్ వద్ద మోటార్లు ఆన్ చేయలేదు. రూ. 8 కోట్లు మెయింటనెన్స్ డబ్బులు కాంట్రాక్టర్లకు ఇవ్వలేదు కనుక మోటార్లు ఆన్ చేయలేదు. పోయిన ఏడాది నీళ్లు అందక పంటలు ఎండిన దానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం. ఈ జిల్లా మంత్రులు, కాంగ్రెస్ నాయకులు నిర్లక్ష్యం. బీఆర్ఎస్ పోరాటం చేస్తే 50 రోజుల తర్వాత రూ. 8 కోట్లు ఇచ్చి మోటార్లు ఆన్ చేశారు. అప్పటికే ఏడెనిమిది వందల కోట్ల పంట నష్టం జరిగిందని హ‌రీశ్‌రావు తెలిపారు.

తెలంగాణ హక్కులు కాపాడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్

సమ్మక్క బ్యారేజీ కట్టింది మేం.. ఫేజ్ 1, ఫేజ్ 2 పూర్తి చేసింది మేం.. ఫేజ్ 3లో లాంగెస్ట్ టన్నెల్ కట్టినం. బీఆర్ఎస్ హయాంలో రూ. 7300 కోట్లు ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు చేశాం. 80 శాతం పైగా ప్రాజెక్టు పనులు పూర్తి చేశాం. 47 వేల ఆయకట్టును 3 లక్షలకు పైగా పెంచినం. 33 వేల ఎకరాల భూసేకరణ అవసరం ఉంటే 30 వేలు బీఆర్ఎస్ హయాంలో పూర్తి చేసినం. మిగిలిన 3వేల ఎకరాలు భూసేకరణ చేస్తే, వెయ్యి రెండు వేల కోట్లు ఖర్చు చేస్తే 2.40 లక్షల ఎకరాలకు ఆయకట్టు వస్తది. రెండున్నరేండ్లలో రెండు వందల కోట్లు కూడా ఖర్చు చేయలేదు. గెలిచిన పాపానికి రైతులకు శాపం. ఉన్న మోటార్లు ఎందుకు నడపరు. ఎందుకు భూసేకరణ చేయరు. ఎందుకు ఆయకట్టుకు నీళ్లు ఇవ్వరు. ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అవుతున్నది. తెలంగాణ హక్కులు కాపాడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది. రేవంత్ రెడ్డి గోదావరి నీళ్లను చంద్రబాబుకు గురు దక్షిణగా వదులుతున్నడు. మేడిగడ్డ నీళ్లు ఎత్తడం లేదు, దేవాదుల వద్ద నీళ్లు ఎత్తడం లేదు, సీతమ్మ సాగర్ పూర్తి కాకుండా అక్కడా వదిలేస్తున్నడు. గోదావరి నదిలో తెలంగాణ హక్కులు కాపాడంలో రేవంత్ రెడ్డి ఫెయిల్. అటు కృష్ణా నదిలోనూ ఇదే పరిస్థితి. అత్యంత తక్కువ వినియోగం ముందెన్నడు నమోదు కాలేదు. కృష్ణా, గోదావరిలో మన నీటిని వినియోగించడంలో, ఏపీ జల దోపిడిని అడ్డుకోవడంలో కాంగ్రెస్ ఫెయిల్ కొత్తగా నిర్మించింది లేదు, ఉన్న ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ ఫెయిల్ అయింద‌ని హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు.

రైతు బంధు విషయంలో రోజుకో మాట..

రైతు బంధు విషయంలో రోజుకో మాట. సంక్రాంతికి అన్నరు, ఎన్నికలు అయిపోయాక అన్నరు, 17వ‌ తేదీ అన్నరు. ఈరోజు 20వ తేదీ. ఎప్పుడు ఇస్తావు రైతు బంధు? 20వేల కోట్ల బకాయిలు బడా కాంట్రాక్టర్లకు ఇస్తవు గానీ, బక్కచిక్కిన రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వవా..? గత యాసంగి బోనస్ చేసినవు, ఈసారి ఇస్తవా ఇయ్యవా ప్రకటించు? తక్షణమే అన్ని దేవాదుల మోటార్లు నడపాలని, మూడున్నర లక్షల ఎకరాలకు నీళ్లు అందించే విధంగా యుద్ద ప్రాతిపాదికన చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామ‌ని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

Advertisement
Advertisement