త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Uttam Kumar Reddy | ప్రతి రూపాయి రైతులు, నిర్వాసితుల ఖాతాల్లో చేరాలి

Uttam Kumar Reddy | భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ పరిహారంగా ప్రభుత్వం విడుదల చేసిన ప్రతి రూపాయి భూములు కోల్పోయిన రైతులు, నిర్వాసితుల ఖాతాల్లోకే చేరాలని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. కలెక్టర్ల పీడీ ఖాతాల్లో నిధులు ఉండిపోవడం వల్ల ప్రయోజనం లేదని, లబ్ధిదారులకు చెల్లింపుల్లో పరిపాలనా జాప్యానికి తావులేదన్నారు.

P

Telangana | Published On Aug 21, 2026, 5.58 pm IST

Uttam Kumar Reddy | ప్రతి రూపాయి రైతులు, నిర్వాసితుల ఖాతాల్లో చేరాలి
Advertisement
  • సీఎం సంకల్పించిన లక్ష్యం నెరవేరాలి
  • భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ పరిహారం చెల్లింపుల్లో కలెక్టర్లు మిషన్‌ మోడ్‌లో పనిచేయాలి
  • తక్షణమే పంపిణీకి సిద్ధంగా ఉన్న దాదాపు రూ.1,200 కోట్లు
  • ముందే అవార్డులు, టోకెన్ల ప్రక్రియ పూర్తి చేయాలి
  • పరిపాలనా జాప్యానికి తావులేదు..
  • ఒకటి రెండు రోజుల్లోనే చెల్లింపులు
  • అటవీ అనుమతుల అడ్డంకులను యుద్ధప్రాతిపదికన తొలగించాలి
  • మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy | భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ పరిహారంగా ప్రభుత్వం విడుదల చేసిన ప్రతి రూపాయి భూములు కోల్పోయిన రైతులు, నిర్వాసితుల ఖాతాల్లోకే చేరాలని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. కలెక్టర్ల పీడీ ఖాతాల్లో నిధులు ఉండిపోవడం వల్ల ప్రయోజనం లేదని, లబ్ధిదారులకు చెల్లింపుల్లో పరిపాలనా జాప్యానికి తావులేదన్నారు. అవసరమైన పత్రాలు, లబ్ధిదారుల వివరాలు సిద్ధంగా ఉన్న చోట ఒకటి రెండు రోజుల్లోనే చెల్లింపులు పూర్తి చేయాలని ఆదేశించారు. నీటిపారుదల ప్రాజెక్టులకు అడ్డంకిగా ఉన్న భూసేకరణ, పునరావాసం–పునర్నిర్మాణం (ఆర్‌అండ్‌ఆర్‌), అటవీ అనుమతులపై శుక్రవారం జిల్లా కలెక్టర్లు, చీఫ్‌ ఇంజినీర్లు, ఉన్నతాధికారులతో మంత్రి అత్యవసర వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి సంకల్పించిన రూ.5 వేల కోట్ల నిధుల లక్ష్యం క్షేత్రస్థాయిలో నెరవేరేలా అధికారులు మిషన్‌ మోడ్‌లో పనిచేయాలని సూచించారు.

రూ.1,200 కోట్లు సిద్ధం

భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ కోసం ఇప్పటివరకు రూ.2,782 కోట్లు విడుదల కాగా.. రూ.566 కోట్లు లబ్ధిదారులకు చెల్లించినట్లు అధికారులు తెలిపారు. మరో రూ.989 కోట్లు వివిధ దశల్లో ఉండగా, రూ.199 కోట్లు జిల్లాల వద్ద అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఈ లెక్కల ప్రకారం దాదాపు రూ.1,200 కోట్లను తక్షణమే లేదా స్వల్ప పరిపాలనా ప్రక్రియ అనంతరం పంపిణీ చేసే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ఈ మొత్తాన్ని అత్యవసరంగా రైతులు, నిర్వాసితుల ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించారు. మరో రూ.455 కోట్లకు సంబంధించిన టోకెన్లు క్లియర్‌ అయి తదుపరి ప్రక్రియలో ఉన్నట్లు వెల్లడైంది.

ముందే అవార్డులు, టోకెన్లు

నిధులు పీడీ ఖాతాల్లోకి వచ్చిన తర్వాత భూసేకరణ ప్రక్రియ ప్రారంభించే పద్ధతికి స్వస్తి పలకాలని ఉత్తమ్‌ సూచించారు. కన్సెంట్‌ అవార్డులు, అవార్డు నంబర్లు, టోకెన్ల జనరేషన్‌ తదితర ప్రక్రియలను ముందుగానే పూర్తి చేయాలన్నారు. అవసరమైన నిధుల విడుదలకు నీటిపారుదల శాఖ ఆర్థిక శాఖతో సమన్వయం చేస్తుందని తెలిపారు. జగిత్యాల జిల్లాలో ఇప్పటికే జమ చేసిన భూసేకరణ నిధులను ఒకటి రెండు రోజుల్లో పంపిణీ చేయాలని ఆదేశించారు. సిద్దిపేట జిల్లాలో మల్లన్నసాగర్‌ ఫీడర్‌ కెనాల్‌ తదితర పనులకు అవసరమైన సుమారు 180 ఎకరాల భూసేకరణకు కన్సెంట్‌ అవార్డుల ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. మహబూబాబాద్‌ జిల్లాలో మున్నేరు–పాలేరు లింక్‌ కెనాల్‌కు సంబంధించిన అవార్డులు, సవరించిన పరిహార అంచనాలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

అటవీ అనుమతులు వేగవంతం

అటవీ అనుమతుల కారణంగా ప్రాజెక్టు పనులు నిలిచిపోకుండా రెవెన్యూ, నీటిపారుదల, అటవీ శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. పెండింగ్‌ అంశాలపై కలెక్టర్లు సంయుక్త సమావేశాలు నిర్వహించి వెంటనే పరిష్కరించాలన్నారు. డిండి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌తో పాటు ఇతర ప్రాజెక్టుల అటవీ సమస్యలను సమీక్షించారు. ‘‘ప్రాజెక్టులకు భూములిచ్చిన రైతు పరిహారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగకూడదు. నిధులున్నప్పుడు పరిపాలనా జాప్యంతో బాధితులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండకూడదు. ప్రాజెక్టు ముందుకు సాగాలి.. రైతుకు న్యాయం జరగాలి’’ అని ఉత్తమ్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Advertisement
Advertisement