త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chief Secretary | జ‌యేశ్ రంజ‌న్‌.. వికాస్‌రాజ్‌.. కొత్త సీఎస్‌గా సీఎం రేవంత్ ఎంపిక‌చేసేది ఎవ‌రినో?

Chief Secretary | సీనియ‌ర్ ఐఏఎస్‌లు రేసులో ఉన్న‌ప్ప‌టికీ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాత్రం ఓ అధికారి ప‌ట్ల సానుకూలంగా ఉన్న‌ట్లు తెలుస్తున్న‌ది. ఆయ‌న‌కే పట్టం కట్టవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సీనియ‌ర్ అధికారి అయిన ఆయ‌న‌కు వేగంగా నిర్ణ‌యాలు తీసుకుంటార‌నే పేరున్న‌ది.

G

Telangana | Published On Jun 15, 2026, 8.16 am IST

Chief Secretary | జ‌యేశ్ రంజ‌న్‌.. వికాస్‌రాజ్‌.. కొత్త సీఎస్‌గా సీఎం రేవంత్ ఎంపిక‌చేసేది ఎవ‌రినో?
Advertisement

Chief Secretary | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కే. రామ‌కృష్ణారావు (CS Ramakrishna Rao) ఈ నెల 30న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. దీంతో త‌దుప‌రి చీఫ్ సెక్రెట‌రీ (Chief Secretary) ఎవ‌ర‌నే అంశంపై జోరుగా చ‌ర్చ జ‌రుగుతున్న‌ది. సీనియ‌ర్ ఐఏఎస్‌లు రేసులో ఉన్న‌ప్ప‌టికీ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాత్రం ఓ అధికారి ప‌ట్ల సానుకూలంగా ఉన్న‌ట్లు తెలుస్తున్న‌ది. ఆయ‌న‌కే పట్టం కట్టవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సీనియ‌ర్ అధికారి అయిన ఆయ‌న‌కు వేగంగా నిర్ణ‌యాలు తీసుకుంటార‌నే పేరున్న‌ది. ఆయ‌నే జ‌యేశ్ రంజ‌న్ (Jayesh Ranjan). ప్ర‌స్తుతం పురపాలక శాఖ (క్యూర్‌ ఏరియా) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప‌నిచేస్తున్నారు. ఆయనతో పాటు రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ (Chief Secretary) పేరు సైతం వినిపిస్తున్న‌ది.

సీనియార్టీలో వారిద్ద‌రు..

వీరిద్ద‌రిలో ఒకరిని సీఎస్‌గా నియమించే అవకాశం అధికంగా ఉంది. అయితే సీనియారిటీ ప్రకారం శంశాక్ గోయ‌ల్‌, అర‌వింద్ కుమార్ ముందున్నారు. 1990వ బ్యాచ్‌కు చెందిన శశాంక్‌ గోయల్ ప్ర‌స్తుతం ఢిల్లీలో తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఆయన వచ్చే సెప్టెంబర్‌ 30న పదవీ విరమణ చేయ‌నున్నారు. మరో మూడు నెలల సర్వీసు కాలం మాత్రమే మిగిలి ఉంది. కాంగ్రెస్ స‌ర్కార్ కొలువుదీరి రెండున్న‌రేండ్లు పూర్త‌య్యాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు మ‌రో రెండు సంవ‌త్స‌రాల కాలం మాత్ర‌మే మిగిలి ఉంది. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, ప‌నుల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించాల్సి ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ఎక్కువ కాలం ప‌నిచేసే అధికారివైపు ప్ర‌భుత్వం మొగ్గుచూప‌వ‌చ్చు. ఇక సీనియారిటీలో రెండో స్థానంలో ఉన్న 1991 బ్యాచ్‌కు చెందిన‌ అరవింద్‌కుమార్ ఫార్ములా ఈ–కారు రేసు కేసులో చిక్కుకుని కొంత కాలంగా సస్పెన్షన్‌లో ఉన్నారు. దీంతో ఆయ‌న‌ను ప్ర‌భుత్వం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకునే అవ‌కాశం లేదు.

ముందు వ‌రుస‌లో..

1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన జయేశ్‌ రంజన్‌ (1992) సీనియార్టీలో ఆ త‌ర్వాతి స్థానంలో ఉన్నారు. ఆయన 2027 సెప్టెంబర్‌ 30న రిటైర్ కానున్నారు. ఏదైనా పని అప్పగిస్తే అత్యంత వేగంగా ఫలితాన్ని తెచ్చి చూపిస్తార‌ని, దూకుడుగా నిర్ణ‌యాలు తీసుకుంటార‌ని పేరున్న‌ది. అయితే ఆయ‌న సామాన్యుల‌కు అందుబాటులో ఉండ‌ర‌నే విమ‌ర్శ కూడా ఉన్న‌ది. సీనియారిటీలో జయేశ్‌ తర్వాత సంజయ్‌జాజు (1992) ఉన్నారు. ప్ర‌స్తుతం డిప్యూటేషన్‌పై కేంద్రంలో పనిచేస్తున్నారు. ఆయన 2029 ఫిబ్రవరి 28న రిటైర్‌ కానుండగా, రాష్ట్రానికి తిరిగి వ‌స్తారో, లేదో తెలియాల్సి ఉంది.

వివాద‌ర‌హితుడు..

సీఎస్ రేసులో ఉన్న మ‌రో సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి వికాస్‌రాజ్‌. 1992 బ్యాచ్‌కు చెందిన ఆయ‌న‌కు వివాదరహితుడిగా పేరున్న‌ది. ఆయ‌న 2028 మార్చి 31న పదవీ విరమణ చేయనున్నారు. చురుగ్గా నిర్ణయాలు తీసుకోకుండా నాన్చుతారనే అభిప్రాయం ఉన్న‌ది. ఒక‌వేళ జ‌యేశ్ రంజ‌న్‌ను కాద‌ని భావిస్తే ప్ర‌భుత్వం వికాస్‌రాజ్‌ను సీఎస్‌గా నియమించే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

 

Advertisement
Advertisement