త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | ఆడ‌బిడ్డ‌ల‌ను నిల‌బెట్టే బాధ్య‌త నాది : సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy | మహిళా శక్తిని ఆర్థికంగా బలోపేతం చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. మండల మహిళా సమాఖ్యల (MMS) ఆధ్వర్యంలో నిర్వహించనున్న 553 బస్సులను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి మంగ‌ళవారం హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు.

P

Telangana | Published On Jun 9, 2026, 6.50 pm IST

CM Revanth Reddy | ఆడ‌బిడ్డ‌ల‌ను నిల‌బెట్టే బాధ్య‌త నాది : సీఎం రేవంత్‌రెడ్డి
Advertisement

CM Revanth Reddy | మహిళా శక్తిని ఆర్థికంగా బలోపేతం చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. మండల మహిళా సమాఖ్యల (MMS) ఆధ్వర్యంలో నిర్వహించనున్న 553 బస్సులను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి మంగ‌ళవారం హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, మహిళా స్వయం సహాయక సంఘాల (SHG) సభ్యులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మహిళా సాధికారతపై పలు వ్యాఖ్యలు చేశారు. మహిళలను లక్ష్మీదేవితో సమానంగా మన సంస్కృతి గౌరవిస్తుందని పేర్కొన్నారు. భూమిని భూమాతగా, దేశాన్ని భారతమాతగా, రాష్ట్రాన్ని తెలంగాణ తల్లిగా భావించే సంప్రదాయం మనదని అన్నారు. మహిళలకు ఓటు హక్కు కల్పించి రాజకీయ హక్కులు ఇచ్చిన ఘనత నెహ్రూదేనని ఆయన గుర్తుచేశారు.

రాష్ట్రపతిగా, మంత్రులుగా మహిళలకు అవకాశాలు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు. గత ప్రభుత్వం మొదటి ఐదేళ్లలో ఒక్క మహిళకైనా మంత్రి పదవి ఇవ్వలేదని, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కూడా మహిళను పార్టీ అధ్యక్షురాలిగా నియమించలేదని సీఎం వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మహిళలు మంత్రులు, కార్పొరేషన్ ఛైర్మన్లు, మునిసిపల్ చైర్మన్లు, మేయర్లుగా రాణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కోసం 2013లో సోనియా గాంధీ పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో 33 శాతం మహిళలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో కీలక పాత్ర పోషించబోతున్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వం మహిళలకు ఇవ్వాల్సిన సున్నా వడ్డీ రుణాలను చెల్లించలేదని విమర్శించిన సీఎం, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని మంజూరు చేసినట్లు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని, దీని ద్వారా వారు విద్య, ఉద్యోగాల కోసం సులభంగా ప్రయాణిస్తున్నారని చెప్పారు. కొందరు ఈ పథకాన్ని వ్యతిరేకించినప్పటికీ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదని స్పష్టం చేశారు. పాఠశాలల్లో యూనిఫామ్ కుట్టుపనులు మహిళా సంఘాలకు అప్పగించామని, పెట్రోల్ బంక్‌ల నిర్వహణకు మహిళలను ప్రోత్సహిస్తున్నామని సీఎం తెలిపారు. అదానీతో పోటీ పడేలా సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్వహణలో కూడా మహిళలను భాగస్వామ్యం చేస్తున్నామని చెప్పారు. హైటెక్ సిటీలో స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు 106 స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళా సంఘాలను కోటి మందికి పెంచి, వారిని కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.

ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్నదే మా లక్ష్యం. ఈ వేదికగా మాట ఇస్తున్నాన‌ని, కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే బాధ్యత నాద‌ని సీఎం రేవంత్ వ్యాక్యానించారు. 2034 వరకు ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వం కొనసాగుతుందని, వెయ్యి కాదు మూడు వేల బస్సుల వరకు మహిళలను యజమానులను చేస్తామన్నారు. వ్యవసాయంలో అన్ని రకాల పంటలకు ప్రాధాన్యత ఇవ్వాల‌ని, అన్ని రకాల పంటలను వేసేలా రైతులకు అవగాహన క‌ల్పించాల‌ని సూచించారు. ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టేందుకు శాయశక్తులా ప్ర‌య‌త్నిస్తాన‌ని సీఎం హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా మహిళా శక్తి, మహాలక్ష్మి పథకాల్లో భాగంగా స్వయం సహాయక సంఘాలు, మండల మహిళా సమాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి చెక్కులను అందజేశారు. 553 బస్సుల అద్దె ఛార్జీల కింద తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) నుంచి మండల మహిళా సమాఖ్యలకు రూ.20.34 కోట్ల చెక్కును ఆయన విడుదల చేశారు. ఒక్కో బస్సుకు నెలకు రూ.69,468 చొప్పున అద్దె చెల్లింపులు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఈ బస్సుల నిర్వహణకు సంబంధించిన అద్దె మొత్తంగా రూ.20.34 కోట్లు అందించిన‌ట్లు తెలిపారు. ఇదే కార్యక్రమంలో వడ్డీ లేని రుణాల కింద రూ.500 కోట్ల చెక్కును కూడా సీఎం విడుదల చేశారు. అంతేకాకుండా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆదా చేసిన రూ.10,700 కోట్లను సూచించే చెక్కును అందజేశారు.

Advertisement
Advertisement