త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | బీఆర్ఎస్ గెలుపు.. కాంగ్రెస్ ప్ర‌జా వ్య‌తిరేక‌త‌కు నిలువెత్తు నిద‌ర్శ‌నం : హ‌రీశ్‌రావు

Harish Rao | రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేష‌న్ల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో 700 పైగా స్థానాల్లో బీఆర్ఎస్ గెలవ‌డం కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలనకు నిలువుటద్దం అని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

S

Telangana | Published On Feb 13, 2026, 6.58 pm IST

Harish Rao | బీఆర్ఎస్ గెలుపు.. కాంగ్రెస్ ప్ర‌జా వ్య‌తిరేక‌త‌కు నిలువెత్తు నిద‌ర్శ‌నం : హ‌రీశ్‌రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేష‌న్ల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో 700 పైగా స్థానాల్లో బీఆర్ఎస్ గెలవ‌డం కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలనకు నిలువుటద్దం అని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. రేవంత్ ప్రభుత్వం పట్ల రోజురోజుకూ పెరుగుతున్న ప్రజావ్యతిరేకతకు నిలువెత్తు నిదర్శనమ‌ని ఆయ‌న తెలిపారు.

అధికార కాంగ్రెస్ పార్టీ అక్రమాలు, దౌర్జన్యాలకు ఎదురొడ్డి కార్పొరేటర్లు, కౌన్సిలర్లుగా గెలిచి సత్తా చాటిన బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీ అరాచక, అప్రజాస్వామిక విధానాలకు తగిన రీతిలో బుద్ధి చెబుతూ, పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన గులాబీ నాయకులు, కష్టపడిన కార్యకర్తలు, సోషల్ మీడియా సైనికులందరికీ నా ప్రత్యేక అభినందనలు అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

అధికార పార్టీకి ఓటు అనే కొర‌డాతో ప్ర‌జ‌లు బుద్ధి చెప్పారు..

ముఖ్యమంత్రి, మంత్రులు సహా యావత్ ప్రభుత్వ యంత్రాంగం ఒక్కటై కొట్లాడినా మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపును అడ్డుకోలేకపోయారు. అధికార దుర్వినియోగం, డబ్బు రాజకీయాలు, బెదిరింపులు అన్నింటినీ తట్టుకుని గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం కాంగ్రెస్ అప్రజాస్వామిక పాలనకు చెంపపెట్టు. దాదాపు 700 పైగా వార్డుల్లో బీఆర్ఎస్ గెలుపు సాధించడం యాదృచ్ఛికం కాదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంపై రోజురోజుకూ పెరుగుతున్న ప్రజావ్యతిరేకతకు నిలువెత్తు నిదర్శనం. పల్లె, పట్టణం తేడా లేకుండా రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి మందగించింది. ఎన్నికల హామీలు గాలిలో కలిసిపోయాయి. సంక్షేమ పథకాలు అటకెక్కాయి. అందువల్లనే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి ఓటు అనే కొరడాతో ప్రజలు బుద్ధి చెప్పారని హ‌రీశ్‌రావు విమ‌ర్శించారు.

కాంగ్రెస్‌ను గ‌ద్దె దించే శ‌క్తి బీఆర్ఎస్‌కే ఉంది..

కాంగ్రెస్‌ను గద్దె దించే శక్తి ఒక్క బీఆర్ఎస్ కు మాత్రమే ఉందని, భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేది బిఆర్ఎస్ పార్టీనే అని మొన్న పంచాయితీ ఫలితాలు, నేడు మున్సిపల్ ఫలితాలు కుండబద్దలు కొట్టి చెప్పాయి. అధికార పక్షం దౌర్జన్యాలను ఎదుర్కొని, ప్రతిపక్షంలో ఉంటూ సాధించిన ఈ ఫలితాలు బిఆర్ఎస్ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. పాలన గాలికి వదిలి.. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయకుండా కాలం గడుపుతున్న రేవంత్ సర్కారు భారతం పడుతూనే ఉంటం. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ఫైఫల్యాలను ఎండగడుతూనే ఉంటం. ప్రజల ఆశీస్సులతో తెలంగాణలో గులాబీ జెండా ఎగురేసేందుకు నిర్విరామ పోరాటం చేస్తూనే ఉంటామ‌ని హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. చివర‌గా జై తెలంగాణ.. జై కేసీఆర్ అని నిన‌దించారు.

Advertisement
Advertisement