త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | సంచులు, చెప్పులు మోసే పార్టీల‌కా.. మనం ఓటు వేసేది : కేటీఆర్

KTR | ఒక‌డేమో మోసం చేసిన పార్టీ.. ఇంకోడేమో రూపాయి తేని పార్టీ.. ఒక‌డేమో ఢిల్లీకి సంచులు మోసే పార్టీ.. ఇంకోడేమో ఢిల్లీ వాళ్ల‌ చెప్పులు మోసే పార్టీ.. వీళ్ల‌కా మ‌నం ఓటు వేసేది అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.

S

Telangana | Published On Feb 6, 2026, 6.31 pm IST

KTR | సంచులు, చెప్పులు మోసే పార్టీల‌కా.. మనం ఓటు వేసేది : కేటీఆర్
Advertisement

ఆయ‌న ఆది శ్రీనివాస్ కాదు.. జేమ్స్ బాండ్
బాండ్ పేప‌ర్ చిత్తు కాగితంతో స‌మాన‌మైపోయింది..
క‌న్నీళ్ల‌కు ఓట్లు వేయకండి..
బీజేపోళ్లు బుడ్డ‌పైస ప‌ని చేశారా..?
మ‌రి ఎందుకు వారికి ఓటేయాలి..?
వేముల‌వాడ‌కు మేలు జ‌ర‌గాలంటే బీఆర్ఎస్‌కే ఓటేయాలి..
మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో కేటీఆర్ వ్యాఖ్య‌లు

KTR | త్రినేత్ర‌.న్యూస్ : ఒక‌డేమో మోసం చేసిన పార్టీ.. ఇంకోడేమో రూపాయి తేని పార్టీ.. ఒక‌డేమో ఢిల్లీకి సంచులు మోసే పార్టీ.. ఇంకోడేమో ఢిల్లీ వాళ్ల‌ చెప్పులు మోసే పార్టీ.. వీళ్ల‌కా మ‌నం ఓటు వేసేది అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. ఎట్టి ప‌నికి అయినా మ‌ట్టి ప‌నికి అయినా మ‌నోడు ఉండాలే. తెలంగాణకు మేలు జరగాలంటే మన బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. వేముల‌వాడ మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

రెండేండ్ల కింద జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌లు వ‌చ్చాయి.. నాలుగుసార్లు ఓడిపోయాను ఇప్పుడైనా గెలిపించండంటూ బ‌తిమాలాడారు. ఇంటింటికి తిరిగి దండం పెట్టి నేను చ‌నిపోతా అన్న‌డు. ఆరు గ్యారెంటీల‌ను 100 రోజుల్లో అమ‌లు చేస్తామ‌ని 100 రూపాయాల బాండు పేప‌ర్ మీద ఇక్క‌డున్న జేమ్స్ బాండ్ రాసిచ్చిండు. జేమ్స్ బాండ్ ఎవ‌రంటే ఆది శ్రీనివాస్. కానీ ఏ ఒక్క హామీ కూడా నెర‌వేర్చ‌లేదు. అన్ని అబ‌ద్ధాలు.. ఇప్పుడు మ‌ళ్లా ఓటేస్తే వేముల‌వాడ ప్ర‌జ‌ల‌కు తెలివిలేదు అనుకుంట‌డు. మ‌ళ్లా వెయ్యి చేతుల పెడితే గెలుస్తా అని జ‌బ్బ‌లు చ‌రుచుతుండు అని కేటీఆర్ మండిప‌డ్డారు.

మ‌గోళ్ల‌కు డబుల్ టికెట్ రేట్లు..

ఇక ఫ్రీ బ‌స్సు అని ఆడోళ్ల‌కు ఉచిత ప్ర‌యాణం క‌ల్పించి మ‌గోళ్ల‌కు డ‌బుల్ టికెట్ రేట్లు పెంచిండు. ఇది ఎట్ల ఫ్రీ అయిత‌ది. ఒక ఇంట్ల భార్యాభ‌ర్త‌లు బ‌స్సెక్కితే.. భార్య‌కు ఉచిత‌మ‌ని, భ‌ర్త‌తో డ‌బుల్ గుంజుతుండు. చేయి ఎత్తితే బ‌స్సు ఆపే ప‌రిస్థితి లేదు. ఒక వేళ బ‌స్సెక్కితే గౌర‌వం లేదు.. సీటు దొర‌క‌డం లేదు అని కేటీఆర్ అన్నారు.

లంగ‌, దొంగ మాట‌ల‌కు మోస‌పోకండి..

అసెంబ్లీ ఎన్నిక‌ల‌ప్పుడు నేను చ‌చ్చిపోత అని ల‌బ‌ల‌బ మొత్తుకుంటే ఆది శ్రీనివాస్‌కు ఓటేసిండ్రు. ఆయ‌న చ‌చ్చుడేమో కానీ కాంగ్రెస్ వ‌స్తే మ‌నం చ‌స్తాం అని చెప్పిన‌.. వేముల‌వాడ‌లో న‌మ్మ‌లేదు.. కానీ సిరిసిల్ల‌లో న‌మ్మిండ్రు. ఆది శ్రీనివాస్ రాసిచ్చిన బాండు పేప‌ర్‌కు వేముల‌వాడ‌లో విలువ ఉన్న‌దా..? అది చిత్తుకాగితంతో స‌మాన‌మైపోయింది. వేముల‌వాడ‌లో ఒక్క రూపాయి అభివృద్ధైనా జ‌రిగిందా..? గుండెమీద చేయి వేసుకోని ఆలోచించండి. లంగ‌మాట‌ల‌కు దొంగ మాట‌ల‌కు మోస‌పోతే గోస‌ప‌డేది మీరే.. మేం ఈ ఎన్నిక‌ల‌తో అధికారంలోకి రాం కానీ కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పే, చురుకు పెట్టే అవ‌కాశం మీకు వ‌చ్చింద‌ని ఓట‌ర్ల‌ను ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు.

వీళ్ల‌కా మ‌నం ఓటు వేసేది..

ఇక బీజేపోళ్లు సంద‌ట్లో స‌డేమియా అన్న‌ట్టు ఈ ఎన్నిక‌ల్లో జోర్రిండ్రు. ఈ ప‌న్నేండ్ల‌లో తెలంగాణ‌కు చేసేందీమీ లేదు. దేవుని పేరు చెప్పి ఓట్లు అడుక్కున్నారు త‌ప్ప వేముల‌వాడ‌కు ఒక్క రూపాయి ప‌ని చేశారా..? గుడికి, బ‌డికి పైస‌లు తెచ్చారా..? బుడ్డ‌పైస ప‌ని చేశారా..? మ‌రి ఎందుకు వేయాలి బీజేపీకి ఓటు. ఒక‌డేమో మోసం చేసిన పార్టీ. ఇంకోడేమో రూపాయి తేని పార్టీ. ఒక‌డేమో ఢిల్లీకి సంచులు మోసే పార్టీ. ఇంకోడేమో ఢిల్లీ వాళ్ల‌ చెప్పులు మోసే పార్టీ. దాని కోస‌మా మ‌నం ఓటు వేసేది. ఎట్టి ప‌నికి అయినా మ‌ట్టి ప‌నికి అయినా మ‌నోడు ఉండాలి. కేసీఆర్ బంగారం లాంటి అభ్య‌ర్థుల‌ను పంపిండు వారికి ఓటు వేయండి. మ‌నోడు ఉంటే ప‌ని అయిత‌ది.. ఢిల్లీకి గులాంగిరి చేసేటోడు ఉంటే మ‌నోళ్లు ఎన్న‌టికీ కారని కేటీఆర్ అన్నారు.

మోసాన్ని మోసంతోనే జ‌యించాలి..

క‌న్నీళ్ల‌కు ఓట్లు వేయ‌కండి.. ఒక‌వేళ వేస్తే మీరు ఏడ్చే రోజు వ‌స్త‌ది. కొంద‌రు కులం మతం అని అంట‌రు.. వ‌రుస‌లు క‌ల‌పుత‌రు.. కులం, మ‌తం అన్నం పెట్ట‌దు. గుణం ఉన్న నేత‌ల‌కు ఓటు వేయండి.. సేవ చేసే నాయ‌కుల‌కు ఓటు వేయండి. వేముల‌వాడ‌కు కేసీఆర్ ఎంతో చేశారు. కానీ సానుభూతికి ఆగ‌మై ఓటేశారు.. ఇప్పుడు బాధ‌ప‌డుతున్నారు. వేముల‌వాడ ప్ర‌జ‌ల‌కు ఇవాళ బంగారం లాంటి అవ‌కాశం దొరికింది. క‌ర్రుకాల్చి వాత‌పెట్టే అవ‌కాశం మ‌హిళ‌ల‌కు దొరికింది. మోసాన్ని మోసంతోనే జయించాలి.. ముల్లును ముల్లుతోనే తీయాలని కేటీఆర్ అన్నారు.

Advertisement
Advertisement