త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | ఉచితాల పేరుతో అర‌చేతిలో వైకుంఠం.. రేవంత్‌పై హ‌రీశ్‌రావు ఫైర్

Harish Rao | మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పాలనలో పేదలకు అందిన సంక్షేమ పథకాలు కాంగ్రెస్ హయాంలో కుంటుపడ్డాయని మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు మరిచి.. ప్రజలను మోసం చేసిందని, ఉచితాల పేరు చెప్పి రేవంత్ ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపించిందని ఎద్దెవా చేశారు.

S

Telangana | Published On Feb 6, 2026, 4.32 pm IST

Harish Rao | ఉచితాల పేరుతో అర‌చేతిలో వైకుంఠం.. రేవంత్‌పై హ‌రీశ్‌రావు ఫైర్
Advertisement

ఉద్యోగులు బాధ‌ప‌డుతున్నారు..
మ‌గోళ్ల‌కు డ‌బుల్ టికెట్‌ రేట్లు..
కేసీఆర్‌ను పట్టుకొని బూతులు మాట్లాడుతున్న‌డు..
ఇదేనా సీఎం మాట్లాడే భాష‌..?
ప్ర‌జ‌ల కోసం ప‌ని చేసేవారిని ఎన్నుకోవాలి..
ఇస్నాపూర్‌లో మ‌హిళ‌ల‌కు హ‌రీశ్‌రావు పిలుపు

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్ పాలనలో పేదలకు అందిన సంక్షేమ పథకాలు కాంగ్రెస్ హయాంలో కుంటుపడ్డాయని మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు మరిచి.. ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఉచితాల పేరు చెప్పి రేవంత్ ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపించిందని ఎద్దెవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చే హామీలను నమ్మకుండా.... ప్రజల కోసం పని చేసే వారిని ఎన్నుకోవాలని హితవు పలికారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌లో నిర్వ‌హించిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో హ‌రీశ్‌రావు పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా హ‌రీశ్‌రావు మ‌హిళ‌ల‌తో ముఖాముఖి నిర్వ‌హించారు.

ఈ రాష్ట్రంలో పదేండ్ల కేసీఆర్ పాలన చూశారు.. ఈ రెండేళ్ల కాంగ్రెస్ పాలన చూస్తున్నారు. ఈ మధ్య కొంతమంది పంచాయతీ సెక్రటరీలు, ఉద్యోగులు నా దగ్గరకు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. వాళ్లతో నేను ఒక్కటే మాట అన్నా.. మీకు ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్, పర్మినెంట్ చేసింది కేసీఆర్, జీతాలు పెంచింది కేసీఆర్. కానీ ఆయన్ను ఓడగొట్టి కాంగ్రెస్ ను గెలిపించింది మీరే కదా అన్నాను. రేవంత్ రెడ్డి మాటలు నమ్మి మోసపోయామని ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేదని అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు గ్రహిస్తున్నారని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

రూ. 200 ఉన్న పెన్షన్ రూ. 2000 చేసింది కేసీఆర్. రేవంత్ రెడ్డి రూ. 4000 ఇస్తానని చెప్పి మోసం చేశాడు. ఈ 24 నెలల్లో ఒక్కో అవ్వతాతకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 52,000 బాకీ పడింది. అత్తా కోడలు ఇద్దరికీ రూ. 2500 ఇస్తానని చెప్పి ఇద్దరికీ మొండిచేయి చూపించాడు. ఉన్న కేసీఆర్ కిట్ బంద్ పెట్టాడు. కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తానని ఆశపెట్టి.. కేసీఆర్ ఇచ్చే లక్ష రూపాయల చెక్కును కూడా నెలల తరబడి ఆపుతున్నాడని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. కేసీఆర్ రాకముందు ఇస్నాపూర్‌లో పవర్ హాలిడేస్ ఉండేవి. కేసీఆర్ వచ్చాక 24 గంటల కరెంట్ ఇవ్వడంతో.. ఇక్కడ పరిశ్రమల్లో ఓటీలు దొరికి నాలుగు రూపాయలు సంపాదించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ కరెంట్ కోతలు మొదలయ్యాయి. ఫ్రీ బస్సు అని చెప్పి ఆటో వాళ్ళ పొట్ట కొట్టారు, మగోళ్లకు డబుల్ టికెట్ రేట్లు పెట్టి బాదుతున్నార‌ని సీఎంపై హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు.

కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన మహనీయుడు. అలాంటి పెద్దమనిషిని పట్టుకుని రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అసెంబ్లీలో పెన్షన్ ఎప్పుడు ఇస్తావ్ అని అడిగితే.. నీ లాగుల తొండలు తీస్తా అంటాడు. మహిళలకు రూ. 2500 అడిగితే పేగులు తీసి మెడలో వేసుకుంటా అంటాడు. తులం బంగారం ఏది అని అడిగితే గుడ్లు పీకి గోటీలు ఆడుతా అంటాడు. ఇదేనా ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష? అని హ‌రీశ్‌రావు నిల‌దీశారు. బతుకమ్మ చీరలు బంద్, క్రిస్టియన్-ముస్లింలకు ఇచ్చే కానుకలు బంద్, రైతుబంధు బంద్, దళిత బంధు బంద్, గొర్రెల పంపిణీ బంద్.. ఇలా కేసీఆర్ ఇచ్చినవన్నీ బంద్ పెట్టిన బంద్ల బాబు రేవంత్ రెడ్డి. ఇస్నాపూర్ మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. మీకు అందుబాటులో ఉండే వాళ్లకు, మీ భవిష్యత్తును బాగా చూసుకునే వాళ్లకు ఓటెయ్యాలి.
మనకు అన్నం పెట్టిన కేసీఆర్‌ను గుర్తు చేసుకోవాలి. ఇస్నాపూర్ అభివృద్ధి కొనసాగాలన్నా, పేదల సంక్షేమ పథకాలు మళ్ళీ రావాలన్నా కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి. మనల్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పండ‌ని హ‌రీశ్‌రావు సూచించారు.

సిగాచి పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో చనిపోయిన 54 మంది కార్మికులకు ఇప్పటి వరకు నష్టపరిహారం ఇవ్వలేదు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు ఇస్తానన్న రేవంత్.. కార్మికులను మోసం చేశాడు. ప్రజలకు ద్రోహం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, బీజేపీలను నమ్మొద్ద‌ని హ‌రీశ్‌రావు వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement