త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Edupayala Jatara | మ‌హాశివ‌రాత్రి జాత‌రకు ముస్తాబైన ఏడుపాయ‌ల‌..

Edupayala Jatara | రాష్ట్రంలో మేడారం తర్వాత అతిపెద్ద జాతరగా ఏడుపాయల వన దుర్గాదేవి జాతర (Edupayala Jatara) ప్ర‌సిద్ధికెక్కింది. మ‌హాశివ‌రాత్రి (Maha Shivarathri) సంద‌ర్భంగా మూడు రోజుల‌పాటు జ‌రిగే ఈ జాత‌ర‌కు సుముహూర్తం ఆస‌న్న‌మైంది.

G

Telangana | Published On Feb 14, 2026, 5.57 am IST

Edupayala Jatara | మ‌హాశివ‌రాత్రి జాత‌రకు ముస్తాబైన ఏడుపాయ‌ల‌..
Advertisement

Edupayala Jatara | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో మేడారం తర్వాత అతిపెద్ద జాతరగా ఏడుపాయల వన దుర్గాదేవి జాతర (Edupayala Jatara) ప్ర‌సిద్ధికెక్కింది. మ‌హాశివ‌రాత్రి (Maha Shivarathri) సంద‌ర్భంగా మూడు రోజుల‌పాటు జ‌రిగే ఈ జాత‌ర‌కు సుముహూర్తం ఆస‌న్న‌మైంది. ఈ నెల 15న ప్రారంభ‌మై 17న ముగియ‌నుంది. జాతరలో తొలిరోజు మహాశివరాత్రి పండగను పురస్కరించుకుని భక్తులు మంజీరా నదీ (Manjeera River) పాయల్లో పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. ఆ తర్వాత వన దుర్గమ్మను (Vanadurga Bhavani) దర్శించుకుంటారు.

రెండో రోజైన ఫిబ్రవరి 16న జాతరలో ముఖ్య ఘట్టమైన బండ్ల ఉత్సవాన్ని అత్యంత కోలాహలంగా నిర్వహిస్తారు. ఈ వేడుక‌కు ఏడుపాయల చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తమ ఎడ్లబండ్లను రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలతో అలంకరించి తీసుకువస్తారు. వాటిని ఆలయం చుట్టూ ప్రదర్శనగా తిప్పుతూ తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఇక ఫిబ్రవరి 17న జరిగే రథోత్సవంతో జాత‌ర ముగుస్తుంది.

జాతరకు సిద్దిపేట, సంగారెడ్డి, నిజామాబాద్, వికారాబాద్, కామారెడ్డి జిల్లాలతో పాటు హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు త‌ర‌లివ‌స్తారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా లక్షలాదిమంది భక్తులు వస్తారు.

ఆలయ విశిష్టత

మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వద్ద గోదావ‌రి ఉప‌న‌ది అయిన‌ మంజీరా ఏడు పాయలుగా విడిపోయిన ప్రదేశం మధ్యలో వన దుర్గ ఆలయం వెలసింది. అందుకే ఈ క్షేత్రానికి ఏడుపాయ‌ల అనే పేరు వ‌చ్చింది. ఏడు పాయలుగా విడిపోయిన మంజీరా నది.. అమ్మవారి పాదాల‌ను తాకుతూ గుడిని దాటిన త‌ర్వాత మళ్లీ కలిస్తుంది. పేరుకు త‌గిన‌ట్లే ప్ర‌కృతి సౌంద‌ర్యం మ‌ధ్య ఈ ఆల‌యం వెల‌సింది.

ఈ ఆల‌యానికి మహాభారత కాలం నాటి పురాణ గాథలతో ముడిపడిన చారిత్రక నేపథ్యం ఉంది. వ్యాస మహాభారతం ప్రకారం.. పాండవుల వనవాసానికి వెళ్లిన‌ప్పుడు అర్జునుడు కౌరవ సేనపై విజయం సాధించడానికి దుర్గాదేవి ఆశీర్వాదం కోసం ఈ ఆలయాన్ని నిర్మించాడని స్థల పురాణం ద్వారా తెలుస్తున్న‌ది.

 

Advertisement
Advertisement