త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana CAG Report 2026 | రేవంత్ సర్కార్ ‘ఆర్థిక మోసాలు’ బట్టబయలు: కాగ్ (CAG) రిపోర్టుతో కాంగ్రెస్ బండారం బయటపెట్టిన డాక్టర్ శ్రవణ్ దాసోజు

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కాగ్ (CAG) నివేదిక సంచలనం రేపుతోంది. కేవలం 60 రోజుల్లోనే రాష్ట్రం 5 వేల కోట్ల లోటులోకి వెళ్లిందని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు.

J

Telangana | Published On Jun 18, 2026, 9.10 pm IST

Telangana CAG Report 2026 | రేవంత్ సర్కార్ ‘ఆర్థిక మోసాలు’ బట్టబయలు: కాగ్ (CAG) రిపోర్టుతో కాంగ్రెస్ బండారం బయటపెట్టిన డాక్టర్ శ్రవణ్ దాసోజు
Advertisement
  • మే 2026 నాటి కాగ్ (CAG) నివేదిక ఆధారంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఆర్థిక విధానాలపై బీఆర్ఎస్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్ర విమర్శలు
  • రూ.6,857 కోట్ల మిగులు బడ్జెట్ చూపిస్తే, కేవలం రెండు నెలల్లోనే ఖజానా రూ.5,038 కోట్ల లోటు (Revenue Deficit) లోకి పడిపోయిందని ఆరోపణ
  • ఈ ఏడాదంతటికీ సరిపడే అప్పుల కోటాలో 18 శాతాన్ని (రూ.10,595 కోట్లు) కేవలం 60 రోజుల్లోనే ప్రభుత్వం వాడేసిందని మండిపాటు
  • ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలకు నిధులెక్కడివని, వెంటనే ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో శ్వేతపత్రం (White Paper) విడుదల చేయాలని డిమాండ్

Telangana CAG Report 2026 | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నది పాలన కాదని, రాష్ట్ర అంగడి అమ్మకం అని బీఆర్ఎస్ (BRS) సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసిందని చెప్పేందుకు కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) విడుదల చేసిన తాజా 'మే 2026' నివేదికే పక్కా సాక్ష్యమంటూ ఆయన అంకెలతో సహా కాంగ్రెస్ (Congress) ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. కాంగ్రెస్ చెబుతున్న 'తెలంగాణ రైజింగ్', '3 ట్రిలియన్ ఎకానమీ' అంతా డొల్ల వ్యవహారమేనని ఆయన విమర్శించారు.

గాల్లో కలిసిన 'రెవెన్యూ మిగులు' (Revenue Surplus)

2026-27 బడ్జెట్‌లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏకంగా రూ. 6,857.76 కోట్ల భారీ రెవెన్యూ మిగులు ఉంటుందని గొప్పలు చెప్పిందని, కానీ వాస్తవానికి ఆ రంగుల కల కరిగిపోయిందని శ్రవణ్ విమర్శించారు. కాగ్ నివేదిక ప్రకారం.. కేవలం 60 రోజుల్లోనే (ఏప్రిల్, మే) రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏకంగా రూ. 5,038.34 కోట్ల రెవెన్యూ లోటు (Revenue Deficit) లోకి మునిగిపోయిందని వెల్లడించారు. రెండు నెలల్లోనే ఖజానాను ఐదు వేల కోట్ల పైచిలుకు లోటులోకి నెట్టేసిన వాళ్లు.. రాష్ట్రాన్ని ఆర్థిక పవర్‌హౌస్‌గా ఎలా మారుస్తారని ఆయన సూటిగా ప్రశ్నించారు.

60 రోజుల్లోనే 18% అప్పులు స్వాహా!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (Financial Year) గానూ చట్టబద్ధంగా చేయాల్సిన నికర అప్పుల (Net Borrowings) పరిమితి రూ. 58,458.71 కోట్లుగా ఉంటే.. కేవలం ఏప్రిల్, మే నెలల్లోనే ఈ సర్కార్ ఏకంగా రూ. 10,595.98 కోట్లు అప్పు చేసిందని డాక్టర్ శ్రవణ్ దాసోజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే ఏడాది మొత్తానికి ఇచ్చిన కోటాలో 18.13% అప్పులను రెండు నెలల్లోనే మింగేశారని ఆయన మండిపడ్డారు. దసరా-దీపావళి పండుగలు రాకముందే రాష్ట్రం అప్పుల పరిమితిని దాటి దివాళా తీయడం ఖాయమన్నారు. ఒకవేళ జపాన్ ఏజెన్సీ (JICA) లాంటి సంస్థలు మెట్రో కోసం లోన్లు ఇచ్చి ఉంటే.. రాష్ట్ర బ్యాలెన్స్ షీట్ అప్పుడే అడ్రస్ లేకుండా పోయేదన్నారు.

ఆదాయ మార్గాలకు గండి - ఢిల్లీ దౌత్యం ఫెయిల్

రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్నారు. ముఖ్యమంత్రి ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లినా కేంద్ర గ్రాంట్లు (Grants-in-Aid) ఆశించిన స్థాయిలో రాలేదని ఎద్దేవా చేశారు.

గ్రాంట్ల కొరత: బడ్జెట్‌లో రూ.24,166 కోట్లు కేంద్ర గ్రాంట్లు వస్తాయని చూపిస్తే, ఇప్పటివరకు వచ్చింది కేవలం రూ. 544.99 కోట్లు (2.26%) మాత్రమేనని వివరించారు.

మద్యం మాయాజాలం: ఇక ఎక్సైజ్ డ్యూటీల (Excise Duties) ద్వారా రూ. 27,668.48 కోట్ల లక్ష్యానికి గానూ.. కేవలం రూ. 3,348.55 కోట్లు (12.10%) రావడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రతి గల్లీలో వైన్ షాపులు కిటకిటలాడుతుంటే ప్రభుత్వానికి ఆదాయం ఎందుకు రావడం లేదని, దీని వెనుక 'షాడో లిక్కర్ సిండికేట్లు' ప్రభుత్వ సొమ్మును దోచేస్తున్నాయా అని ఆయన ప్రశ్నించారు.

పన్నుయేతర ఆదాయం డీలా: పన్నుయేతర ఆదాయం (Non-Tax Revenue) కేవలం 5.05% దగ్గరే ఆగిపోయిందని, ప్రభుత్వ భూముల అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయం (Land Revenue) కేవలం రూ. 0.19 కోట్లుగా నమోదైందని కాగ్ రిపోర్టు ఆధారంగా వివరించారు.

డాక్టర్ దాసోజు డిమాండ్లు ఇవే

రాష్ట్రాన్ని కాగితపు సిరి (Paper Prosperity) తో భ్రమింపజేస్తూ, లోపల అప్పుల సమాధి (Debt Grave) చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి ఆయన కీలక డిమాండ్లు వినిపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 వాగ్దానాలను ఏ నిధులతో, ఎలా అమలు చేస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. "తెలంగాణ రైజింగ్" అంటూ చేస్తున్న తప్పుడు ప్రచారాలను వెంటనే ఆపాలని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తక్షణమే అసెంబ్లీలో 'సమగ్ర శ్వేతపత్రం' (White Paper) విడుదల చేయాలని డాక్టర్ శ్రవణ్ దాసోజు స్పష్టం చేశారు.

Advertisement
Advertisement