త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | 800 రోజుల పాల‌న‌లో చేసిందేమీ లేక‌.. 99 రోజుల ప్ర‌ణాళిక పేరిట మ‌రో డ్రామా : హ‌రీశ్‌రావు

Harish Rao | రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం 800 రోజుల పాల‌న‌లో చేసిందేమీ లేక‌.. 99 రోజుల ప్ర‌ణాళిక పేరిట మ‌రో డ్రామాకు రేవంత్ రెడ్డి తెర తీసిండు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. రెండున్న‌రేండ్ల పాల‌న త‌ర్వాత ప్ర‌గ‌తి ప్ర‌ణాళిక‌లు గుర్తుకు వ‌చ్చాయా..? అని నిల‌దీశారు.

S

Telangana | Published On Mar 6, 2026, 3.28 pm IST

Harish Rao | 800 రోజుల పాల‌న‌లో చేసిందేమీ లేక‌.. 99 రోజుల ప్ర‌ణాళిక పేరిట మ‌రో డ్రామా : హ‌రీశ్‌రావు
Advertisement

99 రోజుల యాక్ష‌న్ ప్లాన్ కేవ‌లం ఉత్తి దండ‌గ ప్ర‌చారం
గ్రామ‌స‌భ‌ల్లో తీసుకున్న ద‌ర‌ఖాస్తులు ఇంకా చెత్త‌బుట్ట‌ల్లోనే
ప‌ది నాట‌కాల‌తో ప్ర‌జ‌ల‌ను మోసం చేసేందుకు కాంగ్రెస్ సిద్ధం
దుర్మార్గ పాల‌న‌ను నిల‌దీసేందుకు గ్రామాల్లో ప్ర‌జ‌లు సిద్ధం

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం 800 రోజుల పాల‌న‌లో చేసిందేమీ లేక‌.. 99 రోజుల ప్ర‌ణాళిక పేరిట మ‌రో డ్రామాకు రేవంత్ రెడ్డి తెర తీసిండు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. రెండున్న‌రేండ్ల పాల‌న త‌ర్వాత ప్ర‌గ‌తి ప్ర‌ణాళిక‌లు గుర్తుకు వ‌చ్చాయా..? అని నిల‌దీశారు.

ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక పేరిట రేవంత్ సర్కారు చేస్తున్న 99 రోజుల ప్రచార ఆర్భాటంపై మాజీ మంత్రి హరీశ్ రావు ఎక్స్ వేదిక‌గా తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేశారు. యాక్షన్ ప్లాన్ పేరిట పాలనా వైఫల్యం నుండి దృష్టి మరల్చేందుకు డైవర్షన్ ప్లాన్ డ్రామాకు తెర తీశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల యాక్షన్ ప్లాన్ కేవలం ఉత్తి దండగ ప్రచార పర్వం తప్ప మరొకటి కాదు. అమలుకు నోచుకోని ఆరు గ్యారెంటీలు, పాలన వైఫల్యాలు, కోట్లు కొల్లగొట్టేందుకు చేసిన స్కాంలు, ప్రజల ఛీత్కారాల నుంచి దృష్టి మరల్చేందుకు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మరో డైవర్షన్ ప్లాన్ ఇది. గతంలో రెండుసార్లు నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభల్లో ప్రజల నుంచి తీసుకున్న లక్షలాది దరఖాస్తులు పరిష్కారం కాక ఇంకా చెత్తబుట్టల్లోనే మగ్గుతున్నాయి. ఆ దరఖాస్తులకు దిక్కు లేదు కానీ, మళ్లీ ఇప్పుడు పది వారాల పాటు పది రకాల నాటకాలతో ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దం కావడం సిగ్గు చేటు అని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు.

నమ్మించి గొంతు కోసిన ఈ మోసాల గురించి రైతులకు వివరిస్తారా?

రెండున్నరేండ్లలో అసలు ఏం చేశారని ప్రచారం నిర్వహిస్తున్నారు రేవంత్ రెడ్డి? గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించి మీ పైఫల్యాలు ప్రచారం చెప్పుకుంటారా? కోతల సమయం వచ్చినా ఈ సీజన్ ఇప్పటి వరకు రైతు భరోసా దిక్కు లేదు. గత సీజన్ పంట బోనస్ ఇవ్వక చేతులెత్తేశారు. చివరకు యూరియా కూడా సరఫరా చేయలేక రైతులను నడిరోడ్డు మీదకు ఈడ్చారు. నమ్మించి గొంతు కోసిన ఈ మోసాల గురించి రైతులకు వివరిస్తారా? అని హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు.

నిరుద్యోగులను ఎలా మోసం చేశారో వివరిస్తారా రేవంత్ రెడ్డి?

మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అని ఊదరగొట్టి, అధికారంలోకి వచ్చాక యువతను మోసం చేశారు. జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్ చేశారు. నోటిఫికేషన్లు ఇవ్వకుండా మూసీ బ్యుటిఫికేషన్ పేరిట లూటీకి తెగబడ్డారు. రాజీవ్ యువ వికాసం పేరిట తీసుకున్న దరఖాస్తులు దిక్కు లేకుండా పోయాయి. ఇప్పుడు యువతకు నైపుణ్య శిక్షణ కార్యక్రమం అంటూ కొత్త పాట పాడుతున్నారు. నిరుద్యోగులను ఎలా మోసం చేశారో వివరిస్తారా రేవంత్ రెడ్డి? అని హ‌రీశ్‌రావు నిల‌దీశారు.

మీ గారడీలను ప్రజలందరూ గమనిస్తున్నారు..

వారం వారం ఆరోగ్య రంగం, విద్యా రంగం, గ్రామీణాభివృద్ది అంటూ పేర్లు పెట్టి.. ఆసుపత్రుల్లో కనీసం మందుల్లేవని, బడుల్లో కనీస వసతులు కరువయ్యాయని, గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసిందని ఒప్పుకున్నారు. ప్రభుత్వ ఆఫీసుల్లో పారిశుధ్యం, పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ అనేది ప్రభుత్వ కనీస బాధ్యత కానీ, దానికి కూడా ఒక ఈవెంట్ లాగా కలర్ ఇవ్వడం ఈ ప్రభుత్వానికే చెల్లింది. ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందిన కొద్ది మందిని చూపిస్తామని గొప్పలు చెబుతున్న మంత్రులు.. అందని గ్యారెంటీల కోసం ఎదురుచూస్తున్న లక్షల మంది బాధితుల సంగతేంటో చెప్పాలి. సోలార్ విద్యుత్, పర్యావరణం, డ్రగ్స్ అడ్డుకట్ట లాంటివన్నీ పత్రికల్లో పబ్లిసిటీ ఇచ్చుకునేందుకు పెట్టుకున్న పేర్లు తప్ప, ఇందులో ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. మీ పాలనలో సగం కాలం పూర్తి కావొస్తున్నది. ఇంకా ఎన్ని రోజులు ఇలా ప్రచారాలతో ప్రజలను మభ్య పెడతారు? పాలన గాలికి వదిలి పబ్లిసిటీ పేరిట చేస్తున్న మీ గారడీలను ప్రజలందరూ గమనిస్తున్నారు. సంక్షేమం, అభివృద్దిని గాలికి వదలి ప్రజా పాలన మాటున కొనసాగిస్తున్న దుర్మార్గ పాలనను నిలదీసేందుకు గ్రామ గ్రామాన ప్రజలు సిద్దంగా ఉన్నార‌ని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

Advertisement
Advertisement