త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Devi Prasad | ప్రభుత్వానికి నచ్చిన నివేదిక ఇస్తే దేశభక్తులు.. నిజాలు చెబితే నేరస్థులా?: దేవీప్ర‌సాద్‌

Devi Prasad | ఇంజినీర్ల‌ను బెదిరించి చ‌రిత్ర‌ను మార్చ‌లేర‌ని సీఎం రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) బీఆర్ఎస్ నాయ‌కుడు దేవీప్ర‌సాద్ (Devi Prasad) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలంగాణ ఉద్యమానికి మేధస్సును అందించినవారు ఉద్యమకారులైతే, శాస్త్రీయ బలాన్ని అందించినవారు తెలంగాణ ఇంజినీర్లు (Telangana Engineers) అని చెప్పారు.

G

Telangana | Published On Jul 13, 2026, 12.47 pm IST

Devi Prasad | ప్రభుత్వానికి నచ్చిన నివేదిక ఇస్తే దేశభక్తులు.. నిజాలు చెబితే నేరస్థులా?: దేవీప్ర‌సాద్‌
Advertisement

Devi Prasad | త్రినేత్ర‌.న్యూస్‌: ఇంజినీర్ల‌ను బెదిరించి చ‌రిత్ర‌ను మార్చ‌లేర‌ని సీఎం రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) బీఆర్ఎస్ నాయ‌కుడు దేవీప్ర‌సాద్ (Devi Prasad) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలంగాణ ఉద్యమానికి మేధస్సును అందించినవారు ఉద్యమకారులైతే, శాస్త్రీయ బలాన్ని అందించినవారు తెలంగాణ ఇంజినీర్లు (Telangana Engineers) అని చెప్పారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ పాలనలో తెలంగాణకు జరిగిన నీటి దోపిడీ, సాగునీటి వివక్ష, ప్రాజెక్టుల విధ్వంసాన్ని దేశం ముందు సాంకేతిక ఆధారాలతో నిరూపించిన ఘనత తెలంగాణ ఇంజినీర్లదని స్ప‌ష్టం చేశారు. అలాంటి రిటైర్డ్ ఇంజినీర్లను తెలంగాణ ఇంజనీర్స్ డే రోజున శుభాకాంక్షలు చెప్పాల్సిన సంగతిని మరచిపోయి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కేవలం వారినే కాదు, తెలంగాణ (Telangana)ఉద్యమాన్నే అవమానించడమ‌ని మండిప‌డ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) కోసం రేయింబవళ్లు శ్రమించిన ఇంజినీర్లు నేడు కన్నీరు పెట్టుకోవాల్సిన పరిస్థితిని సృష్టించడం కాంగ్రెస్ ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమ‌ని ధ్వ‌జ‌మెత్తారు. తెలంగాణ రైతాంగానికి శాశ్వత సాగునీరు అందించాలనే లక్ష్యంతో తమ జీవితాలను అంకితం చేసిన నిపుణులను నేడు నిందితుల్లా చిత్రీకరించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని వెల్ల‌డించారు.

తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత తెలంగాణ అవసరాలకు సరిపోదని, నీటి లభ్యత మెరుగ్గా ఉన్న మేడిగడ్డ వద్ద ప్రాజెక్టును (Medigadda) నిర్మించాలని సెంట్రల్ వాటర్ కమిషన్‌తో (CWC) పాటు తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్లు ప్రభుత్వానికి స్పష్టంగా సూచించార‌ని గుర్తుచేశారు. ఆ సాంకేతిక నివేదికలు, అధ్యయనాల ఆధారంగానే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని స్ప‌ష్టం చేశారు. ఇవి ఏ ఒక్క వ్యక్తి ఇష్టానుసారం తీసుకున్న నిర్ణయాలు కావన్నారు. ఇప్పుడు అదే ఇంజినీర్లను బెదిరిస్తూ, మాజీ సీఎం కేసీఆర్‌పై (KCR) రాజకీయ కక్షసాధింపునకు అనుగుణంగా నివేదికలు ఇవ్వాలని పరోక్షంగా హెచ్చరించడం అత్యంత ప్రమాదకర ధోరణి అన్నారు. ప్రభుత్వానికి నచ్చిన నివేదిక ఇస్తే దేశభక్తులు.. నిజాలు చెబితే నేరస్థులా? ఇదేనా కాంగ్రెస్ చెప్పే ప్రజాస్వామ్యం? అని ప్ర‌శ్నించారు.

అవి తెలంగాణ ఆత్మ‌గౌర‌వ ప్ర‌తీక‌లు..

గతంలో రిటైర్డ్ ఇంజినీర్లు ప్రభుత్వ నిర్ణయాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన సందర్భాల్లో కేసీఆర్ ప్రభుత్వం వారితో చర్చించింది, వారి సూచనలను గౌరవించిందన్నారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ప్రశ్నించిన వారిని బెదిరించడం, భయపెట్టడం, కేసులతో మౌనం పాటింపజేయాలని ప్రయత్నించడం హిట్లర్ పాలనను తలపిస్తున్న‌ద‌ని మండిప‌డ్డారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ (Mission Bhageeratha), కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారామ, సమ్మక్కసాగర్ వంటి చారిత్రాత్మక ప్రాజెక్టులు కేవలం కాంక్రీటు నిర్మాణాలు కావని, అవి తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకలని చెప్పారు. ఆ ప్రాజెక్టుల కోసం పనిచేసిన ఇంజినీర్లు జీతాల కోసం మాత్రమే పని చేయలేద‌న్నారు. తెలంగాణ రైతు కన్నీరు తుడవాలనే లక్ష్యంతో, ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలని, నీటి స్వావలంబన సాధించాలనే సంకల్పంతో తమ జీవితాలను అంకితం చేశారు. అలాంటి వారిని అవమానించడం ప్రతి తెలంగాణవాదిని అవమానించడమేన‌ని వెల్ల‌డించారు.

రాజ్యాంగ విలువలను ధిక్కరించడమే..

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలకు మేధావులు, శాస్త్రవేత్తలు, నిపుణులు, రిటైర్డ్ అధికారులు సలహాలు ఇవ్వడం సహజమ‌ని చెప్పారు. వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత. కానీ ప్రభుత్వానికి నచ్చని అభిప్రాయాలు చెబితే అరెస్టు చేస్తామని హెచ్చరించడం, కిరాయి కమిటీలను నిందించడం రాజ్యాంగ విలువలను ధిక్కరించడమేన‌న్నారు. సీఎం రేవంత్ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్లకు (Telangana Retired Engineers) బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని విశ్వసించే ప్రతి వర్గం ఈ అహంకార ధోరణికి ప్రజాస్వామ్యబద్ధంగా గట్టి సమాధానం చెబుతుందని హెచ్చ‌రించారు. తెలంగాణ కోసం జీవితాలను అంకితం చేసిన ఇంజినీర్ల గౌరవాన్ని కాపాడటం ప్రతి తెలంగాణ పౌరుడి బాధ్యత అని చెప్పారు.

Advertisement
Advertisement