త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shankar Goud | ఆర్టీసీ డ్రైవ‌ర్ శంక‌ర్‌గౌడ్ మృతి.. సీఎం రేవంత్‌, బండి సంజయ్ దిగ్భ్రాంతి

Shankar Goud | నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ (Shankar Goud) మృతిపై సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం తరఫున అన్నివిధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

G

Telangana | Published On Apr 24, 2026, 9.25 am IST

Shankar Goud | ఆర్టీసీ డ్రైవ‌ర్ శంక‌ర్‌గౌడ్ మృతి.. సీఎం రేవంత్‌, బండి సంజయ్ దిగ్భ్రాంతి
Advertisement

Shankar Goud | త్రినేత్ర‌.న్యూస్‌: నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ (Shankar Goud) మృతిపై సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం తరఫున అన్నివిధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. శంకర్‌గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం, మనోబలం కలగాలని ప్రార్థించారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబాన్ని దుఃఖసాగరంలో ముంచింద‌ని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోద్దని సీఎం విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని, వారి సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేస్తుందని గుర్తు చేశారు.

కాగా, గురువారం మ‌ధ్యాహ్నం న‌ర్సంపేట డిపోలో పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్న శంక‌ర్ గౌడ్‌.. హైద‌రాబాద్‌లోని డీఆర్‌డీవో అపోలో ద‌వాఖానలో చికిత్స పొందుతూ మరణించారు. తెల్లవారుజామున పోస్ట్ మార్టం నిర్వహించిన డాక్టర్లు.. శంకర్ గౌడ్ మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాసేపట్లో ఆయ‌న‌ మృతదేహాన్ని వరంగల్ జిల్లా నర్సంపేటకు త‌ర‌లించారు.

ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే: బండి సంజ‌య్‌

శంక‌ర్ గౌడ్ మరణంపట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచంద్రరావు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యేనని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులు సమస్యలతో అల్లాడుతుంటే రెండేండ్ల‌ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా గాలికొదిలేయడంతోపాటు వారిని బెదిరింపులకు గురిచేయడంవల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులకు అండగా నిలవాలని బీజేపీ నిర్ణయించినట్లు రామచంద్రరావు తెలిపారు. అందులో భాగంగా ఈరోజు నర్సంపేటలో జరిగే శంకర్ గౌడ్ అంత్యక్రియలకు బీజేపీ పక్షాన బండి సంజయ్ హాజరవుతారని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులెవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దని విజ్ఞ‌ప్తి చేశారు.

ప్ర‌భుత్వ నిరంకుశ‌త్వంతోనే..: క‌విత‌

రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిరంకుశత్వానికి నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ బలయ్యారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఆయ‌న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. శంక‌ర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీయడంతో కార్మికులు సమ్మెకు వెళ్తే.. దానిని భగ్నం చేయడానికి ప్రభుత్వం చేస్తున్న కుతంత్రాలను చూడలేక శంకర్ గౌడ్ నిన్న పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. గురువారం అర్ధ‌రాత్రి కొన ఊపిరితో కంచన్ బాగ్ డీఆర్డీవో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయ‌న‌ను పరామర్శించడానికి హాస్పిట‌ల్ లోపలికి వెళ్లకుండా ఈ ప్రభుత్వం అడ్డుకున్నది. ఆస్పత్రి నుంచి డాక్టర్‌ను బయటికి పంపి శంకర్ గౌడ్ 80 శాతం కాలిన గాయాలతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని చెప్పిపిచ్చింది. తెల్లవారే సరికి ఆయ‌న మరణించినట్టుగా ప్రకటించారు. ఇది ముమ్మాటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్యేన‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నట్టుగా శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులకు రూ.2 కోట్ల ఎక్స్‌గ్రేషియా చెల్లించాల‌న్నారు. కుటుంబ సభ్యుల్లో ఒకకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నేడు డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క కార్మికులతో జరిపే చర్చల్లో వారి ప్రధాన డిమాండ్లు అయిన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, సంస్థలో యూనియన్లను పునరుద్ధరించడం సహా ఇతర డిమాండ్లను నెరవేర్చాలన్నారు.

 

Advertisement
Advertisement