త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | రైతు డేటా, కొనుగోళ్లకు సమగ్ర వ్యవస్థ

CM Revanth Reddy | రైతులకు విత్తనాల సరఫరా నుంచి పండిన పంటల కొనుగోలు వరకు ప్రతి దశను సమగ్ర ప్రణాళికతో అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పంట సాగు ప్రారంభం నుంచే రైతుల వివరాలు, పంట విస్తీర్ణం, దిగుబడి అంచనాలు, కొనుగోళ్ల వరకు పూర్తిస్థాయి డేటా వ్యవసాయ శాఖ వద్ద ఉండాలని స్పష్టం చేశారు.

P

Telangana | Published On Jun 16, 2026, 5.48 pm IST

CM Revanth Reddy | రైతు డేటా, కొనుగోళ్లకు సమగ్ర వ్యవస్థ
Advertisement
  • వ్య‌వ‌సాయ‌రంగానికి డిజిట‌ల్ హంగులు
  • విత్త‌నాల పంపిణీ నుంచి ధాన్యం కొనుగోళ్ల వ‌ర‌కు ప‌ర్య‌వేక్ష‌ణ
  • ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు
  • ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలో వ‌ర్షాలు, ఖ‌రీఫ్ సీజ‌న్ స‌న్న‌ద్ధ‌త‌పై స‌మీక్ష‌

CM Revanth Reddy | రైతులకు విత్తనాల సరఫరా నుంచి పండిన పంటల కొనుగోలు వరకు ప్రతి దశను సమగ్ర ప్రణాళికతో అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పంట సాగు ప్రారంభం నుంచే రైతుల వివరాలు, పంట విస్తీర్ణం, దిగుబడి అంచనాలు, కొనుగోళ్ల వరకు పూర్తిస్థాయి డేటా వ్యవసాయ శాఖ వద్ద ఉండాలని స్పష్టం చేశారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావుతో కలిసి నిర్వహించిన సమీక్షలో సీఎం ఈ ఆదేశాలు జారీ చేశారు. వర్షాల పరిస్థితి, ఖరీఫ్ సీజన్ సన్నద్ధతపై విస్తృతంగా చర్చించారు.

కార్యాచ‌ర‌ణ‌కు ఆదేశం..

ధాన్యం కొనుగోళ్లలో గత అనుభవాలను సమీక్షించిన సీఎం, రైతులు ఎక్కడా ఇబ్బంది పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతు కమిషన్, అగ్రికల్చర్ యూనివర్సిటీ, వ్యవసాయ నిపుణుల సూచనలను పరిగణనలోకి తీసుకుని కొత్త కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. కొనుగోలు వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి వ్యవసాయ శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో వ్యవసాయ శాఖ డైరెక్టర్, పౌర సరఫరాల శాఖ ఎండీ, ప్రణాళిక శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ విత్తనాల పంపిణీ నుంచి ధాన్యం కొనుగోలు వరకు ప్రతి దశను పర్యవేక్షించనుంది. గ్రామస్థాయిలో రైతులు వేసే పంటలు, విస్తీర్ణం, ఉత్పత్తి అంచనాలు వంటి వివరాలను క్షేత్రస్థాయిలో నమోదు చేసి డిజిటల్ వ్యవస్థలోకి తీసుకురావాలని సీఎం సూచించారు.

కొనుగోళ్లు సాఫీగా జ‌ర‌గాల‌ని..

కనీస మద్దతు ధరలు, కేంద్ర కోటాల ప్రకారం కొనుగోళ్లు సాఫీగా జరగాలని ఆదేశించిన సీఎం, అకాల వర్షాలు, రవాణా, తూకం, నిల్వ వంటి అంశాలకు ముందుగానే కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. సన్న వడ్లకు బోనస్ అమలులో ఉన్న నేపథ్యంలో ఏడు రకాల సన్న వడ్ల విత్తనాలను రైతు వేదికల వద్ద అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు. సబ్సిడీపై విత్తనాల పంపిణీ చేయాలని, సన్న వడ్లు పండించే రైతులపై పూర్తి డేటా సేకరించాలని చెప్పారు. రైతు వేదికలను ఇకపై పూర్తి స్థాయి సేవా కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. అక్కడే విత్తనాలు, ఎరువుల కొనుగోలు, రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి రైతు వేదిక వద్ద వ్యవసాయం, రెవెన్యూ, పోలీస్ శాఖల నుంచి ఒక్కో అధికారి అందుబాటులో ఉండాలని ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో చేపట్టిన ఏఐ పైలట్ ప్రాజెక్ట్ ఫలితాలను అధ్యయనం చేసి వ్యవసాయ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని విస్తరించాలని సీఎం సూచించారు.

యాప్ బుకింగ్ వ్య‌వ‌స్థ‌..

ఎరువుల పంపిణీలో పారదర్శకత కోసం యాప్ ద్వారా బుకింగ్ వ్యవస్థను అమలు చేయాలని నిర్ణయించారు. రైతు వేదికల ద్వారా యూరియా పంపిణీ జరగాలని, జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్లు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఖరీఫ్‌కు అవసరమైన యూరియా సరఫరాపై కేంద్రంతో నిరంతరం సమన్వయం కొనసాగించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సీఎం సూచించారు. రామగుండం ఎరువుల కర్మాగారం ఉత్పత్తి రాష్ట్రానికి ఎక్కువగా కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పారు. అవసరమైతే అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించి ఢిల్లీ స్థాయిలో విజ్ఞప్తి చేయాలని ఆదేశించారు. మార్క్‌ఫెడ్ పనితీరుపై సమీక్షించిన సీఎం, వ్యాపార ఒత్తిడులకు లోబడకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించడం వల్ల మొక్కజొన్న కొనుగోళ్లలో నష్టాలు తగ్గించగలిగామని పేర్కొన్నారు. అలాగే ఆయిల్‌ఫెడ్‌ను లాభదాయకంగా తీర్చిదిద్దాలని, ప్రభుత్వ డైరీని బలోపేతం చేసి పాల రైతులకు చెల్లింపులు సమయానికి చేయాలని ఆదేశించారు.

Advertisement
Advertisement