త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | ఇది సిట్ విచారణ కాదు.. చిట్టి నాయుడి విచారణ!

KTR | ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హ‌రీశ్‌రావుకు సిట్ నోటీసులు ఇచ్చి విచార‌ణ‌కు పిల‌వ‌డాన్ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఇది సిట్ విచార‌ణ కాదు.. చిట్టి నాయుడి విచార‌ణ అని ఆయ‌న విమ‌ర్శించారు.

S

Telangana | Published On Jan 20, 2026, 4.20 pm IST

KTR | ఇది సిట్ విచారణ కాదు.. చిట్టి నాయుడి విచారణ!
Advertisement

1000 సిట్‌లు వేసినా భయపడేది లేదు!
ఫోన్ ట్యాపింగ్ ఓ డ్రామా..
రేవంత్ బావ‌మ‌రిది కోసం సింగ‌రేణి టెండ‌ర్లు రిగ్గింగ్
బొగ్గు కుంభ‌కోణంలో కిష‌న్ రెడ్డి మౌనం ఎందుకు..?
లీకుల మీద ఇంకెన్ని రోజులు బతుకుతావ్
పోలీసు అధికారులు భవిష్యత్తులో బలి అవుతారు.. జ‌ర జాగ్ర‌త్త‌..!
రేవంత్ రెడ్డి హార్వర్డ్ వెళ్లి ఏం చేస్తాడో అర్థమైత‌లేదు.. 
బీఆర్ఎస్ గద్దెలను ముట్టుకుంటే మాడి మసైపోతావ్

KTR | త్రినేత్ర‌.న్యూస్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హ‌రీశ్‌రావుకు సిట్ నోటీసులు ఇచ్చి విచార‌ణ‌కు పిల‌వ‌డాన్ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఇది సిట్ విచార‌ణ కాదు.. చిట్టి నాయుడి విచార‌ణ అని ఆయ‌న విమ‌ర్శించారు. రేవంత్.. నువ్వు ఇంకో 1,000 సిట్‌లు వేసినా.. ఎంత శునకానందం పొందినా భయపడేది లేదు! నిన్ను వదిలి పెట్టేదిలేదు అని రేవంత్‌ను కేటీఆర్ హెచ్చ‌రించారు. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం తెలంగాణ భ‌వ‌న్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వం ఇచ్చిన నోటీసులకు బాధ్యతాయుతమైన నాయకుడిగా హరీష్ రావు ఈరోజు హాజరయ్యారు. రేవంత్ రెడ్డికి డబ్బుల కట్టలతో దొరికిన నేరచరిత్ర ఉన్నది. అదే విధంగా అందరికీ అది అంటించాలని చూస్తున్నాడు. అడ్డగోలు సిట్ విచారణల పేరుతోనే ఎన్ని రకాల తమాషాలు చేసినా కాంగ్రెస్ పార్టీ హామీల వైఫల్యం, పరిపాలన వైఫల్యంపై ప్రశ్నిస్తూనే ఉంటాం. అధికారం అందలం ఎక్కిచ్చిన బుద్ధి మాత్రం బురదలోనే రేవంత్ రెడ్డిదే ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కామ్ గ్రేస్.. ఒక మంత్రి 20 శాతం, ఇంకో మంత్రి బ్యాగ్ మాన్.. రేవంత్ రెడ్డి డబ్బుల సంచి పంపించినట్లు ఉన్నారు అందుకే భ‌ట్టి విక్ర‌మార్క మౌనంగా ఉన్నార‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

ఎన్ని రోజులు ఇలా బతుకుతావు?

ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఒక్క అధికారి కూడా ఇప్పటిదాకా ఎందుకు బయటకు మాట్లాడలేదు? కేవలం లీకులు ఇచ్చి ఎన్ని రోజులు ఇలా బతుకుతావు? ఎలాంటి ఆధారాలు లేకుండా, అధికారిక సమాచారం లేకుండా ఎన్ని రోజులు ఈ తమాషాలు నడిపిస్తావు రేవంత్ రెడ్డి? అసలు ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఒక్క అధికారిక ప్రకటన రాలేదు.గతంలో హరీష్ రావుపై నమోదైన అక్రమ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. కానీ కేవలం హరీష్ రావుపై కుట్రతో జైలుకు పంపించాలన్న దురుద్దేశంతోనే సుప్రీంకోర్టులో ప్రజల డబ్బులు పెట్టి మరీ ప్రభుత్వం వాదించింది అని కేటీఆర్ గుర్తు చేశారు.

బొగ్గు కుంభ‌కోణం బ‌య‌ట‌పెట్టినందుకే హ‌రీశ్‌కు నోటీసులు

నిన్న సీఎం రేవంత్ రెడ్డి బావమరిది బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టినందువల్లనే సాయంత్రం వ‌ర‌కు హ‌రీశ్‌రావుకు నోటీసులు ఇవ్వడం జరిగింది. హరీష్ రావు బొగ్గు కుంభకోణంలో బయటపెట్టిన సమాచారం తప్పు అయితే సంబంధిత మంత్రి, సింగరేణి అధికారులు ఇప్పటిదాకా ఒక్కరూ ఎందుకు మాట్లాడలేదు? కాంగ్రెస్ కుంభకోణాలను బయటపెట్టిన ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం అటెన్షన్ డైవర్షన్ పనులు చేస్తున్నది. రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి కేంద్రంగా సింగరేణి టెండర్లను రిగ్గింగ్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా తొమ్మిది సింగరేణి టెండర్లను ముఖ్యమంత్రి కుటుంబం నియంత్రించింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా మైనస్ టెండర్లు పడే చోట అంచనా విలువకన్నా అధికంగా టెండర్లు వేశారు. సింగరేణిని ఒక బంగారు బాతు లాగా చూసి దీని నుంచి నిధులు, డబ్బులు కొల్లగొట్టేందుకు ఒక నిబంధన తీసుకువచ్చారు. టెండర్లు వేసిన కంపెనీ కచ్చితంగా సైట్ విజిట్ చేయాలి అన్న నిబంధన దేశంలో ఎక్కడా లేనివిధంగా పెట్టారు.. సింగరేణి అధికారుల నుంచి సైట్ విజిట్ సర్టిఫికెట్ తీసుకోవాలి. సైట్ విజిట్‌కు వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కంపెనీ సమాచారం, ఆ కంపెనీ డైరెక్టర్ల సమాచారం తీసుకుని బెదిరింపులకు దిగారు. ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డి స్వయంగా అందరినీ బెదిరిస్తున్నాడు. సర్టిఫికెట్ కోసం ఎవరైనా బెదిరింపులకు లొంగకుండా ఉంటే, సైట్ విజిట్ సర్టిఫికెట్ అర్హులైన కంపెనీలకు ఇవ్వడం లేదు అని కేటీఆర్ తెలిపారు.

కిష‌న్ రెడ్డికి కూడా వాటాలున్నాయా..?

భట్టి విక్రమార్క రద్దు చేశామని చెప్తున్న నైనీ కోల్ బ్లాక్స్ వెనుక కూడా ఇదే అక్రమ దందా నడుస్తున్నది. ఇతర కంపెనీలను అందరినీ బెదిరించి ఎక్కువ అంచనా విలువకు టెండర్లు వేయడం జరిగింది. అందుకే సృజన్ రెడ్డి కంపెనీకి కూడా అధిక విలువకు టెండర్లు దక్కించుకున్నారు. ఈ మొత్తం సింగరేణి అంశంలో ప్రధాన ముద్దాయి సృజన్ రెడ్డి.. ఈ సింగరేణి దొంగతనంలో బీజేపీకి వాటాలు లేకుంటే ఎందుకు స్పందించడం లేదు? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా బాధ్యత తీసుకోవాలి.. కేంద్రం, రాష్ట్రం భాగస్వాములుగా ఉన్న సింగరేణికి తీవ్రమైన ఆర్థిక నష్టం జరుగుతున్నప్పుడు ఎందుకు మౌనంగా కిషన్ రెడ్డి ఉన్నారు? కేంద్ర కోల్ శాఖ మంత్రి కిషన్ రెడ్డికి కూడా ఇందులో వాటాలు ఉన్నాయి అని అనుకోవాలి. వెంటనే ఈ అంశంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ వేయాలి అని డిమాండ్ చేస్తున్నాం. సింగరేణిలో కొంతమంది దోపిడీ చేస్తున్నారు అన్న అంశంపై.. సైట్ విజిటేషన్ సర్టిఫికెట్ వంటి అడ్డగోలు నిబంధన పెట్టిన విషయంపై విచారణ జరగాలి. నైనీ గనులతో పాటు మిగిలిన 9 కాంట్రాక్టులను రద్దు చేస్తారా లేదా అని హరీష్ రావు ప్రశ్నించారు. అందుకే అటెన్షన్ డైవర్షన్ కోసం నోటీసులు ఇవ్వడం జరిగింది అని కేటీఆర్ పేర్కొన్నారు.

1000 నోటీసులు ఇచ్చినా ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తూనే ఉంటాం..

గతంలో కూడా ఇదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అమృత్ టెండర్ల స్కాం, రేషన్ బియ్యం స్కాం, లగచర్ల, మూసీ అంశాల్లో కూడా మేము అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినప్పుడు, సాక్షాధారాలు చూపించినప్పుడు ఇదే అటెన్షన్ డైవర్షన్ చేసింది. అసెంబ్లీలోనే 8 మంది మంత్రులను ఎదుర్కొన్న హరీష్ రావును నలుగురు పోలీస్ అధికారుల ముందు కూర్చోబెడితే ఏమవుతుంది? కేవలం ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక రెండు సంవత్సరాలుగా అటెన్షన్ డైవర్షన్లకు పాల్పడుతున్నది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చట్టంపై, రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేదు. సుప్రీంకోర్టు స్వయంగా తెలంగాణలో టెలిఫోన్ ట్యాపింగ్ జరగలేదని చెప్పిన ఇదే అంశంలో నోటీసులు ఇచ్చింది. ఇలాంటి నోటీసులు 1000 ఇచ్చినా, సిట్ మరో 100 వేసినా ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం అని కేటీఆర్ తేల్చిచెప్పారు.

ఆ విష‌యంలో ఎందుకు సిట్ వేయ‌డం లేదు..?

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ చిహ్నం, తెలంగాణ బలం, తెలంగాణ గళం మా పార్టీ. కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చినా భయపడేది లేదు. ఎన్ని లీకులు ఇచ్చి వార్తలు రాపిచ్చుకున్నా భయపడేది లేదు. న్యాయస్థానాల్లో కొట్లాడుతూ న్యాయవ్యవస్థపై మాకు నమ్మకం ఉన్నది. నిజంగానే సిట్ వేయాల్సి వస్తే మంత్రుల రాచకాలు, అవినీతి, అక్రమాలపై వేయాల్సి ఉంటుంది. పొంగులేటి కొడుకు వందల మందితో వెళ్లి భూకబ్జాకు పాల్పడితే దానిపై సిట్ ఎందుకు వేయలేదు? ముఖ్యమంత్రి అనుచరుడు రోహిన్ రెడ్డి తుపాకీతో బెదిరించినప్పుడు.. ఏఐసీసీ కార్యదర్శి సంపత్ తుపాకీ ఎక్కుపెట్టి ఎనిమిది కోట్ల రూపాయల నగదు డిమాండ్ చేసినప్పుడు సిట్ ఎందుకు వేయలేదు? అమృత్ టెండర్ల స్కాంపై సృజన్ రెడ్డి అంశంలో సిట్ వేయాలి. మీడియా కథనంపై సిట్ వేసి అరెస్ట్ చేసినప్పుడు, మరో మీడియా సంస్థ భట్టి స్కాం చేసిందంటే ఎందుకు సిట్ వేయడం లేదు? కేవలం తెలంగాణ జర్నలిస్టులపై వేధింపులు చేసి అరెస్టులు చేస్తున్న రేవంత్ రెడ్డి, మీడియా సంస్థల యాజమాన్యాలపై చర్యలు తీసుకునే ధైర్యం ఉందా? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు.

పోలీస్ అధికారులను వదిలిపెట్టేది లేదు..

మరో రెండు సంవత్సరాల తర్వాత మా ప్రభుత్వం వస్తుంది అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి. మేము గత పది సంవత్సరాల్లో ఎప్పుడూ అధికార దుర్వినియోగం చేయలేదు, పోలీస్ వ్యవస్థను అరాచకాలకు, అక్రమాలకు వాడుకోలేదు. రేవంత్ రెడ్డి రాజకీయ క్రీడలో పోలీస్ అధికారులు కచ్చితంగా భవిష్యత్తులో బలి అవుతారు. పోలీస్ అధికారులు రిటైర్ అయిన తర్వాత కూడా ఇప్పుడు రెచ్చిపోయే పోలీస్ అధికారులను వదిలిపెట్టేది లేదు. అక్రమం అని తెలిసి కేసులు పెడుతున్న వారిని వదిలిపెట్టం. “ఎమర్జెన్సీ ఉంటే మీరంతా లోపల ఉండేవారు” అంటూ ఎక్కువ మాట్లాడుతున్న అధికారులు కూడా గుర్తుంచుకోవాలి అని కేటీఆర్ సూచించారు.

రేవంత్ రెడ్డి హార్వర్డ్ వెళ్లి ఏం చేస్తాడో అర్థమైత‌లేదు.. 

రేవంత్ రెడ్డి హార్వర్డ్ వెళ్లి ఏం చేస్తాడో అర్థమవుతలేదు. ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళని తిడతారేమో అక్కడ.. ఇంగ్లీషులో చదువు చెప్పేవాళ్లను కూడా బాత్రూంలో కడుక్కునే వాళ్ళని తిడతారేమో అని అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి హార్వ‌ర్డ్‌లో చదువుకున్న తర్వాత కొంత మంచిగా వస్తారని అనుకుంటున్నా. హార్వర్డ్‌లో చదివిన తర్వాత అయినా లాగులో తొండలు, మెడలో పేగుల వంటి మాటలు బంద్ చేస్తాడేమో చూడాలి. లేకుంటే అక్కడ కూడా ఇంగ్లీషులో మాట్లాడే ప్రొఫెసర్లను, విద్యార్థులను ఇక్కడ దూషించినట్లే దూషిస్తాడేమో అనిపిస్తుంది. ఆయనకి ఇంగ్లీషు రాదు.. రావలసిన అవసరం లేదని పదే పదే చెప్తాడు కదా మరి.. ఆయన అక్కడ ఇంగ్లీషులో నేర్చుకునేది ఏమిటో, చేసేదేమిటో, ఆయనకు సర్టిఫికెట్ ఎట్లా వస్తుందో కూడా తెలియదు అని కేటీఆర్ పేర్కొన్నారు.

బీఆర్ఎస్ జెండా గద్దెల‌ను ముట్టుకుంటే.. మీ గ‌ద్దెలు కూల‌డం ఖాయం..

కేవలం తనకు సొంత ఐడెంటిటీ లేకనే రేవంత్ రెడ్డి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. పార్టీ జెండా గద్దలను దమ్ముంటే ముట్టుకోండి.. మా జెండా గద్దెలను ముట్టుకుంటే మీ గద్దెలు పోతాయి. కేవలం తనను ఎవరు గుర్తుపట్టడం లేదన్న ఉద్దేశంతోనే పదేపదే అనేక పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నాడు. పది సంవత్సరాలలో మేము కూడా ఇతర ప్రతిపక్షాల పైన కాంగ్రెస్ మాదిరి మాట్లాడి దాడులు చేసి ఉంటే ఒక్కరు కూడా మిగలకుండా పోయేది. మా పార్టీ కార్యకర్తలు జెండా గద్దెలను ముట్టుకుంటే ఊరుకోరు అని కేటీఆర్ హెచ్చ‌రించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement