త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | భూ భారతి కాదు.. అది భూ దోపిడీ.. హ‌రీశ్‌రావు తీవ్ర విమ‌ర్శ‌లు

Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకుంటూ తీసుకొచ్చిన భూ భారతి పోర్టల్.. ఇప్పుడు అక్రమార్కులకు అడ్డాగా మారింది అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ధరణి మీద బురదజల్లి భూ భారతి తెచ్చామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ నాయకులు.. ఇప్పుడు ఆ పోర్టల్‌లో జరుగుతున్న కుంభకోణంపై ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు.

S

Telangana | Published On Feb 28, 2026, 4.05 pm IST

Harish Rao | భూ భారతి కాదు.. అది భూ దోపిడీ.. హ‌రీశ్‌రావు తీవ్ర విమ‌ర్శ‌లు
Advertisement

జేబులు నింపుకునేందుకు కొత్త భూ భార‌తి పోర్ట‌ల్
పెద్ద త‌ల‌కాయ‌ల‌ను కాపాడేందుకే ఆప‌రేట‌ర్ల అరెస్ట్
భూ భార‌తితో ప్ర‌జ‌ల ఆస్తులకు ర‌క్ష‌ణ క‌రువు
ఈ కుంభ‌కోణంపై విచార‌ణ జ‌రిపించాల్సిందే
బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు డిమాండ్

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకుంటూ తీసుకొచ్చిన భూ భారతి పోర్టల్.. ఇప్పుడు అక్రమార్కులకు అడ్డాగా మారింది అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ధరణి మీద బురదజల్లి భూ భారతి తెచ్చామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ నాయకులు.. ఇప్పుడు ఆ పోర్టల్‌లో జరుగుతున్న కుంభకోణంపై ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు.

ఈరోజు జనగామ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. రెవెన్యూ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా భ్రష్టు పట్టించిందో రైతులను ఎలా మోసం చేస్తోందో వివరించారు. ధరణి పోర్టల్‌లో లోపాలున్నాయంటూ పదే పదే విమర్శలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఎన్ఐసీ సాఫ్ట్‌వేర్‌తో భూ భారతి తెచ్చామని గొప్పలు చెప్పింది. కానీ ఆ పోర్టల్ ఇప్పుడు ఖజానాకు గండి కొడుతూ దళారులకు భూ హారతి పడుతోంది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు పూర్తి డబ్బులు కడుతుంటే, భూ భారతి పోర్టల్ ఎడిటింగ్ ఆప్షన్ వాడుకుని కేవలం 10 శాతం మాత్రమే ప్రభుత్వానికి చెల్లించి, మిగతా 90 శాతం దళారులు జేబుల్లో వేసుకున్నారు. 37 మండలాల్లో ఈ భూ భారతి కుంభకోణం దర్జాగా నడుస్తుంటే, కనీసం నిఘా వ్యవస్థలకు కూడా తెలియకపోవడం ఈ ప్రభుత్వ వైఫల్యమే. విలేకరులు వార్తలు రాస్తే తప్ప ముఖ్యమంత్రికి, రెవెన్యూ మంత్రికి ఈ స్కాం గురించి సోయి లేదు అని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు.

దోషులను కఠినంగా శిక్షించాలి..

ఈ భారీ కుంభకోణం వెనుక అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్ద అధికారులు ఉన్నారు. వాళ్ల పేర్లు బయటకు రాకుండా కవర్ చేయడానికే నామమాత్రంగా ఆపరేటర్లను అరెస్ట్ చేసి కేసులు నీరుగారుస్తున్నారు. ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టడానికి కమీషన్ల మీద కమీషన్లు, సిట్‌లు వేస్తున్న రేవంత్ రెడ్డి.. ఈ భూ భారతి కుంభకోణంపై, ప్రభుత్వ ఖజానా లూటీపై సిట్‌తో విచారణ ఎందుకు జరిపించడం లేదు. దీనిపై వెంటనే సిట్ వేసి దోషులను కఠినంగా శిక్షించాలి. ఖజానాకు రావాల్సిన ప్రతి పైసా రాబట్టాలని హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు.

సాదా బైనామాకు ఉరితాడు..

పేలని బాంబులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మొదలుకొని మండల స్థాయి అధికారుల వరకు.. అందరూ కలిసి నిషేధిత భూముల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారు. లక్షల ఎకరాలను ఉద్దేశపూర్వకంగా నిషేధిత జాబితాలో పెట్టడం, వసూళ్లు కాగానే తీసేయడం ఈ ప్రభుత్వానికి నిత్యకృత్యంగా మారింది. నేడు ఆ జాబితా కోటి ఎకరాలు దాటింది. హైకోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వ తీరు మారడం లేదు. అసలు నిషేధిత జాబితాలో ఎన్ని భూములు పెట్టారో వెంటనే శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. కేసీఆర్ హయాంలో 6 లక్షల 18 వేల మంది రైతులకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా సాదా బైనామాలు చేసి పాస్‌బుక్‌లు ఇచ్చాం. రెండో విడత కోసం 8 లక్షల 92 వేల మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక, గతంలో లేని విధంగా.. భూమి అమ్మిన వ్యక్తి బాండ్ పేపర్ పైన అఫిడవిట్ ఇవ్వాలి అనే కొత్త నిబంధన పెట్టి సాదా బైనామాకు ఉరితాడు బిగించింది. ఆ నిబంధన వల్ల ఇప్పటివరకు ఒక్క రైతుకు కూడా సాదా బైనామా కాలేదు. వెంటనే ఆ బాండ్ పేపర్ నిబంధన తొలగించి పెండింగ్ లో ఉన్న 8.92 లక్షల మంది రైతులకు న్యాయం చేయాలి అని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.

ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను గుంజుకున్నారు..

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ ఫ్రీ అని చెప్పి, ఇప్పుడు ప్రజల ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో పాస్ పుస్తకాల కోసం రూ. 300 వసూలు చేస్తున్నారు, కానీ ఆరు నెలలైనా ఒక్క పాస్ బుక్ ఇవ్వడం లేదు. పాస్ బుక్ లేకపోతే ఎరువులు రావు, బ్యాంకు లోన్లు రావు.. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ హయాంలో రిజిస్ట్రేషన్ అయిన వారం రోజులకే పాస్ బుక్ నేరుగా ఇంటికి వచ్చేది. ఇప్పుడు ఆన్లైన్ అంటారు, ఎన్ఐసీ సాఫ్ట్‌వేర్ అంటారు.. ఎందుకు ఇవన్నీ ఫెయిల్ అయ్యాయో రెవెన్యూ మంత్రి సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పేదలకు ఇచ్చిన లక్ష ఎకరాల ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను గుంజుకున్నారని హ‌రీశ్‌రావు ఆరోపించారు.

ఓట్ల కోసమే రైతుబంధు..

ప్రతిపక్షాల మీద పగబట్టడం, పేదల ఇళ్లు కూలగొట్టడం, కేసీఆర్ కట్టిన గుళ్లను కూడా కూలగొట్టడమే కాంగ్రెస్ ప్రభుత్వ పనిగా మారింది. వందల కోట్లు పెట్టి క్యాంప్ ఆఫీస్ కట్టుకోవచ్చు, వేల కోట్లతో పార్కులు కట్టొచ్చు, ఫుట్ బాల్ ఆడేందుకు డబ్బులుంటాయి, మూసీలో ఇళ్లు కూలగొట్టి వేల కోట్లు ఇవ్వడానికి డబ్బులుంటాయి.. కానీ రైతుల ఖాతాల్లో రైతుబంధు వేయడానికి మాత్రం రేవంత్ రెడ్డికి డబ్బులు లేవా..? కేసీఆర్ ఉన్నప్పుడు నమ్మకంగా నాట్లకు ముందే రైతుబంధు వచ్చేది. రేవంత్ రెడ్డి ఏమో కేవలం ఓట్ల కోసమే రైతుబంధు వేశాడు. ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఉంటే కచ్చితంగా రైతుబంధు వేసేవాడు అని మాజీ మంత్రి ఎద్దెవా చేశారు.

హైదరాబాద్‌కు మంచినీళ్ల కటకట..

నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులలో కాంగ్రెస్ ప్రభుత్వం అతి తక్కువ నీటిని వినియోగించుకుంటోంది. సాగర్, శ్రీశైలంలో ఆంధ్రప్రదేశ్ అడ్డగోలుగా మన నీళ్లను మళ్లిస్తుంటే రేవంత్ రెడ్డి గుడ్లప్పగించి చూస్తున్నాడు తప్ప ఆపడం లేదు. క‌ళ్ల గుడ్లు ఊడబీకుతా అని డైలాగులు కొట్టడం కాదు.. చేతనైతే కేంద్ర మంత్రి దగ్గర కూర్చుని ఆ నీటి దోపిడీని అడ్డుకో. ఇరిగేషన్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఇలాగే వదిలేస్తే రేపు హైదరాబాద్‌కు మంచినీళ్ల కటకట వస్తుంది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత సామాన్యుడిపై ధరల భారం పెంచడం నిత్యకృత్యంగా మారింది. పేదవాడు ఒక మోటార్ సైకిల్ కొనుక్కుంటే దాని మీద పదివేల రూపాయల లైఫ్ టాక్స్ పెంచారు. ఆర్టీసీ ఛార్జీలను డబుల్ చేశారు. ఈ రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రి, మంత్రుల ఆస్తులు పెరిగాయే తప్ప ప్రజలకు ఏ న్యాయం జరగలేదు. ధరలు పెంచడం, కమీషన్లు దంచుకోవడం తప్ప ఈ ప్రభుత్వానికి ఇంకేమీ రాదు అని హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు.

Advertisement
Advertisement