త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | ఆగ‌మైన కుల‌వృత్తులు.. మోస‌పోయిన మ‌త్స్య‌కారులు : హ‌రీశ్‌రావు

Harish Rao | తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం రాక‌తో కుల‌వృత్తులు ఆగ‌మైపోయాయి.. మ‌త్స్య‌కారులు మోస‌పోయారు అని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు.

S

Telangana | Published On Apr 28, 2026, 5.35 pm IST

Harish Rao | ఆగ‌మైన కుల‌వృత్తులు.. మోస‌పోయిన మ‌త్స్య‌కారులు : హ‌రీశ్‌రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం రాక‌తో కుల‌వృత్తులు ఆగ‌మైపోయాయి.. మ‌త్స్య‌కారులు మోస‌పోయారు అని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. మెద‌క్ జిల్లా రామాయంపేట మండ‌ల ప‌రిధిలో ముదిరాజ్ సామాజిక వ‌ర్గానికి చెందిన వంద మందికి పైగా నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు మాజీ ఎమ్మెల్యే ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో మాజీ మంత్రి హ‌రీశ్‌రావు స‌మ‌క్షంలో గులాబీ గూటికి చేరారు.

మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మెదక్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కంఠం రెడ్డి తిరుపతిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ సుప్రభాత రావు తేందర్, మాజీ ఎంపీపీ పుట్టి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కులవృత్తులను, చేతివృత్తులను పూర్తిగా చిన్నచూపు చూస్తోంది. బీఆర్ఎస్ హయాంలో మత్స్యకారుల సంక్షేమం కోసం వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేసి వలలు, మోపెడ్లు, త్రీ వీలర్స్ అందించాం. 4 వేల కొత్త సొసైటీలు ఏర్పాటు చేసి, 4 లక్షల మందికి కొత్త సభ్యత్వాలు ఇవ్వడంతో పాటు ఉచిత బీమా సౌకర్యం కల్పించాం. ఉచిత చేప పిల్లల పంపిణీ కోసం కేసీఆర్ ప్రభుత్వం ఏకంగా 850 కోట్ల రూపాయలు వెచ్చించింది. ఎండాకాలంలోనే టెండర్లు పూర్తి చేసి వర్షాలు పడే నాటికి చేప పిల్లలు సిద్ధంగా ఉంచేవాళ్లం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం, బడ్జెట్ కేటాయించకపోవడం వల్ల టెండర్లు ఆలస్యమై గత రెండేళ్లుగా చేప పిల్లల పంపిణీ జరగలేదు. దీంతో మత్స్యకారుల ఉపాధి దెబ్బతింది అని హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు.

ముదిరాజ్‌ల‌ను బీసీ- ఏలో చేరుస్తామని, బీసీలకు సబ్ ప్లాన్, 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసింది. కేసీఆర్ కోకాపేటలో కులవృత్తుల ఆత్మగౌరవ భవనాలకు స్థలాలు కేటాయిస్తే, ఈ రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వక పనులన్నీ నిలిచిపోయాయి. గొర్రెల పంపిణీ, చేనేతలకు రసాయనాల సబ్సిడీ లాంటి అద్భుతమైన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కేసీఆర్ మళ్లీ ఎప్పుడు వస్తారా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. అందుకే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలోకి వస్తున్నారని హ‌రీశ్‌రావు తెలిపారు.

Advertisement
Advertisement