త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | కుమ్రంభీంలో రూ.112కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌ శంకుస్థాపన

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. జిల్లాలో మొత్తం రూ.112.14 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. అనంతరం కాగజ్‌నగర్‌లో నిర్వహించిన ‘ప్రజా పాలన – ప్రగతి బాట’ బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు.

P

Telangana | Published On Jun 1, 2026, 10.16 pm IST

CM Revanth Reddy | కుమ్రంభీంలో రూ.112కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌ శంకుస్థాపన
Advertisement

CM Revanth Reddy | కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. జిల్లాలో మొత్తం రూ.112.14 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. అనంతరం కాగజ్‌నగర్‌లో నిర్వహించిన ‘ప్రజా పాలన – ప్రగతి బాట’ బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. ఈ సందర్భంగా రూ.56.55 కోట్ల వ్యయంతో కౌటాలాలో నిర్మించిన 132/33 కేవీ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. అలాగే, చింతలమనేపల్లి గ్రామంలో రూ.4.22 కోట్లతో గుడ్లబోరి గ్రామంలో రూ.2.98 కోట్లతో, కాపువాడలో రూ.3.08 కోట్లతో, చింతకుంటలో రూ.2.89 కోట్లతో, అంకుషాపూర్‌లో రూ.2.72 కోట్లతో నిర్మించనున్న 33/11 కేవీ సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన చేశారు. రెబ్బెన మండలం నంబాల గ్రామంలో రూ.6 కోట్లతో ఏర్పాటు చేయనున్న 2 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌కు కూడా శంకుస్థాపన చేశారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రూ.15 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు కూడా శ్రీకారం చుట్టారు.

బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధిలో ముందంజలో నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గిరిజన, ఆదివాసీ కుటుంబాలు ఆత్మగౌరవంతో జీవించే పరిస్థితులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. పేదలకు పక్కా ఇళ్లు కావాలన్న గిరిజనుల విజ్ఞప్తిపై స్పందించి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు, ఐటీడీఏ ప్రాంతాలకు అదనంగా 21 వేల ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో గూడేలలో ఒక్క గుడిసె కూడా కనిపించకూడదన్నదే తమ సంకల్పమని సీఎం స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి గిరిజన గూడెంకు అవసరమైన ఇళ్లను మంజూరు చేస్తామని చెప్పారు. ఇళ్లు లేని కుటుంబాల జాబితాను సిద్ధం చేసి అందించాలని, ఇళ్లు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో బిల్లుల విడుదలలో ఎలాంటి జాప్యం చేయలేదని సీఎం తెలిపారు. ఇప్పటికే లక్ష ఇళ్లకు గృహప్రవేశాలు నిర్వహించామని, సెప్టెంబర్ 17 నాటికి మరో లక్ష ఇళ్లకు గృహప్రవేశాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆదేశించినట్లు వెల్లడించారు. రెండో విడతలో మరో 2.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణంపై కూడా సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్ జిల్లాకు ఆశించిన ప్రయోజనం దక్కలేదని, అందుకే తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించి రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ విషయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాసినా స్పందన రాలేదని తెలిపారు. రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకుని మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాలని కోరారు. ధాన్యం కొనుగోలు అంశంపై కూడా సీఎం కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 75 లక్షల క్వింటాళ్ల వరిధాన్యాన్ని సేకరించిందని, కానీ కేంద్రం కొనుగోలుకు ముందుకు రావడం లేదన్నారు. కనీస మద్దతు ధర ప్రకటించినప్పటికీ వడ్లు, మక్కలను కొనడం లేదని ఆరోపించారు. తెలంగాణ సేకరించిన ధాన్యం, తడిసిన వడ్లు, మక్కలను కేంద్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జూన్ 15లోపు కేంద్రం స్పందించకపోతే రైతులతో కలిసి కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, ఎన్ని క్వింటాళ్ల ధాన్యం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. తడిసిన ప్రతి గింజను కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని సీఎం స్పష్టం చేశారు.

Advertisement
Advertisement