త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | ఆరు నూరైనా.. అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిచినా.. మూసీ ప్రాజెక్టు ఆగదు: సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy | ఆరు నూరైనా.. అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిచినా.. మూసీ ప్రాజెక్టు ఆగద‌ని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) చెప్పారు. ఇది శివ‌దీక్ష అని, రామప్ప శివుడి సాక్షిగా మూసీ ప్రక్షాళన చేసి ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశీగా తీర్చిదిద్దుతామ‌ని స్ప‌ష్టం చేశారు.

G

Telangana | Published On Mar 28, 2026, 11.36 am IST

Revanth Reddy | ఆరు నూరైనా.. అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిచినా.. మూసీ ప్రాజెక్టు ఆగదు: సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: ఆరు నూరైనా.. అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిచినా.. మూసీ ప్రాజెక్టు ఆగద‌ని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) చెప్పారు. ఇది శివ‌దీక్ష అని, రామప్ప శివుడి సాక్షిగా మూసీ ప్రక్షాళన చేసి ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశీగా తీర్చిదిద్దుతామ‌ని స్ప‌ష్టం చేశారు. మూసీ నదిని బాగు చేయాలని గతంలో అనేక మంది ప్రయత్నించారని, ఈ అవకాశం తమ ప్రభుత్వానికి దక్కడం అదృష్టమని చెప్పారు. ఈ కార్యక్రమం బాధ్యతే కాదు, పవిత్రమైన కార్యమని వెల్ల‌డించారు. మూసీ న‌ది పున‌రుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా మంచిరేవుల వ‌ద్ద ఓంకారేశ్వ‌ర ఆల‌య నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాప‌న చేశారు. అనంత‌రం మాట్లాడుతూ.. మంచిరేవులలో ఓంకారేశ్వర ఆలయ నిర్మాణ కార్యక్రమం దేవుడి నిర్ణయమన్నారు. ఓంకారేశ్వర ఆలయాన్ని నిర్మించడం భగవత్ కార్యంగా భావిస్తున్నామని చెప్పారు. నదీ జలాలను సరిగా వాడుకోకుంటే ఎంతో నష్టమని, తెలిసో తెలియకో నదులను కలుషితం చేస్తున్నామన్నారు. కాలుష్యంతో వచ్చే సమస్యలేంటో ఢిల్లీని చూస్తే తెలుస్తుంద‌న్నారు. ఈశ్వరుడి ఆశీర్వాదంతో మూసీ నది ప్రక్షాళన చేస్తామని, ఎవరైనా అడ్డుపడితే రాష్ట్ర ప్రభుత్వం శివతాండవం చేస్తుందని హెచ్చరించారు.

`ఒక చారిత్రాత్మక మందిరాన్ని నిర్మించుకోవడం ఒక చారిత్రక సందర్భం. ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఇది జరుగుతుందని అనుకోవట్లేదు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. ఇది దైవేచ్ఛతో జరుగుతున్న కార్యక్రమం. 8 ఎకరాల్లో 700 కోట్లతో ఆలయాలను అభివృద్ధి చేస్తున్నాం. ఈ ప్రాంతానికి 1400 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ చరిత్ర కనుమరుగు కాకుండా భవిష్యత్ తరాలకు అందించాలన్నదే మా ప్రభుత్వ ఆలోచన. మూసీ నది పునరుజ్జీవింపై చాలా మంది ప్రయత్నించారు. కారణాలు ఏవైనా ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేదు. ఆ అవకాశం మనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నాం. విమర్శలు వచ్చినా, అడ్డంకులు సృష్టించినా దేవుడే వాటిని తొలగిస్తాడు.

చరిత్ర కనుమరుగయ్యే పరిస్థితి..

తెలంగాణ పౌరులకు నా విజ్ఞప్తి ఒక్కటే. చరిత్రను గమనిస్తే నది పరీవాహకంలోనే నాగరికత అభివృద్ధి చెందింది. సముద్ర పరీవాహకంలో వ్యాపారం, ఆర్ధిక అభివృద్ధి జరిగింది. దేశంలో సముద్రపు ఒడ్డు లేని రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. మూసా, ఈసా నదులు ఉన్నా సరైన విధంగా ఉపయోగించుకోలేదు. మానవ తప్పిదాలతోనే మూసీ కాలుష్యకారకంగా మారింది. గొప్ప చరిత్ర కలిగిన హైదరాబాద్ చరిత్ర కనుమరుగయ్యే పరిస్థితి దాపురించింది. ఢిల్లీ లాంటి నగరాల్లో కాలుష్యంతో జన జీవనం స్తంభించిన పరిస్థితి. అలాంటి నగరాల నుంచి మనం నేచుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ కారణాలతో మూసీ పునరుజ్జీవనంను అడ్డుకోవడం ఏ సంస్కృతి?.

హైదరాబాద్ నగరం మత సామరస్యానికి వేదిక. మూసీ పరీవాహకంలో చారిత్రక శివాలయాన్ని పునర్నిర్మించాలని ఈశ్వరుని ఆశీర్వాదంతో పనులు మొదలుపెట్టాం. దీనిపై పెడర్ధాలు తీసి విమర్శించే వారిపై ప్రజలే శివతాండవం చేస్తారు. మూసీ పరివాహకంలో మతసామరస్యానికి చిహ్నంగా ఒక మసీదు, నాగోల్ ప్రాంతంలో ఒక చర్చిని నిర్మించబోతున్నాం. గోదావరి జలాలను తరలించి మూసీలో నిరంతరం నీరు పారేలా చర్యలు తీసుకుంటున్నాం.

గ్రీన్ ట్రిబ్యూనల్‌లో కేసును వెనక్కి తీసుకోండి..

మూసీ కాలుష్యంతో నల్లగొండ జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ ప్రజల కష్టాలు చూడలేని వారు రాయి కంటే కఠినాత్ములు. మానవ తప్పిదాలను సరిద్దిద్దకపోతే చరిత్ర మనల్ని క్షమించదు. మూసీ పరివాహక ప్రజాప్రతినిధులు మూసీ ప్రక్షాళన చెయ్యాల్సిందే అని రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇస్తున్నారు. కానీ తాము చేయలేనిది ఎవరూ చేయొద్దనే అక్కసుతో కొందరు అడ్డుకోవాలని చూస్తున్నారు. ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదంతో ఎన్నో పదవులు అనుభవించిన ఆ అక్క కొడుకు అభివృద్ధిని అడ్డుకోవడానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేశారు. ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకునే వారికి ప్రజా ప్రతినిధిగా ఉండే అర్హత ఉందా. మా అక్కకు ఈ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నా.. నీ పుత్రరత్నం నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్‌లో వేసిన కేసును వెనక్కి తీసుకోండి. లేకపోతే ప్రజలే మిమ్మల్ని సామాజిక బహిష్కరణ చేస్తారు.

మీ వెనక ముసుగు తొడుక్కున్న వారికి కూడా చెబుతున్నా… ఇలాగే వ్యవహరిస్తే ఇప్పుడున్న స్థానం కూడా వారికి ఉండదు. ఆరు నూరైనా.. అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిచినా.. ఈ ప్రాజెక్టు ఆగదు.. ఇది శివదీక్ష. రామప్ప శివుడి సాక్షిగా మూసీ ప్రక్షాళన చేసి ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశీగా తీర్చిదిద్దుతాం. ఇది ఓట్ల కోసం.. నోట్ల కోసం చేస్తున్న పని కాదు. ఇది చరిత్రలో దేవుడి ఇచ్చిన గొప్ప అవకాశం. ఇది ప్రజల పట్ల మాకున్న చిత్తశుద్ధి.. ప్రజలే మాకు దేవుళ్లు. అంతిమంగా వారి ఆకాంక్షల మేరకే ముందుకు వెళతాం.` అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement