త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Garima Agrawal | వేసవిలో 45 రోజులు కీలకం.. సమస్య రావొద్దు.. అధికారులకు కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశం..

Garima Agrawal | వేసవిలో రానున్న 45 రోజులు అత్యంత కీలకమని రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలలో తాగునీరు నిరంతరాయంగా సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. చివరి గ్రామం వరకూ ఇబ్బందులు లేకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

P

Telangana | Published On Apr 22, 2026, 6.45 pm IST

Garima Agrawal | వేసవిలో 45 రోజులు కీలకం.. సమస్య రావొద్దు.. అధికారులకు కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశం..
Advertisement

Garima Agrawal | సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలతో పాటు జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో తాగునీరు నిత్యం సరఫరా చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. వేసవికాలం నేపథ్యంలో జిల్లాలో తాగునీరు సరఫరాపై ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, మిషన్ భగీరథ, నీటి పారుదల శాఖ పబ్లిక్ హెల్త్ అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో బుధవారం కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. తొలుత మున్సిపాలిటీలు, అన్ని మండలాల వారీగా మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సరఫరా లక్ష్యం? సరఫరా అవుతోంది ఎంత? స్థానికంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, మిషన్ భగీరథ ఏఈలను అడిగి తెలుసుకున్నారు.

ప్రణాళికతో ముందుకెళ్లాలి..

తాగునీరు సరఫరా కోసం ఇంకా ఏమి కావాలో ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ ప్రతి మున్సిపాలిటీ, గ్రామాల్లో తాగునీరు సరఫరా, పారిశుధ్య పనులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. వేసవి నేపథ్యంలో రానున్న 45 రోజులు చాలా కీలకమని, మిషన్ భగీరథ ద్వారా లక్ష్యం మేరకు నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీలోని ప్రతి వార్డు, విలీన ప్రాంతాలు, అన్ని మండలాల్లోని గ్రామాలు, చివరి ప్రాంతాలకు నీరు సరఫరాలో ఎక్కడా ఇబ్బంది రాకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఆదేశించారు. నీటి టాంక్‌లు, పైప్‌లైన్‌ల లీకేజీ లేకుండా చూడాలని, ఇన్‌టెక్‌ వెల్‌, వాటర్ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లలో మోటార్లు ఎప్పుడూ నడిచేలా ఏర్పాట్లు చేసుకోవాలని, ఇబ్బందులు లేకుండా ముందస్తుగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. నీటి పారుదల శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్ట్‌లో నీటి మట్టాన్ని పరిశీలిస్తూ ముందుకు వెళ్లాలని సూచించారు.

ట్యాంకులను శుభ్రం చేయాలి..

నీటి సరఫరాలో ఎక్కడైనా ఇబ్బందులు వస్తే స్థానికంగా ఉన్న వనరులను వినియోగించాలని తెలిపారు. నీటిని రోజూ క్లోరినేషన్ చేయించాలని, ప్రతి పది రోజులకు ఒకసారి నీటి ట్యాంక్స్‌ శుభ్రం చేయించాలని ఆదేశించారు. అమృత్ పథకం కింద జిల్లాలో మొదలు పెట్టిన ఓహెచ్ఎస్ఆర్‌ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. గడువులోగా పనులు పూర్తి చేసి.. వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే జిల్లా అధికార యంత్రం దృష్టికి తీసుకురావాలన్నారు. సమావేశంలో మిషన్ భగీరథ ఎస్ఈ అమరేందర్, మిషన్ భగీరథ ఈఈలు అన్వర్, సుమలత, పబ్లిక్ హెల్త్ ఈఈ సంపత్, డీఆర్డీఓ గీత, సీపీఓ శ్రీనివాసాచారి, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి షర్ఫుద్దీన్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement