త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

El Niño | ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించాలి.. క‌లెక్ట‌ర్ల‌కు సీఎస్ ఆదేశాలు

El Niño | రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు శనివారం జిల్లా కలెక్టర్లు, ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం మేరకు వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంపై జిల్లాల వారీగా అవగాహన సమావేశాలు నిర్వహించనున్న నేపథ్యంలో వాటి ఏర్పాట్లను ఆయన సమీక్షించారు.

P

Telangana | Published On Jul 18, 2026, 8.59 pm IST

El Niño | ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించాలి.. క‌లెక్ట‌ర్ల‌కు సీఎస్ ఆదేశాలు
Advertisement

El Niño | రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు శనివారం జిల్లా కలెక్టర్లు, ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం మేరకు వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంపై జిల్లాల వారీగా అవగాహన సమావేశాలు నిర్వహించనున్న నేపథ్యంలో వాటి ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల్లో మంత్రులు పర్యటించి అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించనున్నట్లు తెలిపారు. రైతులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత వర్గాలతో సమావేశమై ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసి, వర్షాభావ ప్రభావాన్ని తగ్గించే చర్యలపై సూచనలు చేయనున్నట్లు వెల్లడించారు.

ఈ నెల 20న జరిగే జిల్లా స్థాయి సమావేశాలకు ప్రత్యేక అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావం వల్ల ఈ ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయంపై పడే ప్రభావం, ఎదురయ్యే సవాళ్లపై రైతులకు స్పష్టమైన అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని చెప్పారు. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఇప్పటికే తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని సంజయ్ జాజు పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టేలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రమాదాలను తగ్గించేందుకు పంటల వైవిధ్యీకరణ (క్రాప్ డైవర్సిఫికేషన్)పై రైతులను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. రైతులకు శాస్త్రీయ, సాంకేతిక సమాచారాన్ని సమర్థవంతంగా చేరవేసేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు. కేవలం అవగాహన కల్పించడమే కాకుండా రైతులు వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వ అధికారులతో నేరుగా మాట్లాడే అవకాశం కూడా ఈ సమావేశాల్లో కల్పించనున్నట్లు చెప్పారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులపై సందేహాలు నివృత్తి చేసుకుని, పంటల ఎంపిక, సాగు విధానాలపై సరైన నిర్ణయాలు తీసుకునేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు.

ఉమ్మడి జిల్లాల పరిధిలోని అన్ని జిల్లా కలెక్టర్లు సమావేశాల్లో తప్పనిసరిగా పాల్గొనాలని, వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక, సాగునీరు తదితర శాఖల సీనియర్ అధికారులు కూడా హాజరుకావాలని ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. రైతులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు, విస్తరణాధికారులు, మీడియా ప్రతినిధులు, ఇతర భాగస్వాములు అధిక సంఖ్యలో పాల్గొనేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు, ప్రత్యేక అధికారులకు సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వికాస్ రాజ్, దానకిశోర్, నవీన్ మిట్టల్, బెన్‌హర్ ఎక్కా, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement